Pages

Friday 31 August 2012

గోకులం

యాదవ రాజ్యానికి ముఖ్యపట్టణం మధురానగరం. కాకినాడలో ఉన్నమధురానగర్ అన్న ప్రాంతంలోనే  కృష్ణుని ఆలయం `గోకులాన్ని` నిర్మించడం విశేషం. 
2 ఎకరాల విశాలమైన స్థలం
పచ్చని చేట్లు మరియు లాన్లు
దశావతారాలు, అష్టలక్ష్ములు
శ్రీకృష్ణ లీలలు, ధ్యాన మందిరం
సభావేదిక, చుట్టూ వాకింగ్ ట్రాక్
శ్రీకృష్ణ బృందావనం – మధురానగర్ లో గోకులం.

చిన్నికృష్ణుడు ఎన్నో చిలిపిపనులు చేసేవాడు. ఊరిలోఉన్న అందరి ఇంటికీ దొంగచాటుగావెళ్ళి ఉట్టిమీద ఉన్న పాలకుండలలోని వెన్న తాను తిని, తనమిత్రులకి కూడా పంచి వెళ్ళేముందు కాస్త వెన్నని నిద్రపోతున్న ఆ ఇంటి కోడళ్ళ మూతులకు రాసేవాడు. దానితో అత్తా కోడళ్ళ గొడవలు డైలీ సీరియళ్ళ స్థాయిలో జరిగేవి.కృష్ణుడు వెన్న దొంగ.
శ్రీకృష్ణుడ్ని వేణుగానలోలుడు అని పిలుస్తారు. అతని వేణుగానానికి పులకించనిది ఏదీ లేదు. ప్రకృతి, పశువులు, మనుష్యులు అనే భేదం లేకుండా ఆ సంగీతానికి మంత్రముగ్ధులు కావలసిందే. గోపకాంతలయితే తమ పనులను, సర్వస్వాన్నీ వదిలేసి ఆ మురళీ లోలునితో బృందావనంలో రాసలీలలలో తేలిపోయేవారు. 
బృందావనంలో కాళింది అనే మడుగు ఉంది. అందులో కాళీయుడు అనే రాక్షస సర్పం ఉండేది. దానివలన మడుగులో నీరు అంతా విషపూరితం అవడంతో కృష్ణుడు ఆ సర్పం పడగలమీద మర్దనం(నృత్యం) చేసి దానిని తరిమికొడతాడు.      

ముగ్ధ మనోహరమైన పాలరాతి కృష్ణుని ప్రతిమ - దర్శనం చేసుకొని, పచ్చని పరిసరాలని చూస్తూ కొంతసేపు వాకింగ్ ట్రాక్ లో నడచి, అక్కడ ఉన్న బెంచీలమీద కాలక్షేపం చేస్తే ఒక అందమైన సాయంత్రం ఆహ్లాదకరంగా గడుస్తుంది.
ఆదిలక్ష్మి అష్టలక్ష్ములలో మొదటిది.ఈమెనే వరలక్ష్మి అనికూడా పిలుస్తారు. ప్రాణాన్నీ ప్రసాదించేది ఆదిలక్ష్మే. ఆ ప్రాణాన్ని నిలుపుకోవడానికి కావలసిన అహారం ఇచ్చేది ధాన్యలక్ష్మి. ధైర్యాన్ని ధైర్యలక్ష్మీ, సౌభగ్యాన్ని గజలక్ష్మీ, సుభజాతకులగు సంతానాన్ని సంతానలక్ష్మీ, విజయాన్ని విజయలక్ష్మీ,విద్యను విద్యాలక్ష్మీ, సంపదని ధనలక్ష్మీ ప్రసాదిస్తారు. 
 Ashta Lakshmis - Statues of Ashta Lakshmi along the side of the walking track
వాకింగ్ ట్రాక్ వెంబడి అష్ఠ లక్ష్ములు, దశావతారాల ప్రతిమలు ఇంకా అక్కడక్కడా ఉన్న చిన్నికృష్ణుని లీలలను తెలియజెసే విగ్రహాలు హిందూ పురాణ విషయాలని రేఖా మాత్రంగా విశదపరుస్తాయి.
 Dasavatarams - Lord Vishnu`s ten incarnations
పండుగరోజులలో ఇక్కడ ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు.ముగ్గుల పోటీలు, పురాణ శ్రవణాలు, పిల్లలకీ పెద్దలకీ రకరకాల పోటీలు, పూజలు.. మొదలైనవి చాలా సందడి వాతావరణంలో జరుగుతాయి
Illuminated temple

© Dantuluri Kishore Varma

Saturday 25 August 2012

పవర్ కట్

గవర్నమెంట్ మాంత్రికుడు(గ.మా) రక్తపిశాచి(ర.పి)ని సృష్టించాడు. అప్పటికే అక్కడ ముందు సృష్టించిన పిశాచాలు చాలా ఉన్నయి.

ర.పి: నన్నెందుకు పిలిచారు?

గ.మా: ప్రజలకి నిద్ర, సుఖం ఉండడానికి వీలులేదు. చిన్నపిల్లలు హాయిగా ఆదమరచి నిద్రిస్తున్నప్పుడు, వాతావరణం బాగా వేడిగా ఉన్నప్పుడు. కరెంటు కట్ చెయ్యి. దోమలతో, ఉడుకుతో, నిద్రిలేమితో ప్రజలు అష్టకష్టాలు పడాలి.

ర.పి: రోజుకి ఎంతసేపు, ఏ సమయాలలో వాళ్ళని టార్చర్ చెయ్యాలి?

గ.మా. పిశాచాలకి సమయాసమయాలు ఉండవు.

ర.పి: ఇది ప్రజాస్వామ్యం. మనం ఏమి చేస్తున్నమో ప్రజలు తెలుసుకోవచ్చు. రైట్ టు ఇంఫర్మేషన్ ఆక్ట్ ఉందికదా? ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీసుకి ఫోన్ చేసి కరెంటు ఎప్పుడు ఇస్తారని ప్రాణాలు తోడేస్తారు.

గ.మా: డోంట్ వర్రీ. `దిస్ లైన్ ఈజ్ బిజీ` అనే మెసేజ్ సెట్ చేసుకో. ఫోన్లు చేసిచేసి విసుగెత్తి పోవాలి.

ర.పి: మనల్ని బండబూతులు తిట్టుకొంటారు.

గ.మా: హ..హ..హా.. వాళ్ళ తిట్లే మనకు దీవెనలు.

ర.పి: ఇంకొక్క చివరి డౌట్. ఇంతమంది రక్త పిశాచులు ఆల్ రెడీ ఉన్నరుకదా, మళ్ళీ నేనెందుకు?

గ.మా: డొంట్ బి ఫూలిష్! ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళదే! ఇప్పటికే ఆలస్యమైంది. మన మస్కిటో ఫ్రెండ్స్ రక్త తర్పణ కోసం ఆహాకారాలు చేస్తున్నయి. గో అండ్ కట్ పవర్. హర్రీ అప్!
(ఆంధ్రాలో పవర్ కట్ ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉంది. సిటీ, టౌన్, విలేజ్ అనే తేడా లేకుండా రోజుకి ఆరు నుంచి ఎనిమిది గంటల వరకూ కరెంట్ కట్ చేస్తున్నారు. వేసవి వెళ్ళి వర్షాకాలం వచ్చినా ఈ పరిస్థితిలో మార్పు లేదు. రాత్రి, తెల్లవారుజాము పవర్ కట్స్ వల్ల పిల్లలు, ముసలివాళ్ళు దోమలతొ, నిద్రలేమితో అష్టకష్టాలు పడుతున్నరు. స్టూడెంట్స్ హోంవర్కులు చేయ్యలేక, పరీక్షలకి తయారవలేక అవస్థపడుతున్నరు. చాలా ఇండస్ట్రీలు ప్రొడక్షన్ తగ్గించుకొంటే, మరికొన్ని మూతపడుతున్నాయి. వాటర్ మోటారులమీద ఆధారపడిన వ్యవసాయ పొలాలకి నీరందడం లేదు. ఉద్యోగస్తులు ఆఫీసుల్లో ముందురాత్రి కోల్పోయిన నిద్రని భర్తీ చేసేపనిలో ఉన్నారు. కరెంట్ కట్ అంటే అందరికీ షాకే! )
© Dantuluri Kishore Varma

Friday 24 August 2012

ఆటోరాజా

యానం పాత బస్టాండ్ దగ్గరకి వచ్చి కాకినాడ బస్ కోసం ఎదురుచూడడం మొదలు పెట్టి గంట దాటింది.


"బస్ కోసం, పోయిన కరెంటు కోసం ఎదురుచూడడం అంత బుద్ది తక్కువపని మరొకటి లేదు,"అని తిడుతున్నాడు ఒక పెద్దాయన.

బస్టాపుకి కొంచెం దూరంలో నిలిపిఉంది ఒక పాసింజర్ ఆటో. దాని వెనుక పేనల్ మీద 'ఆటో రాజానా మజాకా' అన్న కేప్షన్ ఎర్ర అక్షరాలతో రాసి ఉంది.  

ఆటో ముందు సీటులో మోకాళ్ళూ, బుర్రా బయటకుపెట్టి కుర్చున్న ఆటోరాజా, నేను ఆటో వైపు చూడటం గమనించి, "రండి సార్, పోదాం," అన్నాడు. వాడలా అడగడం అప్పటికి ఆరోసారి.  

 "పైకా, పోవడం? హూ!" అన్నడు నాప్రక్కన ఉన్నాయన. "ఆటో ఎక్కితే సరాసరి నరకానికి పోయినట్టే" అనికూడా అన్నడు. 

హేంలెట్ స్వగతించిన్నట్లు `టు బి ఆర్ నాట్ టు బి - దటిజ్ ద క్వశ్చన్`. ఆటోలో ఎక్కడమో, బస్ కోసం వేచిఉండటమో తెలియడం లేదు.

"రారా వెళ్దాం. ఇక్కడ నుంచుని టైం వేస్టు," అనుకొంటూ ఇద్దరు కాలేజీ కుర్రాళ్ళు ఆటో వైపు నడవడంతో, కొంచం తటపటాయించి నేనుకూడా వాళ్ళని అనుసరించాను.

మూడు టిక్కెట్లు ఒకేసారి వచ్చిన ఆనందం ఆటోరాజా మొహంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది."ఎక్కండి," అన్నాడు . 

ఒక చేపలమ్మీ, ఓ ఇన్షర్టాయన కొంచెం సర్దుకొని చోటిచ్చారు. ఎక్కి, "పోనియ్" అన్నాం.

ఆటోరాజా పోకెట్ లోంచి కర్చీఫ్ తీసి, దులిపి షర్ట్ కాలర్ లోపలినుంచి మెడచుట్టూ తిప్పి, ముందువైపు ముడివేసుకొన్నాడు. బ్లాక్ గాగుల్స్ తీసి రజనీకాంత్ స్టైల్ లో వేళ్ళమీద `ట్రియుం... ట్రియుం...` అని తిప్పి కళ్ళకి పెట్టుకొని, "టికెట్లు ఎక్కిందాకా ఆగాలి," అన్నడు కేర్లెస్ గా.

అయిదు నిమిషాలలో ఇంకొక ఇద్దర్ని పట్టాడు. వాళ్ళనికూడా లోపలికి కుక్కిన తరువాత, మళ్ళీ వెయిటింగ్.

"ఏం నాయనా, ఇంకా ఎక్కడ ఎక్కిస్తావ్," అంటుంది చేపలమ్మి.

"నువ్విచ్చే పదిహేనురూపాయలకీ టాక్సీ వస్తుందా? కస్టంగా ఉంటే దిగిపో," అని గదమాయించాడు.

"ఏమన్నా ప్రమాదమే వీడితో," అని కుక్కిన పేనుల్ల, కిక్కురుమనకుండా కూర్చున్నాం.

రెండు నిమిషాలు గడిచింది. రాని బస్సు, కదలని ఆటో, నకనకలాడుతున్న ఆకలి. ఆటో కదిలే అమృత గడియల కోసం చకోరపక్షుల్లా ఉన్నాం.

సడన్ గా ఆటోరాజాలో మార్పు వచ్చింది. నిప్పుకోడిలా మెడ ముందుకి చాపాడు, చెవులు రిక్కించాడు, ఒక్కసారి డ్రైవర్ సీటులోకి లంఘించి, కిక్ రాడ్ బలంగా లాగి, గేరుమార్చి ఆటోని ముందుకి ఉరికించాడు.
  
ఏమైందో అర్ధంకాక అయోమయంగా అటూ ఇటూ చూస్తున్న మాకు వెనుకనుంచి మలుపుతిరిగి బస్టాపు వైపు వస్తున్న కాకినాడబస్సు కనిపించి - "ఆర్నీ," అనుకొన్నాం.

***

స్టాపుకీ, స్టాపుకీ మధ్య రాకెట్ లాగ దూసుకుపోతుంది ఆటో. బైకు, కారు, లారీ... అన్నీ సైడు ఇచ్చేస్తున్నాయి. ఒకచేతితో సెల్ ఫోను మాట్లాడుతున్నాడు, స్పీకర్లలోంచి హిందీయో, ఇంగ్లీషో తెలియని పాట ఒకటి చెవులు గళ్ళెక్కిస్తుంది. వెనుక వచ్చే ఆర్టీసీ బస్సుకి ఓవర్ టేక్ చేసే అవకాశం ఇవ్వకుండా పోనిస్తున్నాడు. నువ్వునాకు నచ్చావు సినిమాలో రోలర్ కోస్టర్ ఎక్కిన బ్రహ్మానందం లాగ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని కూర్చున్నాం.

ఒకచోట ఒకరు దిగితే, పక్క స్టాపులో ఇద్దరిని ఎక్కిస్తున్నాడు. చెడిపోయిన గొడుగులోనుంచి ఊచలు వచ్చినట్టు పాసింజర్ల కాళ్ళూ, చేతులూ ఆటోలోంచి బయటకు పొడుచుకు వచ్చేశాయి. నిండా బట్టలుపెట్టిన బ్యాగ్ జిప్ తెగిపోతే ఎలా ఉంటుందో మా ఆటో అలా ఉంది.

"మొన్న అలాగేనండి, ఆటో ఏక్సిడెంటు జరిగి ఆరుగురు అక్కడికక్కడే ఠా," అంటున్నాడు ఒకడు. తెలుగు మసాలా సినిమా వయొలెన్స్ సీన్ లోలాగ ఏక్సిడెంటు విక్టింసు ఎలా పచ్చడి అయిపోయారో వివరించి చెబుతుంటే వినేవాళ్ళందరికీ గుండె ఝల్లుమంటుంది.

కోరంగి దగ్గరికి వచ్చేసరికి, ఎదుటినుంచి వచ్చే వేరే ఆటో డ్రైవర్, ఆటోరాజాకి ఏదో సిగ్నల్ ఇచ్చాడు. ఒక్కసారి మా ఆటో రెండు చెక్రాలమీద యూ-టర్న్ తీసుకొని రోడ్డుకి అటువైపు వెళ్ళిపోయింది. ఊహించని ఈ సడన్ జెర్క్ కి మా బుర్రలు ఇనుపకమ్మెలకి, మిగిలిన బుర్రలకీ కొట్టుకొని బొప్పికట్టేశాయి. వెనుకవస్తున్న బైకర్ సడన్ బ్రేక్ కొట్టడంతో స్కిడ్ అయ్యి, అతి కష్టం మీద పడకుండా నిలదొక్కుకొన్నాడు.

"బండి కొనగానే సరిపోదు, నడపడం రావాలి," అని మా హీరో బైకర్ని తిట్టేసరికి, బూకరించి బతికేస్తున్న ఆటోరాజాని చూసి మా మతులు పోయాయి. 

మీటింగ్ పుర్తిచేసి రోడ్డు ఎక్కించిన ఆటో నిమిషం కూడా కాకుండానే చెట్టుకింద ఆపేశాడు. "ఏమైంది?" అన్నాం అందరం. "డబ్బులు," అన్నాడు. "ఆర్టీసీ వాడు బస్సాపి టిక్కెట్లు కొట్టినట్టు ఇదేంటి?" అని ఎంత చెప్పినా వినకుండా మా అందరి దగ్గరా ఫేర్ వసూలు చేసేశాడు.

ఈ కార్యక్రమం పూర్తయిన తరువాతకూడా బండి కదలక పోవడంతో, మా కోపం నషాళానికి అంటింది. "ఏంటి మళ్ళీ ప్రోబ్లం?" అన్నాం.

"కనిపించడంలేదా? ఎదర పోలీస్ స్టేషన్ దగ్గర ట్రాఫిక్కోళ్ళు చెకింగు చేస్తున్నారు. ముందుకెళితే దొరికిపోతాం. మనం వెళ్ళాలంటే అది పూర్తవ్వాల్సిందే. లేటవుతుందనుకొంటే అదిగో బస్సు వస్తుంది ఎక్కేయండి," అన్నాడు.

ఆశ్చర్యంతో తెరుచుకొన్న మానోళ్ళు కాకినాడ వచ్చేవరకూ మూసుకోలేదంటే నమ్మండి.

ఆటోరాజానా మజాకా?
© Dantuluri Kishore Varma

Wednesday 22 August 2012

జానపదం - అంతర్జాతీయ జానపద దినోత్సవం

భాషలకి లిపి లేని అతి పురాతనమైన కాలం నుంచీ సంస్కృతిని కథలు, పాటలు, సామెతలు, హరికథలు, బుర్రకథలు, తోలుబొమ్మలాటలు...గా  కూర్చి తరతరాలుగా ఒకరినుంచి ఒకరికి మౌఖికంగా అందిస్తూ సజీవంగా ఉంచిన జాన పద కళారూపాలకు ఏ దేశమైనా, ఏ భాషైనా ఋణపడి ఉండవలసిందే.

అమ్మపాడే లాలిపాట; తాత చెప్పే టక్కుటమార మాంత్రికుల, అపురూప సౌందర్య రాకుమార్తెల, సౌర్య సుందర రాజకుమారుల కథలు; పొలంలో కలుపు తిసే పాట, నాట్లు వేసే పాట, కుప్ప నూర్చే పాట, నావమీద సరంగు దూరంగా ఉన్న ప్రియురాలిని తలచుకొంటూ పాడే విరహపు పాట, పండుగ పాట; హరిదాసు సంకీర్తన; బుర్రకథలో  పరాక్రమ వర్ణన, కరుణరస పోషణ;    వీధినాటకాలలో చాంతాడు నిడివి సంభాషణలు; పామరులుకూడా అలవోకగా చెప్పె సామెతలు - ఎవరు నేర్పేరు వీళ్ళందరికీ ఈ విధ్యలన్నీ, ఏ బడిలో చదువుకొన్నారని?
కాలం మారేకోద్దీ మనం ముందుకో, వెనక్కో వెళుతున్నాం.

పిల్ల ఏడుస్తుందని తల్లిపాడే పనిలేదు - తండ్రి దగ్గరి స్మార్ట్ ఫోన్లులో లేదా ఐపోడ్ లో జస్టిన్ బైబరో మరెవరిదో సాంగ్ రెడీగా ఉంటుంది. సెమీ అర్బనైజ్ అయిన పల్లెల్లో పొలం పాటో, సరంగు పాటో వినే అదృష్టం ఎప్పుడో కోల్పోయాం."తోలుబొమ్మలాట అంటే `దశావతారం` సినిమాలో `ముకుందా...ముకుందా...` అనే పాటలో చూపించారు చూడు,"  అనే దాకా వచ్చాం.

కథలువినడానికి - చెప్పే తాతలూ, బామ్మలూ ఎక్కడో పల్లెలోనో, వృద్దాశ్రమంలోనో ఎప్పుడూరాని మనకోసం ఎదురుచూసే చకోరపక్షులు. పిల్లలదగ్గర ఎవరైనా తెలుగు సామెతలు చెబితే, "పల్లెటూరి స్లాంగ్ నేర్పి పిల్లలిని పాడుచేస్తున్నరని," విసుక్కోంటాం. హరికథలు, బుర్రకథలు, వీధినాటకాలు వెంటిలేటర్లమీద తుదిశ్వాశ తీసుకొంటున్నాయి.

జానపదమంటే ప్లాస్టిక్ పూల అలంకరణలతో, ఆర్బాటమైన టీ.వీ. రియాలిటీ షో సెట్టింగులమీద గొంతెత్తిపాడే కళాకారులు, వాళ్ళని కృతకంగా అనుకరించే ఏంకర్లు, "మైండ్ బ్లోయింగ్," అని అరిచే జడ్జీలే మనకి గుర్తుకువచ్చేది.

ఒకప్పటి పామరుడైన పశువులకాపరికి, ఈ రోజు అతిపెద్ద కార్పొరేట్ స్కూల్లో చదివే అదే వయసు పిల్లోడి కంటే మన సంసృతి గురించి, సాంప్రదాయాల గురించి, పురాణా గురించి, ఇతిహాసాల గురించి నిశ్సందేహంగా ఎక్కువ తెలిసి ఉండేది. విచారించవలసిన విషయమే. కానీ ఏమిచేస్తాం! ఈ రోజు (22.08.2012) అంతర్జాతీయ జానపద దినోత్సవం (వాల్డ్ ఫోక్లోర్ డే). విచారంగానో, ఆనందంగానో మన జానపద కళలని గుర్తుచేసుకొందాం.

     © Dantuluri Kishore Varma

Sunday 19 August 2012

కాంక్రిట్ జంగిల్ లో జీవనవైవిధ్యం

సెంట్రల్ జూ అధారిటీచే మినీ జూగా గుర్తింపబడిన కే.వీ.కే రాజు సుందరవనం ఎన్.ఎఫ్.సీ.ఎల్ గ్రీన్ బెల్ట్ లో ఉంది
నెమళ్ళు, ఈమూ పక్షులు, తాబేళ్ళు, తొండాపుకోళ్ళు అనబడే పక్షులు, మనదేశంలో అరుదుగా ఉండే గునియా పిగ్స్(నిజానికి ఇవి పిగ్స్ కాదు. తోకలేని ఎలుకలా ఉండే జంతువులు)....
గునియా పిగ్స్
ఖజానా బాతులు, మచ్చల జింకలు, వీటికంటే పెద్దగా ఉండే అడవి జింకలు, దుప్పులు, లవ్ బర్డ్స్, కుందేళ్ళు... వంటి జంతువులని ఇక్కడ సంరక్షిస్తున్నారు. 
పచ్చికాయగూరలని తరిగి తాబేళ్ళకు ఆహారంగా వేస్తున్నారు.
పరిశ్రమ ప్రకృతి తో మమేకమై ఉండాలనే ఆలోచనతో అభివృద్ది చేసినట్లు నాగార్జునా ఎరువుల కర్మాగారం చుట్టూ పెంచిన గ్రీన్ బెల్ట్, పట్టణం మధ్యలో నిజమైన అడవిలా ఉంటుంది.   
సుమారు 170 రకాలకి చెందిన 4 లక్షల వృక్షాలు ఇక్కడ ఉన్నాయి.
ఒక్కరోజు ఈ అడవి దారుల వెంట నడక ఒక సంవత్సరపు బడలికని పోగొడుతుంది.
ఎఫారెస్టేషన్ కోసం ప్రత్యేకంగా నర్సరీ అభివృద్ది చేశారు.
జలచరాలకి, వలసపక్షులకి, జంతువుల నీటి అవసరాలకి 11 చలమలు, చెరువులు ఉన్నాయి. 
ఫ్రెంచ్ రచయిత మార్సెల్ ప్రౌస్ట్ చెప్పినట్టు- The real voyage of discovery consists not in seeking new landscapes but in having new eyes.
140 రకాల జీవజాతులతో, 700 ఎకరాలు విస్తీర్ణంలో మొత్తం పరిశ్రమ వైశాల్యంలో రమారమి 70 శాతం గ్రీన్ బెల్ట్ కి కేటాయించి నాగార్జునా ఫెర్టిలైజర్స్ మిగిలిన పరిశ్రమలకి ఆదర్శ ప్రాయంగా ఉంది.
మనకాకినాడలో మనిషి సృష్ఠించిన అరణ్యం, జనారణ్యంలో మినీ జూ, కాంక్రిట్ జంగిల్ లో జీవనవైవిధ్యం...  
Hats off to NFCL.
© Dantuluri Kishore Varma

Sunday 12 August 2012

గాంధీ మందిరం

గాంధీగారు కాకినాడ వచ్చిన సందర్భానికి గుర్తుగా 1950 లో గాంధీ మందిరం నిర్మించారు, తరువాత పాత భవనం స్థానంలో 2008లో ప్రస్తుతం ఉన్న భవనాన్ని నిర్మించారు.సాంబమూర్తి నగర్ ఓవర్ బ్రిడ్జికి దగ్గర, మునిసిపల్ ఆఫీస్ వెనుకవైపు `గాంధీ మందిరం` ఉంది. 
మొదటిలో ప్రపంచం నిన్ను గుర్తించదు, తరువాత నిన్ను చూసినవ్వుతుంది, నీమీద యుద్దంచేస్తుంది. కానీ చివరికి నువ్వే గెలుస్తావు అంటాడు గాంధీజీ. 
ప్రతీ అడుగులోనూ గాంధీగారు చెప్పిన సక్సెస్ మంత్రాన్ని జ్ఞాపకం చేసుకొందాం.  మన పనికి గుర్తింపులేదని నిరుత్సాహపడినా, నవ్వారని చిన్నబుచ్చుకొన్నా, ప్రతికూల పరిస్థితులని సృస్టించారని పారిపోయినా పరాజితులమౌతాం. ఏపనిచేస్తూఉన్నా గెలుపుమీద దృష్టినిలిపి, గాంధీజీ మాటలని జ్ఞాపకం ఉంచుకొని, ముందుకు సాగితే ధృఢనిశ్చయం కలుగుతుంది. విజయం మన సొంతమౌతుంది. 

నూలుఒడుకుతున్న గాంధీగారి కాంస్య విగ్రహం, ఆయన జీవితంలో ముఖ్యమైన సంఘటనల్ని తెలియజేసే ఫొటోగ్రాఫులు, పోట్రైట్లు ఉంచారు.
మహాత్ముని ఆటోబయోగ్రఫీ `స్టోరీ ఆఫ్ మై ఎక్ష్పెరిమెంట్స్ విత్ ట్రూత్` చదువుతున్నప్పుడు, ఆపుస్తకంలో మనం చూడని ఫోటో లు మనకి ఇక్కడ కనిపిస్తాయి.
పచ్చని లాన్తో, గార్డెన్తో జనసమ్మర్ధం ఎక్కువగా ఉండని గాంధీ మందిరం దగ్గర కొంతసేపు మహాత్ముని ఆదర్శాలని, సత్యనిష్ఠని జ్ఞాపకం చేసుకొంటే బాగుంటుంది. 
100 మందీ, 200 మందీ పట్టే రెండు మీటింగ్ హాల్స్ ఉన్నాయి. పెళ్ళిల్ల లాంటివి కాకుండా మిగిలిన గెట్ టుగేదర్లకి ఈ మీటింగ్ హాళ్ళని నామమాత్రపు అద్దెకి ఇస్తున్నారు. లైబ్రరీ కూడా ఉంది. 
ప్రతీరోజూ ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ, మళ్ళీ సాయంత్రం 4 నుంచి 6 గంటలవరకూ మందిరం మరియూ లైబ్రరీలు తెరుస్తారు. శుక్రవారాలు శెలవు.    
రఘుపతి రాఘవ రాజారాం
పతీత పావన సీతారాం
ఈశ్వర్ అల్లా తేరోనాం 
సబ్ కో సన్మతి దే భగవాన్    

మహాత్మా గాంధీ జీవితచరిత్ర అయిదు గంటల నిడివి గల డాక్యుమెంటరీ ఇక్కడ చూడండి

© Dantuluri Kishore Varma

Friday 10 August 2012

`మహర్షి` బులుసు సాంబమూర్తి

స్వాతంత్ర్య సమర యోధుడు బులుసు సాంబమూర్తిని `మహర్షి` అని వ్యవహరించడంలోనే ఆయన వ్యక్తిత్వం వ్యక్తమౌతుంది. 1923లో కాకినాడలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సభలు జరిగినప్పుడు వాటి నిర్వాహణా బాధ్యతని సాంబమూర్తి గారికి అప్పగించారు. అంతకు కొన్నిరోజుల ముందు ఆయన ఏకైక కుమారుడు మరణించినా చలించకుండా తన కర్తవ్య నిర్వాహణ చేశారు. ఈ సందర్భంలో దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ "తన కన్నిటిని ముత్యాలుగా మార్చి ఈ సభలకు విచ్చేసిన నాయకులను ఆహ్వానించారని" చెప్పారట.

మనకి పూర్ణ స్వరాజ్యం కావాలని 1923 సభలలోనే సాంబమూర్తిగారు ప్రతిపాదించినా, అప్పటి నాయకులు దానికి అంగీకరించలేదని చెబుతారు. ఎట్టకేలకు 1929లో లాహోర్ కాంగ్రెస్ సభల సమయంలో పూర్ణస్వరాజ్య ప్రతిపాదన జరిగింది. 1930 ఉప్పుసత్యాగ్రహ సమయంలో తన సహచరులతో చొల్లంగి సముద్రతీరానికి వెళ్ళి ఉప్పును తయారుచేశారు. కోస్తాతీరం ప్రజలు ఈ సంఘటనవల్ల చాలా ప్రభావితులయ్యారు. అప్పటిలో సాంబమూర్తిగారిని అరెస్టుచేసి వెల్లూరు జైలుకి తరలించారు. 1935లో మద్రాసు ప్రోవిన్షియల్ ఎస్సెంబ్లీకి జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయంసాదించినప్పుడు, సీ.రాజగోపాలాచారి ముఖ్యమంత్రిగా ప్రభుత్యాన్ని ఏర్పాటుచేశారు. సాంబమూర్తిగారు 1937 నుంచి 1942 వరకూ స్పీకరుగా ఉన్నారు. 
 స్పీకరుగా
మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చినతరువాతకూడా ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం కోసం జరిగిన పొరాటంలో ముఖ్యపాత్ర పోషించారు. ఇంతటి విశేష వ్యక్తిత్వం గల ఈయన తూర్పుగోదావరి జిల్లాలో దుళ్ళ గ్రామంలో బ్రాహ్మణ వేదపండితుల ఇంటిలో జన్మించారు(1886).విజయనగరంలో మహారాజా కాలేజీలో పట్టబద్రులై, అక్కడే కొంతకాలం అధ్యాపకుడిగా ఉన్నారు. తరువాత కాకినాడలో క్రిమినల్ లాయరుగా మంచిపేరు గడించారు. ఇక్కడే స్థిరపడ్డారు.

విచారించవలసిన విషయం ఏమిటంటే, తనచివరిరోజులు పేదరికంలో, అనారోగ్యంతో గడిపి, ప్రభుత్వం చేత నిర్లక్ష్యం చేయబడి 1958వ సంవత్సరంలో మరణించారు.
            2008లో పోస్టల్ డిపార్టుమెంట్ విడుదల చేసిన మహర్షి బులుసు సాంబమూర్తి పోస్టల్ స్టాంపు

© Dantuluri Kishore Varma 

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!