Pages

Thursday 11 April 2013

సౌత్ఇండియా టూర్

ఫణిబాబు గారు రాసే మ్యూజింగ్స్ బ్లాగులో నీలగిరీ రైల్వేస్ డాక్యుమెంటరి లింకు ఇచ్చి, నన్ను ఇరవై సంవత్సరాలు వెనక్కి తీసుకొని వెళ్ళిపోయారు. నేను చేసిన ఒక పొరపాటు జ్ఞాపకం వచ్చి ఉగాది పచ్చడి తిన్నట్లు మనసంతా తియ్య తియ్యగా, చేదు చేదుగా అయిపోయింది.

డిగ్రీ ఎగ్జాంస్ పూర్తయిన వెంటనే  శ్రీనివాసరెడ్డి అనే  ఒక ఫ్రెండ్‌తో కలిసి సౌత్ఇండియా టూరుకి బయలుదేరాను. మద్రాసు(చెన్నై), బెంగుళూర్, మైసూర్, ఊటీలు తిరిగి రావడం ఇటినరరీ. అప్పట్లో మల్లాది వెంకటకృష్ణమూర్తి యూరోప్, అమెరికాలు తిరిగి వచ్చి ట్రావెలాగ్‌లు రాశారు. అవిచదివేసి, చూసిన ప్రదేశాలకి సంబంధించిన విశేషాలని తెలుసుకుని నోట్‌చేసుకొని ఉంచుకొనే వాడిని. అలాంటి ట్రావెలాగ్‌లు రాసేద్దామన్న సరదా కూడా ఉండేది :).

బెంగుళూరులో కజిన్ శ్రీను ఫ్రెండ్స్‌తో కలిసి రూంతీసుకొని ఉంటూ, టెక్నికల్ కోర్స్ చదువుకొంటున్నాడు. వెళ్ళే దారిలో మద్రాస్ చూసుకొని, బెంగుళూరు చేరిపోతే, అక్కడి నుంచి అతను గైడ్ చేస్తాడు. అనుకొన్నట్టుగానే ఒకటి, రెండు రోజుల్లో లాల్‌బాగ్, కబ్బన్‌పార్క్, విధాన్‌సౌదా, హైకోర్ట్, ఎంజీ రోడ్ మొదలైన చూడవలసిని ప్రదేశాలన్నీ తిప్పేశారు.

బెంగుళూరు:
విధానసౌద అంటే కర్నాటక రాష్ట్ర అసెంబ్లీ. దీనికి ఎదురుగా రోడ్డుకి అవతల ఎర్రని ఇటుకలతో నిర్మించిన హైకోర్టు ఉంటుంది. 


ఇరవై సంవత్సరాలకీ, ఇప్పటికీ బెంగుళూరు చాలా మారిపోయిందని చెపుతున్నారు. కాలుష్యం, జనాభా పెరుగుదల లాంటి కారణాల వల్ల వాతావరణం వేడెక్కిపోవడం, రోడ్లమీద రద్దీ విపరీతంగా పెరగడం జరిగింది. అప్పుడు పీక్ అవర్లో, ప్రధానమైన రోడ్డు మధ్యలో నిలుచుని ఫోటో తీసుకొనే వెసలుబాటు ఉండేది! 


లాల్ బాగ్ గార్డెన్స్‌ని డిల్లీలో మొగల్ గార్డెన్స్‌లా మొదట హైదర్ఆలీ తయారు చేయించాలని మొదలు పెట్టించినా, అతని కొడుకు టిప్పుసుల్తాన్ పూర్తిచేయించగలిగాడు. ఇక్కడి లాన్-క్లాక్ ఇండియాలో మొట్ట మొదటిది. ప్రతిష్టాత్మకమైన గ్లాస్ హౌస్ లండన్లో క్రిస్టల్ హౌస్ ఆకారంలో నిర్మించారు. ప్రతీ సంవత్సరం చాలా గొప్పగా ఫ్లవర్ షో జరుగుతుంది ఇక్కడ.




మైసూర్:
మైసూర్, ఊటీ తిప్పి తీసుకు రావడానికి ట్రావెల్స్ వాళ్ళ లగ్జరీ బస్సులు ఉన్నాయి. ఉదయం బయలు దేరి మైసూర్ వెళ్ళే దారిలో ముఖ్యమైన విశేషాలు చూపించి, సాయంత్రానికల్లా మైసూరులో మహారాజా పాలెస్, బృందావన్ గార్డెన్స్,  చాముండీ హిల్  మొదలైనవి త్రిప్పి మంచి హోటల్‌లో నైట్ స్టే ఇస్తాడు. ఆ మరునాడు ఉదయాన్నే ఊటీ తీసుకొని వెళ్ళి సాయంత్రం వరకూ టీ ప్లాంటేషన్స్, బొటానికల్ గార్డెన్స్, బోట్ క్లబ్, దొడ్డబెట్టా పీక్ లాంటి ప్రదేశాలన్నీ చూపించి ఓవర్ నైట్ జర్నీ బేక్ టూ బెంగులూరు. ఇప్పటి పైసల్లో చూసుకొంటే ఈ పేకేజ్ టూర్ టిక్కెట్ నమ్మలేనంత తక్కువ - ఒక్కొక్కళ్ళకీ కేవలం నాలుగు వందల ఏభై రూపాయలు! పేకేజ్ టూర్స్ లో ఉన్న ఇబ్బంది ఏమిటంటే, ప్రతీ ప్రదేశంలోనూ పదినిమిషాలో, పావుగంటో, అరగంటో టైం ఇస్తాడు. ఆ సమయంలోపులో చూసి వచ్చేయ్యాలి. ఆ ప్లేస్ ఎంత బాగున్నా, ఆస్వాదించడానికి వీలుండదు.


రాజా రవివర్మ, రాజా రాజ వర్మ గీసిన అందమైన పెయింటింగ్స్  మైసూర్‌పేలెస్‌లోపల గోడల మీద కనిపిస్తాయి. దర్బారుహాళ్ళు, సింహాసనాలు, వెండితో తయారుచేసిన సింహద్వారాలు, మైసూర్‌పాలకుల తైలవర్ణ చిత్రాలు.. ఇంకా చాలా చూడవలసినవి ఉన్నాయి ఇక్కడ. మైసూర్ మహారాజా చామరాజేంద్ర వడియార్ వివేకానందుని చికాగో పర్యటనని స్పాన్సర్ చేశాడట. ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు పుస్తకాలలో చదివితే సరిగా అర్థం కాని చరిత్రలో విషయాలు బాగా అవగతమౌతాయి.


మహిషాసుర మర్ధిని పేరునుంచే మైసూర్ అనేది వచ్చిందని చెపుతారు. మహిషాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రదేశానికి చెందినవాడు. వాడిని సంహరించిన చాముండేశ్వరి మైసూర్ పాలకుల ఆరాద్యదేవత. ప్రతీ దసరాకీ ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి. మైసూరుకి దగ్గరలో చాముండీ హిల్ అనే చిన్న కొండ ఉంది. దానిపైన పెద్ద నంది, మహిషాసురుడి విగ్రహం, చాముండేశ్వరీ దేవి గుడీ ఉన్నాయి.


టూర్‌గైడ్ కొండమీదనుంచి చాలా ఇంటరెస్టింగ్ ప్లేసెస్ చూపిస్తాడు. లలిత్‌మహల్ పేలెస్, రేస్‌కోర్స్, మహారాజా పేలెస్ అంటూ. టూర్ పేకేజ్‌లో వాటన్నింటినీ దగ్గరనుంచి చూపించే పాయింట్ లేదు. ఇంకా మైసూర్‌లో సెయింట్ ఫిలోమినా చర్చ్, బృందావన్ గార్డెన్స్ చూపించారు.
బృందావన్ గార్డెన్స్‌కి తీసుకొని వెళ్ళేటప్పటికి పూర్తిగా చీకటి పడిపోయింది. మ్యూజికల్ ఫౌంటెన్స్ ప్రత్యేక ఆకర్షణగా చూశాంకానీ, ఫోటోలు ఏవీ బాగా రాలేదు. రాత్రి బస ఏర్పాటుచేసింది టుర్ ఆపరేటర్ స్వంత హోటల్ అయివుంటుంది. లేకపోతే, ఇరవై సంవత్సరాల క్రితమైనా ఆ డబ్బులకి ఆ స్థాయి అకామిడేషన్ ఇవ్వడం అసాద్యం. మర్నాడు ఉదయమే ఊటీకి బయలు దేరాం. బస్సుదగ్గరకి తెచ్చి గంధపుచెక్కలతో చేసిన ఏనుగు బొమ్మలు(పెన్ స్టేండ్స్) అమ్మారు. ఒక్కొక్కటీ ఐదు రూపాయలు! రెండు కొని ఒకటి నాదగ్గర ఉంచుకొన్నాను. అది ఇప్పటికీ ఉంది. రెండవది ఎవరికి ఇచ్చానో గుర్తులేదు. 

ఊటీ:



ఊటీ బోట్‌క్లబ్ దగ్గర ఉండగా పెద్దగా వర్షం కురిసింది. దీని ప్రభావం వల్ల దొడ్డబెట్టా పీక్ ప్రోగ్రాంలోనుంచి కట్ అయిపోయింది. ఈ టపా మొదటిలో నేను చేశానని చెప్పిన పొరపాటు ఏమిటంటే, ఊటీకి ట్రెయిన్లో వెళ్ళకపోవడం. అప్పుడూ, ఇప్పుడూ కూడా `అయ్యో` అనిపించేది అదే. ఊరిలో చూడవలసిన ప్రదేశాలమాట ఎలా ఉన్నా, రైలు ప్రయాణంలో ఆస్వాదించగల ప్రకృతిసోయగాలు ఎన్నో. మరొకసారి తప్పని సరిగా ఆ జర్నీ చెయ్యాలి. ఎప్పటికి వీలవుతుందో. 

మద్రాస్(చెన్నై):
ట్రిప్ ముగిసింది. తిరిగి వచ్చేటప్పుడు మద్రాస్ గోల్డెన్ బీచ్‌లో తిరిగి షూటింగ్ స్పాట్స్ చూశాం. అప్పట్లో తెలుగు సినిమాలు చాలా వాటిల్లో ఈ స్పాట్స్ అన్నీ కనిపించేవి.








© Dantuluri Kishore Varma 

2 comments:

  1. Visited Banglore&Mysore 40years back, good recollection for me

    ReplyDelete
    Replies
    1. ఎవరో అంటారు `ఫొటోగ్రఫీలో నాకు నచ్చిన విషయం ఏమిటంటే - కనురెప్పపాటు కాలంలో మెరిసి మాయమయ్యే తిరిగి సృష్ఠించడానికి వీలుకాని క్షణాలని బంధించగలగడం,` అని. అలాంటి ఇష్టంతోనే ఈ టపాలో చాలా ఫోటోలను పెట్టాను. మీ జ్ఞాపకాలను మీకు జ్ఞాపకం చెయ్యగలిగినందుకు (పదప్రయోగం తప్పుగా ఉంటే క్షమించగలరు) ఆనందంగా ఉంది.

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!