Pages

Monday 7 April 2014

సీతారామకళ్యాణం

విశ్వామిత్రుని యజ్ఞ సంరక్షణా బాధ్యతని స్వీకరించి రామలక్ష్మణులు మహర్షివెంట అడవులకు వెళ్ళారు. తాటకిని, మారీచ సుభాహుల్ని వదించి కర్తవ్య నిర్వాహణని పూర్తిచేశారు. అటుపిమ్మట మిథిలా నగరానికి పయనం. మిథిల జనకుని రాజధాని. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కర్మయోగి గురించి చెపుతూ జనకుడిని ఉదహరిస్తాడు. అటువంటి జనకుడు ఒకసారి యాగం నిర్వహించ తలపెట్టి భూమిని త్రవ్వుచూ ఉండగా అయోనిజ సీత లభిస్తుంది. రామలక్ష్మణులు మిథిలా నగరానికి వచ్చే సమయానికి ఆమె యవ్వనవతి. ఆమెకు భర్తగా రాగల వ్యక్తి సామాన్యుడు అయి ఉండడానికి వీలులేదు. అందుకే ఎప్పుడో దక్షయజ్ఞం తరువాత శివుడు జనకుని పూర్వీకులకు అప్పజెప్పిన శివధనస్సుని ఎక్కుపెట్టగలిగిన ధీరుడే ఆమె చేయి అందుకోగలిగిన అర్హత గలిగిన వాడు అని జనకుడు భావించి ఉన్నాడు.    

ఆ దనుస్సుని సోదరులు చూడగోరారు. జనకుని ఆజ్ఞని అందుకొన్న సేవకులు ఎనిమిది చక్రాలు కలిగిన శివదనుస్సును ఉంచిన పేటికని తీసుకొని వచ్చారు. అప్పుడు ఒక గొప్ప ఘట్టానికి తెరలేచింది. రఘురాముడు శివధనుర్భంగం చేశాడు. అది ఒక అపురూప సన్నివేశం.  ముళ్ళపూడి వెంకటరమణ గారు సీతా కళ్యాణం అనే కథలో నీలిమేఘశ్యాముడ్ని లక్మణుడి దృష్టికోణంలోనుంచి ఆవిష్కరించారు.

విల్లును చేపట్టబోవడంలో సొగసు
నిలబెట్టి..
దక్షిణ పాదంగుష్ఠానికి దన్నుపెట్టి వంచి..
తృటిలో అల్లెతాడు ఎక్కించడంలో వొడుపు, సౌలభ్యం
బాణం ఆరోపించడంలో మెలుకువ
నారిని ఆకర్ణాంతం లాగబోవడంలో చూపిన అంగవిన్యాసం 
సమ్మోహనకరంగా తోచాయి. 
అవలీలామానుష విగ్రహుడుగా గోచరించాడు.
Raja Ravi Varma`s Painting
దశరదమహారాజుకి వర్తమానం పంపారు. వార్తాహరులు వెళ్ళడానికి మూడురోజులు, అటునుంచి ఆయన బందుమిత్ర, సపరివార సమేతంగా కానుకలతో, మందీ మార్బలంతో తరలిరావడానికి మరో మూడురోజులు, మధ్యలో ఏర్పాట్లు చూసుకోవడానికి ఒక రోజు. రాముడు విల్లు విరిచిన తరువాత ఏడురోజుల నిరీక్షణ సీతకి.. రాముడుకికూడా! ఆ సుదీర్గమైన సమయంలో ఆమె ఏమిచేసిందో మళ్ళీ ముళ్ళపూడి రమణగారి మాటల్లో..

చెలులూ, చెల్లెళ్ళూ కూడా జానకికి ముప్పొద్దులా రామకథలే చెప్పారు. 
చెప్పిన కొద్దీ ఊరేవి; ఊరిన కొద్దీ ఊరించేవి!

సీతాదేవి చెల్లెలు ఊర్మిళ ఆమెని లక్ష్మణుడికి ఇచ్చి పరిణయంచేస్తే బాగుంటుందని భావించారు. అలాగే జనకుని సోదరుడు కుశధ్వజునికి ఇద్దరు కుమార్తెలు - మాండవి, శ్రుతకీర్తి. వాళ్ళిద్దరినీ భరత శతృగ్నులకి ఖాయం చేశారు. నాలుగు జంటలూ ఒకే ముహూర్తానికి ఒక్కటయ్యాయి.  

ఆవిధంగా ఉత్తరఫల్గుణీ నక్షత్రంలో  సీతారామకళ్యాణం అంగరంగ వైభోగంగా జరిగింది.   

రేపు శ్రీరామనవమి. రామాలయాల్లో సీతారాముల కళ్యాణం జరుపుతారు. చూసి తరించండి. 

© Dantuluri Kishore Varma

No comments:

Post a Comment

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!