Pages

Sunday 27 July 2014

అమృతం కురిసిన రాత్రి

అమృతం కురిసిన రాత్రి మళ్ళీ చదివాను.

"కవిత్వమొక అల్కెమీ, దాని రహస్యం కవికే తెలుసును
కాళిదాసుకు తెలుసు, పెద్దన్నకి తెలుసు
కృష్ణశాస్త్రికి తెలుసు, శ్రీశ్రీకి తెలుసు"

అంటాడు దేవరకొండ బాలగంగాధర తిలక్. నిజానికి ప్రొసైక్ భావాన్ని పోయట్రీగా మార్చడం తిలక్‌కీ చాలా బాగా తెలుసు. మాటల్ని కూర్చి మనసులో భావాన్ని మనోహరంగా మలచడంలో అతనొక అల్కెమిస్టే.  అందుకే తిలక్ మాటల్లోనే

"నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు
నా అక్షరాలు ప్రజాశక్తులు వహించే విజయఐరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకొనే అందమైన ఆడపిల్లలు.."

యవ్వనపు తొలిరోజులని తలచుకొంటూ రాసిన `ఆ రోజులు` కవితలో మాటల లయ చూడాలి.

"పచ్చని పచ్చికల మధ్య
విచ్చిన తోటల మధ్య
వెచ్చని స్వప్నాల మధ్య
మచ్చికపడని పావురాల మధ్య
పరువానికి వచ్చిన ఆడపిల్లల మధ్య
పరుగెత్తే నిర్ఘరుల మధ్య
తెరులెత్తే మునిమాపుల మద్య.."

ఇక భావుకత్వం ఎంత బాగుంటుందనీ- 

"సగం మబ్బు సూర్యుడి మీద
శాటిన్ తెరలా కప్పుకుంది
సంజ యెరుపు సెలయేటి మీద
చల్లిన తొలి సిగ్గులా వుంది"

అంటాడు స్వేచ్చా విహారం కవితలో. ఇంకా..

"ఒకరినడుం ఒకరు చుట్టి
ఉల్లాసంగా తిరుగుదాం
సరుగుడు చెట్ల నీడలలో
విరుగుడు చేవ తోటలలో
మునిమాపు వేళ రెండు నక్షత్రాలు
ముద్దు పెట్టుకొంటున్నప్పుడు
మునికాళ్ళమీద నిలిచి దేవతలు
మనని అసూయగా చూస్తున్నప్పుడు"  

అంతేనా? జీవిత సత్యాల్ని కవితా పంక్తుల్లో కలబోసి అందిస్తాడు. "జీవితపు చక్రాల సీల ఊడిపోతే, బ్రతుకు బురదలోపడి దొర్లుతుందని.."  "పడుకొనేముందు పాన్పుకింద పాముందో లేదో చూసుకో, ప్రబల శత్రువెవడో నిన్ను వెన్నంటి వున్నాడు కాసుకో" అని హెచ్చరికలు జారీ చేస్తాడు. 

రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలంలో రాస్తూవుండినందు వల్లనేమో తిలక్ కవితలు చాలా వాటిల్లో సైనికుడి బెంగ,  తల్లి ఆవేదన, భార్య అనుభవించే విషాదం కనిపిస్తాయి. వాటితో పాటూ యుద్ద బీబత్సంకూడా.

సైనికుడి ఉత్తరంలో -

"దూరంగా ఆల్ప్స్ మీద మంచు ధు:ఖంలా కరుగుతోంది
ప్రభాతం సముద్రం మీద వెండి నౌకలా ఊగుతుంది
తిరికి ఎప్పుడు మన ఊరు వస్తానో!
నిన్ను చూస్తానో?" అని సైనికుడు వాపోతే.. 

తపాలా బంట్రోతులో -

"గుడిసెముందు కూర్చున్న పండుముసలి అవ్వ
గడచిన బ్రతుకంతా కష్టపు నెత్తుటి కాలవ
కనపడీ కనపడని కళ్ళల్లో
కొడగట్టిన ప్రాణపు దీపంలో
తాను కనిన తన ప్రాణం
తనకు మిగిలిన ఒకే ఒక స్వప్నం
తన బాబు తన ఊపిరి
అస్సాం రైఫిల్సులో సోల్జర్ సిమ్మాచలం
కోసం నిరీక్షణ.."

`అమ్మా, నాన్న ఎక్కడికి వెళ్ళాడు? ` అనే కవితలో సైన్యంలో ఉన్న తండ్రి గురించి `ఇంకా రాడేం?` అని ఒక కుర్రాడు తల్లిని అడుగుతూ ఉంటాడు. రేడియోలో విషాద వార్త విన్నదేమో - అలా అడుగుతున్న కుమారుడ్ని అక్కున చేర్చుకొని రుద్ధ కంఠంతో `జైహింద్` అని మెల్లగా పలుకుతుంది. ఆ మాట స్వర్గంలో ఒక వీరుడికి హాయిగా తియ్యగా వినబడుతుంది. 

యుద్దానికి విసిగిపోయిన సైనికుడిలాగానే తాను కూడా శాంతికోసం పరితపించాడు. అందుకే శాంతి ఆచూకీ కోసం `ప్రకటన` జారీచేశాడు. శ్రీశ్రీ గురించి `ప్రపంచం బాధ అతని బాధ అని ఎవరో చెప్పినట్టు తిలక్ కూడా కవిగా ఆర్తగీతం ఆలపించి `నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు` అని తానన్న మాటల్ని సార్ధకం చేసుకొంటాడు. 

"అమృతం కురిసిన రాత్రి
అందరూ నిద్రపోతున్నారు
నేను మాత్రం
తలుపు తెరచి యిల్లు విడిచి
ఎక్కడికో దూరంగా
కొండదాటి కోనదాటి
వెన్నెల మైదానంలోకి
వెళ్ళి నిలుచున్నాను.

ఆకాశంమీద అప్సరసలు
ఒయ్యారంగా పరుగులెత్తుతున్నారు
వారి పాదాల తారా మంజీరాలు
ఘల్లు ఘల్లని మ్రోగుతున్నాయి
వారి ధమ్మిల్లాల పారిజాతాలు
గుత్తులు గుత్తులై వేలాడుతున్నాయి
వారు పృధు వక్షోజ నితంబ భారలై
యౌవన ధనస్సుల్లా వంగిపోతున్నారు

నన్ను చూసిచూసి కిలకిల నవ్వి యిలా అన్నారు
చూడు వీడు
అందమైన వాడు
ఆనందం మనిషైన వాడు
కలలు పట్టు కుచ్చులూగుతూన్నకిరీటం ధరించాడు
కళ్ళ చివర కాంతి సంగీత గీతాన్ని రచిస్తున్నాడు
ఎర్రని పెదవులమీద తెల్లని నవ్వుల వీణల్ని మీటుతున్నాడు
ఎవరికి దొరకని రహస్యాల్ని వశపరచుకున్నాడు
జీవితాన్ని ప్రేమించినవాడు జీవించడం తెలిసినవాడు
నవనవాలైన ఊహావర్ణార్ణ వాల మీద ఉదయించిన సూర్యుడు
ఇతడే సుమీ మన ప్రియుడు నరుడు మనకి వరుడు

జలజలమని కురిసిందివాన
జాల్వారింది అమృతంపు సోన
దోసిళ్ళతో తాగి తిరిగి వచ్చాను
దుఃఖాన్నీ చావునీ వెళ్ళిపొమ్మన్నాను
కాంక్షా మధుర కాశ్మీరాంబరం కప్పుకున్నాను
జీవితాన్ని హసన్మందార మాలగా భరించాను
జైత్రయాత్ర పథంలో తొలి అడుగు పెట్టాను

అమృతం కురిసిన రాత్రి
అందరూ నిద్రపోతున్నారు
అలసి నిత్యజీవితంలో సొలసి సుషుస్తి చెందారు
అలవాటునీ అస్వతంత్రతనీ కావలించుకున్నారు
అధైర్యంలో తమలో తాము ముడుచుకుపోయి పడుకున్నారు
అనంత చైతన్యోత్సవాహ్వానాన్ని వినిపించుకోలేక పోయారు

అందుకే పాపం
ఈనాటికీ ఎవరికీ తెలియదు
నేను అమరుడనని!"

ఉదయ, సాయంత్రాలు; మంచుకురిసే ఉషోదయాలు; వర్షం కురుస్తున్న రాత్రులు; అన్ని సమయాలు, కాలాలు... తిలక్ కవితల్లో ప్రాణంపోసుకొన్నాయి. నలభై అయిదేళ్ళకే తిలక్ కాలం చేస్తే (1921- 1966) అతని మరణానంతరం తిలక్ కవితలని సంకలనంగా చేసి అమృతం కురిసిన రాత్రి అనే పేరుతో 1969లో విడుదల చేశారు. ఈ సంకలనానికి కేంధ్ర సాహిత్య అకాడమీ అవార్డ్ వచ్చింది. 

అమృతం కురిసిన రాత్రిని మళ్ళీ మళ్ళీ చదవాలి.
© Dantuluri Kishore Varma

Sunday 20 July 2014

ఇళ్ళు ఇలా కూడా కట్టుకోవచ్చు!

ప్యూరిఫైడ్ వాటరో, కూల్‌డ్రింకో తాగేసి ఖాళీ ప్లాస్టిక్ సీసాల్ని పారేస్తాం.  రైలు పట్టాలకి ఇరువైపులా, రోడ్లమీద, చెత్తకుండీల దగ్గర, డ్రెయిన్లలో, పిక్నిక్ స్పాట్ల దగ్గర కుప్పలు తెప్పలుగా పెట్ బాటిల్స్ అని పిలవబడే పాలిథిన్ టెరెప్తలేట్ సీసాలు పోగుపడిపోతున్నాయి. వీటిని అలాగే వదిలేస్తే పర్యావరణానికి చాలా నష్టం అని చెపుతారు. ఒక్కొక్క సీసా క్రమంగా భూమిలో కప్పడిపోయి, మట్టిలో కలిసిపోవడానికి వెయ్యి సంవత్సరాల కాలం పడుతుందట. అలా కాకుండా వాటిని రీ సైకిల్ చేస్తే మరొక రకమైన ప్లాస్టిక్ వస్తువులుగా తయారు చేసుకోవచ్చు. రీసైక్లింగ్ వల్ల రెండు ఉపయోగాలు ఉన్నాయి - మొదటిది చెత్తను వదిలించుకోవడం, రెండవది కొత్తగా ప్లాస్టిక్ తయారు చెయ్యడానికి కావలసిన సహజ వనరులని వినియోగించనక్కర్లేక పోవడం. కానీ, ఈ ప్లాస్టిక్ బాటిల్స్ విషయంలో వందశాతం రీసైక్లింగ్ జరగడంలేదు. ప్రపంచవ్యాప్తంగా ఇరవై నుంచి ముప్పై శాతం సీసాలు మాత్రమే రీసైక్లింగ్‌ద్వారా తిరిగి వినియోగింపబడుతున్నాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి. వాడేసిన ప్లాస్టిక్ సీసాల్ని ఎక్కువ సంఖ్యలో ఉపయోగించుకొనే గొప్ప ఆలోచనని మీతో పంచుకొందామని ఈ టపా. 

ఈ రోజు ఒక వీడియో చూశాను. ఓ ఇంజనీరింగ్ కాలేజీవాళ్ళూ విద్యార్థులచేత ఒక షెడ్ కట్టించారు. షెడ్లు నిర్మించడం కొత్తవిషయం కాదు. కానీ నిర్మాణానికి అవసరమైన ఇటుకలకు బదులుగా పెట్ బాటిల్స్‌ని వినియోగించడం ఇక్కడ గమనించ వలసిన విషయం. ఖాళీ సీసాల్లో మట్టిని కూరి, మూతలు పెట్టేసి వాటిని ఇటుకలుగా ఉపయోగించారు. గోడలు కట్టేసిన తరువాత సిమ్మెంటుతో ప్లాస్టరింగ్ చెయ్యడమో, పాతకాలం పల్లెటూరి గుడిసెలకి మెత్తినట్టు ఎర్రమట్టిని మెత్తడమో చేస్తే గోడల లోపల ఉన్నవి ఇటికలో, పెట్ బాటిల్సో తెలియనే తెలియదు. నిర్మాణాన్ని వివరంగా చూపించిన ఓ వీడియోని ఇక్కడ చూడండి.
పెద్ద నిర్మాణాలని చెయ్యడానికి ఈ విధానం ఎంతవరకూ ఉపయోగపడుతుందో తెలియదు కానీ షెడ్లు, ప్రహారీ గోడలు, మరుగుదొడ్లు, వాటర్‌టేంకులు లాంటివాటిని చక్కగా కట్టుకోవచ్చు. పల్లెటూరిలో ఉన్న ఒక పేద రైతుకూలీ తన ఇంటికి చేర్చి ఓ మరుగుదొడ్డిని   కట్టుకోవాలనుకొంటే ప్రతీరోజు తనకున్న ఖాళీ సమయాల్లో సేకరించి పెట్టుకొన్న ప్లాస్టిక్ బాటిల్స్‌లో మట్టిని నింపుకోవచ్చు. కుటుంబ సభ్యులందరూ తలో చెయ్యీ వేస్తే కొద్దిరోజుల్లోనే కట్టుబడికి అవసరమైన సీసా ఇటికలు తయారు చేసుకోవచ్చు, సీసాల్ని సేకరించడం పెద్ద సమస్యకాదు. అవి ఉచితంగా లభించక పోతే పాత పేపర్లు, చెత్త సామాన్ల వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర చాలా తక్కువ ధరకి దొరుకుతాయి.   

ప్లాస్టిక్ సీసాలతో నిర్మించిన ఇళ్ళు భూకంపాలకి నిలబడతాయా? అగ్ని ప్రమాదాల్లాంటివి సంభవిస్తే నిప్పు తొందరగా అంటుకోవడం, విషతుల్యమైన పొగలని వెలువరించడం జరగుతుందా? అనే విషయాలు తెలియవు.   

వీడియో చూసిన తరువాత ఆసక్తికరంగా అనిపించడంతో కొంత గూగుల్ సెర్చ్ చేసి వివరాలు తెలుసుకొన్నాను. ఈ నిర్మాణ విధానం కొత్తదేమీ కాదు. చాలా కాలంనుంచి వివిధ దేశాల్లో అవలంభిస్తున్నారు. మనరాష్ట్రంలో మాత్రం ఎక్కడా ఇలా నిర్మాణాలు చేస్తున్నట్టు లేదు. కాబట్టి మనవరకూ ఇది కొత్త విషయమే!    

© Dantuluri Kishore Varma

Monday 14 July 2014

వ్యవసాయ కూలీలు

అదృష్టం బాగుండి వర్షలు చక్కగా కురిస్తే రైతులు ఆనందంగా దమ్ములు చేసుకొంటారు. ఈ సంవత్సరం అరకొరవానలు భూమిని పూర్తిగా తడపడమేలేదు. కరెంట్ కోతలు ఉండకూడదని, సకాల వర్షాలు సమృద్దిగా కురవాలని జనాలు కోరుకొంటున్నారు. వర్షం కురిస్తే దానితోపాటూ విద్యుత్ బోర్లతో పొలాలకు నీటిని పెట్టుకొని దమ్ములు చేసుకొంటారు. శంకవరం మండలానికి వెళ్ళినప్పుడు  వ్యవసాయ కూలీలు పొలాల్లో దమ్ములు చేసుకొంటూ, ఆకుమడుల్ని ఊడుపులు చేస్తూ ఇదిగో ఇలా కనిపించారు.   




© Dantuluri Kishore Varma 

Friday 11 July 2014

సముద్రపు వొడ్డునుంచి మాయమైపోయిన పార్క్!

ఊరినుంచి సముద్రపువొడ్డుకి వెళ్ళాలంటే ప్రపంచం అవతలి వరకూ వెళ్ళినంత కష్టంగా ఉండేది. కాకినాడ సినిమా రోడ్డులో కల్పనా సెంటర్ దగ్గరనుంచి డైరీఫారం సెంటర్‌మీదుగా బీచ్ వైపు వెళ్ళే వాళ్ళం. ఇప్పుడున్న సాంబమూర్తినగర్ వోవర్ బ్రిడ్జ్ అప్పటికి కట్టలేదు. రైల్వే ట్రాక్ దాటి వెళ్ళాలి. పట్టాలు దాటాకా అదంతా మరోప్రపంచం. దూరం, దూరంగా విసిరేసినట్టు మత్యకారుల ఇళ్ళు ఉండేవి. అవి దాటి చాలా దూరం వెళితే బీచ్. మధ్యాహ్నం ఏ రెండుగంటలకో ఎండలో పడి అంతదూరం పోతే అక్కడ తాగడానికి గుక్కెడు మంచినీళ్ళు కానీ, సోడానో, కూల్‌డ్రింకో.. ఏదీ దొరికి చచ్చేది కాదు. తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు దాహంతో నోరు పిడచకట్టుకొని పోయి `ఎప్పుడెప్పుడు ఇంటికి చేరతామా?` అనిపించేది. ఇదంతా పంతొమ్మిదివందల తొంభైల్లో మాట.

 అదిగో సరిగ్గా అలాంటి సమయంలో కాకినాడ సముద్రతీరపు ముఖచిత్రం పూర్తిగా మారిపోతుందేమో అని ఆశ కలిగేలా ఓ పని చేశారు. అదే బీచ్ పార్క్ నిర్మాణం. సముద్రపు వొడ్డున పార్కుకి స్థలం కేటాయించి గోడ కట్టారు. మధ్యలో గుండ్రంగా రెండంతస్థుల సిమ్మెంట్ నిర్మాణం చేశారు. పై అంతస్థుమీదకి వెళ్ళడానికి నాలుగు వైపులనుంచీ మెట్లు నిర్మించారు. ఇక్కడి నుంచి దూరంగా నాగార్జునా ఫెర్టిలైజర్స్, గోదావరీ ఫెర్టిలైజర్స్ ఫేక్టరీలు కనిపించేవి.  పార్కులో ఓ వైపు పిల్లలు ఆడుకోవడానికి జారుడుబల్ల, సీ-సా లాంటివి పెట్టారు. ఆ ప్రదేశం అంతా మొక్కలు నాటి  ఓ ఆకారం తీసుకొని వచ్చారు. 


పార్క్ మధ్యలో బిల్డింగ్ రెస్టారెంట్‌కోసం  అని చెప్పారు. కొంతకాలం బజ్జీలు, చిప్స్, సమోసాలాంటివి ఏవో అమ్మేవారు. జనం పార్క్‌లోనికి వెళ్ళేవారు. తరువాత లోనికెళ్ళి, తిరిగొస్తే వచ్చే కాళ్ళ నొప్పులు గుర్తుకు వచ్చి మానేశారు. క్రమంగా ఏమైపోయిందో తెలియకుండా పార్క్ మాయం అయిపోయింది. షిప్‌బ్రేకింగ్ యూనిట్లో, పోర్ట్ తాలూకు నిర్మాణాలో ఆ ప్రదేశంలో వచ్చాయి. 

సందర్శకుల ఆశల గుర్రాలని ఊహాలోకాల్లోకి పరుగులెత్తించిన పార్క్  ఒకప్పుడు ఆ ప్రదేశంలో ఉండేదని ఇప్పుడు ఎవ్వరికీ  తెలియదు! 
© Dantuluri Kishore Varma

Monday 7 July 2014

మదిమదిలోనూ కోరిక

అసలు వానంటే ఇష్టపడనివాళ్ళు ఎవరుంటారు చెప్పండి? వేడి గాళుపులతో విసుగెత్తిపోయిన తరువాత, ఉక్కబోతలతో ఉసూరుమనిపోయిన తరువాత కమ్ముకొచ్చే మేఘాలు, సేదతీర్చే వర్షపు గాలి ఎవరినైనా ఆనందింపజేస్తాయి. ప్రతీ ఏడాదిలాగే ఈసారీ వేసవి వచ్చింది. కానీ వెళ్ళేటప్పుడే కొంత జాగు చేస్తుంది. ఈ పాటికే వానలు మొదలైపోవాలి. పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడిందని చెపుతున్న ఎల్నినో ఈ సంవత్సరానికి వర్షాలు కురియకుండా చేస్తుందా అనే భయాన్ని కలిగిస్తుంది. నిన్న హైదరాబాదులో, విజయవాడలో, మరొకచోటా కుంభవృష్టి కురిసిందని పేపర్లలో చదువుతూ కాకినాడ వాళ్ళం `మనకు లేదే!` అని ఉసూరుమంటున్నాం. మేఘాలు వస్తున్నాయి, పెళపెళమని ఉరుముతున్నాయి. నాలుగు చినుకులు `అలా, అలా` రాలి తడిసిన మట్టివాసన ముక్కుపుటాలకు చేరేలోపునే అంతా అయిపోతుంది. `వానల్లు కురియాలి వానదేవుడా,` అని చేతులెత్తి మ్రొక్కకపోయినా, ఆకాశం, నేలా ఏకమయిపోయేలా కురిస్తే బాగుండని మదిమదిలోనూ కోరిక!    

వానంటే మీకూ ఇష్టమే కదూ? అయితే ఈ క్రింది టపాలు కూడా చదవండి.   

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!