Pages

Wednesday 16 January 2013

కోనసీమ ప్రభలతీర్థాలు

కోనసీమలో సంక్రాంతి తరువాతి రోజయిన కనుమనాడు వందల సంవత్సరాలుగా అప్రతిహతంగా ప్రభలతీర్థాలు జరుగుతున్నాయి. ప్రభలు అంటే దేవుని వాహనాలు. కొత్తవెదురుతో శివలింగాకారంలో కట్టి, రంగురంగుల దుస్తులు, నెమలిపించాలు, పువ్వులు, కాగితం జండాలు అలంకరించి శివుడిని ఆశీనుడిని చేయ్యడానికి ఆసనం ఏర్పాటుచేసి పల్లకీలా తయారుచేస్తారు. ఈ ప్రభలని సాక్షాత్తు వీరభద్రునిగా భావిస్తారు. వివిధ ఊళ్ళల్లో ఉన్న శివాలయాలనుంచి ప్రభలను భుజాలమీద మోసుకొంటూ `అ్‌హోం భొహోం భోం...` అంటూ, వెంటవచ్చిన జనాలు `శరభ, శరభ అశ్సరభ శరభ....` అని జయజయధ్వానాలు చేస్తుండగా   ఊరేగింపుగా తీర్థస్తలికి తీసుకొనివెళతారు. గరగనృత్యాలు, డప్పువాద్యాలు, సన్నాయిమేళాలు, విచిత్రవేషాలు, బాణాసంచా కాల్పులతో ఊరేగింపు ముందుకు వెళుతుంది. అందంగా తయారయిన ఎడ్లబళ్ళమీద కోనసీమవాసులు కదిలి వస్తారు. వందకు మించిన గ్రామాలలో ప్రభల తీర్థం జరుగుతుంది. దేశంలో వివిధ ప్రాంతాలనుంచి, విదేశాలనుంచి పల్లెల్లో ఉన్న బందువుల ఇళ్ళకి వచ్చి ఈ ఉత్సవాలను చూడటానికి ప్రజలు తహతహలాడతారు. 

అంబాజీపేట మండలం మొసలపల్లి దగ్గర 11గ్రామాలకి పొలిమేరగా ఉన్న జగ్గన్నతోట అనే ఏడెకరాల కొబ్బరితోటలో ఏకాదశ(11 మంది) రుద్రుల సంగమంగా జరిగేతీర్థం కోనసీమలో మిగిలిని అన్ని చోట్లా జరిగేదానికంటే కూడా విశేషమైంది. దేశం మొత్తం మీద పదకొండు మంది రుద్రులు కొలువుతీరే ఒకేఒక ఉత్సవం జగ్గన్నతోటలోనే జరుగుతుంది. 17వ శతాబ్ధంలో ఈ సాంప్రదాయం మొదలైందని చెపుతారు. విఠల జగన్నాధుడనే శివభక్తుడు ఉండేవాడట. ఆయన ఏక సంతాగ్రాహి. ప్రస్తుతం జగ్గన్నతోట అని పిలవబడుతున్న ప్రదేశంలో శివజపం చేసుకొంటూ ఉండేవాడు. పెద్దాపురం సంస్థానంలో భాగంగా ఉన్న ఈ ప్రాంతం, నిజాం ఆదీనంలోనిది. అందువల్ల శివధ్యానానికి అడ్డుచెబుతారు. విఠల జగన్నాధుడు సరాసరి నవాబుతోనే మాట్లాడే ఉద్దేశ్యంతో హైదరాబాదు వెళతాడు. అక్కడ నవాబుని కలవడానికి ముందే ఓ ఇద్దరు ముస్లిం వ్యక్తుల ఘర్షణ పడుతుండగా చూస్తాడు. ఆ తగాదా నవాబు దగ్గరకి వెళుతుంది. జగన్నాధపండితుడు  ఒక్కడే సాక్షిగా ఉండడంవల్ల అతనిని కూడా పిలుచుకువెళతారు. ఉర్దూ భాషలో జరిగిన గొడవని యదాతదంగా చెప్పడంతో నవాబు ఆశ్చర్యపోతాడు. అతను ఏకసంతాగ్రాహి అని తెలుసుకొని, మరికొంత పరీక్షించదలచి, కొరాను నుంచి కొంతభాగం చదివి వినిపించి తిరిగి చెప్పమంటాడు. అక్షరం పొల్లుపోకుండా విఠల జగన్నాధుడు దాన్ని తిరిగి చెప్పడంతో సంతోషించి, జపానికి అనుమతినిచ్చి, దానితోపాటు ఎనిమిది పుట్ల(64 ఎకరాలు) స్థలము ఇచ్చి సగౌరవంగా పంపిస్తాడు. ఆ ప్రాంతంలోనిదే జగ్గన్నతోట. ఆ శివభక్త పండితుని కోరికమీద ఏకాదశ రుద్రులు లోకకళ్యాణార్ధం ఈ ప్రదేశంలో సమావేశమవ్వడం మొదలుపెట్టారని పురాణం చెబుతుంది.

ఏకాదశ రుద్రులు వీళ్ళే:
1. గంగలకుర్రు - చెన్నమల్లేశ్వరస్వామి
2. గంగలకుర్రు అగ్రహారం - వీరేశ్వరస్వామి
3. వ్యాఘ్రేస్వరం - వ్యాఘ్రేశ్వరస్వామి
4. మొసలపల్లి - మధుమాసాంత భోగేశ్వరస్వామి
5. పెదపూడి - మేనకేశ్వరస్వామి
6. ఇరుసుమండ - ఆనందరామేశ్వరస్వామి
7. ముక్కామల - రాఘవేశ్వరస్వామి
8. వక్కలంక - కాశీవిశ్వేశ్వరస్వామి
9. పుల్లేటికుర్రు - అభినవ వ్యాఘ్రేశ్వరస్వామి
10. పాలగుమ్మి - చెన్న మల్లేశ్వరస్వామి
11. నేదునూరు - చెన్న మల్లేశ్వరస్వామి 


గంగలకుర్రు, గంగలకుర్రు అగ్రహారం ప్రభలు జగ్గన్నతోటకి చేరుకొనే క్రమం చాలా ఉద్వేగభరితంగా, విలక్షణంగా ఉంటుంది. ఈ ప్రాంతాలకీ, తీర్థస్థలికీ మధ్య కౌసిక్ డ్రెయిన్ (కాలువ) మీద వంతెన ఉన్నా, రోడ్డుమీదుగా వంతెన దాటించి తీసుకొని రారు! అందుకు బదులుగా వరిచేలు తొక్కుకొంటూ, కాలువదాటించి తీసుకొని వస్తారు. కాలువ ఇరు గట్లమీదా, వంతెనమీదా వేలకొలదీ జనాలు వీక్షిస్తూ ఉండగా బజంత్రీలతో, బాణాసంచా కాల్పులతో మెడలోతు కాలువలోనుంచి ప్రభలు తడవకుండా చేతులమీద పైకి ఎత్తి మోస్తూ నలభై, యాభై మంది భక్తులు నీటిని అతలాకుతలంగా చేస్తూ అవతలి ఒడ్డుకి చేరుస్తారు. ఇది వర్ణనాతీతమైన అపురూప దృశ్యం. (ఇంతకంటే మంచి క్వాలిటీ ఫోటో ప్రస్తుతానికి ఇవ్వలేకపోతున్నందుకు క్షమించాలి)

జగ్గన్నతోట తరువాత అంత పెద్ద ఎత్తున అంబాజీపేట, కొత్తపేటలలో(ఇక్కడ సంక్రాంతి రోజు జరుపుతారు) కూడా ప్రభలతీర్థం జరుగుతుంది. సుమారు వంద ప్రాంతాలలో వీటిని నిర్వహిస్తారు కనుక కోనసీమ ఆచివరినుంచి, ఈ చివరివరకూ ప్రజలందరికీ పెద్దపండుగంటే ప్రభల తీర్థమే! తీర్థం పూర్తయిన తరువాత అర్ధరాత్రినుంచి, తెల్లవారినవరకూ బాణాసంచా కాలుస్తారు. తరువాత ప్రభలు వెనుదిరిగి తమతమ గ్రామాలకు చేరుకొంటాయి.

© Dantuluri Kishore Varma

14 comments:

  1. బాగుంది. ఏకాదశ రుద్రులు, అష్టాదస కాదు

    ReplyDelete
  2. ధన్యవాదాలు నారాయణస్వామి గారు.

    ReplyDelete
  3. వివరణ చాలా బాగుంది. ఫొటోలు ఇంకా పెట్టుంటే ఇంకా బాగుండేది. అయినా, ఆ లోటు,
    "సాక్షి" తూగోజి ఎడిషన్ వారు తీర్చేశారు.

    ReplyDelete
  4. ధన్యవాదాలు శర్మగారు, ఫణిబాబుగారు. ఈ సారి తీర్థాలకి వెళ్ళలేకపోయానండి, అందుకే ఫోటోలు పెట్టలేదు. ఒక గొప్ప సాంస్కృతిక వారసత్వంగా వస్తున్న ఈ ఉత్సవాల గురించి మన బ్లాగులో రికార్డ్ చేస్తే బాగుంటుందని వివరంగా రాయడం జరిగింది.

    ReplyDelete
  5. ప్రభల తీర్థం పూర్వాపరాలతో చాలా వివరంగా రాశారండీ. బహుశా కొంతమంది కోనసీమవాసులకి కూడా ఇన్ని వివరాలు తెలిసి ఉండకపోవచ్చు. తూర్పు గోదావరి జిల్లాకి ఒక గైడ్ లా ఉపయోగపడుతుంది మీ బ్లాగ్. చాలా బాగుంది.

    ReplyDelete
  6. మంచి కాంప్లిమెంట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు శిశిరగారు.

    ReplyDelete
  7. మీ ఈ పోస్ట్ లింక్ నా బ్లాగ్ లో ఇచ్చానండి. మీకు తెలియజేయడం పద్ధతి అని తెలియజేస్తున్నాను.

    ReplyDelete
  8. మరింత మంది నా పోస్టు చూసే అవకాశం కల్పించారు :)

    ReplyDelete
  9. Sir, Pallipalem (Near Mummudivaram) lo ok prabhala theerdham jaruguthundi (Every Kanuma Day)..Daani gurunchi yekkada mention cheyaleedu??????

    ReplyDelete
  10. పౌరాణిక, చారిత్రక ప్రాధాన్యం ఉమ్మ జగ్గన్నతోట తీర్థాన్ని గురించి ప్రధానంగారాసి, కోనసీమలో మిగిలిన వందకి పైగా ఊళ్ళల్లో కూడా ప్రభల తీర్థం జరుగుతుందని రేఖామాత్రంగా చెప్పానండి. ఊళ్ళన్నీ పేరుపేరునా రాయడం వీలువపడలేదు. ఈ సంవత్సరం మా బంధువులున్న మీవూరికే వద్దామనుకొన్నాను. చివరినిమిషం వరకూ ప్రయత్నించినా వీలుపడలేదు ప్రదీప్ వర్మగారు.

    ReplyDelete
  11. CHala baaga vivarincharu...dhanyavadhamulu marokkasari...

    ReplyDelete
  12. పెద్దాపురాన్ని మింగేసారేమి ? పూర్వం పెద్దాపురం సంస్థానాధీశులైన రాజావత్సవాయి జగన్నాథ మహారాజు (జగ్గన్న) గారు ప్రభల తీర్థమునకు విచ్చేసి, ఏకాదశ రుద్రులను దర్శించి, ప్రభల తీర్థం ఘనంగా నిర్వహించేందుకు అవిరళ కృషిసల్పినారనీ, నాటి జగ్గన్న పూజల ఫలితంగానే ప్రభల తీర్థం జరుగు ప్రదేశం ‘జగ్గన్న’ తోటగా పిలవబడుతున్నది

    ReplyDelete
    Replies
    1. Mee samaachaaram baagundi. Mingeyyadam ane maata maatram amta samskaaravamtam ga ledu.

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!