Pages

Monday 31 March 2014

శ్రీవారి ధర్మరధాలు

తిరుమల కొండమీద యాత్రికులకోసం దేవస్థానం ఉచిత బస్సులు నడుపుతుంది. వీటిని శ్రీవారి ధర్మరధాలు అని వ్యవహరిస్తారు. ప్రతీ పది, పదిహేను నిమిషాలకీ ఒక్కో బస్సు వస్తుంది. తిరుమల బస్‌స్టాండ్, సెంట్రల్ రిసెప్షన్ ఆఫీసు, కాటేజీలు, సత్రాలు, రాంబగీచా గెస్ట్‌హౌస్, వైకుంఠం క్యూ లైను, మ్యూజియం, కళ్యాణకట్ట, సప్తగిరి సర్కిల్, నిత్యాన్నదానం బిల్డింగ్... ఇలా చాలా స్టాపుల్లో భక్తుల్ని ఎక్కించుకొని, దించుతూ ఉచిత బస్సులు వెళతాయి. రకరకాల ప్రదేశాల్లో వీటిని చూడడం చాలా బాగుంటుంది. పిక్చర్ పెర్ఫెక్ట్ అంటారు చూడండి అలా ఉంటాయి. సమయం ఉంటే తప్పనిసరిగా వీటిలో ప్రయాణించి తిరుమలకొండమీద ప్రదేశాలు చూడండం, జనాలని గమనించడం మిస్‌కావద్దు. 







© Dantuluri Kishore Varma

విఖనస మహర్షి ఆలయం

తిరుమలలో జరిగే నిత్యపూజలు, సేవలు, ఉత్సవాలు మొదలైనవాటిని ఆగమశాస్త్ర నియమాల ప్రకారం జరుపుతారు. దేవాలయ నిర్మాణం దగ్గరనుంచి, విగ్రహం తయారీ, ప్రతిష్ట, అర్చన మొదలైన విధివిధానాలన్నీ వైఖానస ఆగమశాష్త్రాన్ని అనుసరించి జరుగుతాయి. ఈ శాస్త్రాన్ని అందించిన వాడు శ్రీ విఖనస మహర్షి. విష్ణుమూర్తి అంశతో నాలుగు భుజములు, శంఖు చక్రాలతో నైమిశారణ్యంలో అవతరించారట.  తన శిష్యులు బృగు, అత్రి, మరీచి, కశ్యప మహర్షులకు ఆగమశాస్త్రాన్ని ఉపదేశించారట. వారు దానిని ఎన్నో గ్రంధాల రూపంలో పొందుపరచారు. శ్రీ విఖనస మహర్షి ఆలయం తిరుమలలో శ్రీవారి ఆలయానికి సమీపంలోనే ఉత్తరదిక్కున ఉంది. చతుర్భుజాలతో, శంఖుచక్రాలతో మహర్షి విగ్రహం ఉంటుంది. నలుగురు మహర్షులు కూడా ఉంటారు. ఈ సారి తిరుమల వెళ్ళినప్పుడు తప్పనిసరిగా దీనిని సందర్శించండి.


© Dantuluri Kishore Varma

Saturday 29 March 2014

ఆ నాలుగు వీధులూ...

*     *     *
వేంకటేశ్వరుడు అంటే పాపాలు హరించే దేవుడు అని అంటారు. ఆయన వెలసిన అత్యంత ప్రముఖమైన ప్రదేశం తిరుమల. తమిళంలో తిరు అనే మాట చాలా సందర్భాలలో వింటూవుంటాం. దీని అర్థం పవిత్రమైనది అని. అలాగే మాలా అంటే పర్వతం. తిరుమల కలియుగ వైకుంఠం.  సముద్రమట్టానికి 850 మీటర్ల ఎత్తులో ఏడుకొండలపైన పదిన్నర చదరపు మైళ్ళ విస్తీర్ణంలో తిరుమల ఉంది. అసలు ఏడుకొండలు ఎందుకు ఉన్నాయని సందేహం రావచ్చు ఎవరికైనా. వైకుంఠంలో విష్ణుమూర్తి పవళించి ఉండే తల్పం ఏడుతలలు ఉండే ఆది శేషువు అని తెలుసుకదా? ఆ ఆదిశేషువే ఈ శేషాచలం అని అంటారు. ఒక్కొక్క పడగా ఒక్కొక్క  కొండ. ఏడుకొండలకీ పేర్లు ఉన్నాయి - శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయనాద్రి, వేంకటాద్రి - అని.  

వేంకటేశుడు స్వయంభూ. ఆనందనిలయంలో ఉంటాడు. ఆనందనిలయం అంటే బంగారు రేకు తాపడం చేసిన గోపురం ఉన్న దేవాలయం. చుట్టూ రెండు ప్రాకారాలు ఉన్నాయి. స్వామి సన్నిధిలోనికి వెళ్ళాలంటే పెద్ద గోపురంతో ఉన్న ప్రధానద్వారం, మరొక చిన్న గోపురం ఉన్న రెండవ ద్వారం దాటుకొని వెళ్ళాలి.   

ఆలయం చుట్టూ ఉన్న వీధులని మాడవీధులు అంటారు. ప్రధాన ద్వారానికి అభిముఖంగా ఉన్న వీధి సన్నిధి వీధి. ఇక్కడే గొల్ల మండపం ఉంది. ఈ వీధి చివర భేది ఆంజనేయస్వామి గుడి ఉంది.  


ప్రధాన ద్వారం - తూర్పు మాడవీధి
ఉత్తరంవైపు ఉన్న మాడవీధి దీనినే తీర్థకట్టవీధి అని కూడా అంటారు
ఉత్తరపు మాడవీధిలోనే అధనపులడ్డూ కూపన్లు ఇచ్చే కౌంటర్ ఉంది. అదే కాకుండా ప్రసాదం తయారు చేసే భవనం కూడా ఉంది.
దేవాలయానికి వెనుక వున్న వీధి పడమర మాడవీధి. దీనిని కూడా తీర్థకట్టవీధి అని అంటారు 

పడమర మాడవీధి అటుచివర కనిపిస్తున్న భవనం యాభైరూపాయల సుదర్శనం టిక్కెట్లకి, సేవల టిక్కెట్లకి, మూడువందల దర్శనం వాళ్ళకి, అధనపు లడ్డూలకోసం టిక్కెట్లు కొనుకొన్నవాళ్ళకి  ప్రసాదం ఇచ్చే చోటు. దేవాలయం వెనుక చిన్న పార్కు కూడా అభివృద్ది చేశారు. వేంకటేశ్వరస్వామి నామాలు, శంకు చక్రాలు ఇక్కడ చూడవచ్చు.  

దక్షిణపు మాడవీధి
దక్షిణ మాడవీధి. క్యూకాంప్లెక్స్ నుంచి వచ్చే లైన్ వోవర్ బ్రిడ్జ్ మీదుగా దేవాలయ దక్షిణగోడని చేరుకొంటుంది. అక్కడినుంచి మలుపుతిరిగి, ప్రధానద్వారం వైపు మళ్ళి, లోనికి ప్రవేశిస్తుంది. ఇంకా ఈ వీధిలో తిరుమలనంభిమందిరం ఉంది. వైకుంఠద్వారానికి వెళ్ళే సుపదం కూడా ఈ వీధినుంచే వెళుతుంది. హథీరాంజీ మఠం  కనిపిస్తుంది. 

కోయిల్ఆళ్వార్ తిరుమంజనం - అంటే దేవాలయాన్ని శుద్ధిచేసే కార్యక్రమం. తిరుమలలో సంవత్సరానికి తిరుమంజనాన్ని నాలుగుసార్లు జరుపుతారు. రాబోయే ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మార్చ్ 25వ తారీకున నిర్వహించారు. దీనికారణంగా మధ్యాహ్నం పన్నెండుగంటల వరకూ దర్శనాన్ని నిలిపివేశారు. అస్సలు భక్తుల రద్దీ లేదు. అందుకే ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలు ఇలా తియ్యడానికి అవకాశం చిక్కింది.

© Dantuluri Kishore Varma 

Friday 28 March 2014

తిరుమల కొండల్లో శిశిర సౌందర్యం

గ్రీష్మంలో సూర్యాస్తమయం చేసే రంగుల మిశ్రమం 
వర్షఋతువులో మేఘావృతమయ్యే ఆకాశం, కురిసే వానచినుకు, తడిసిన మట్టివాసన
శరత్కాలంలో పుచ్చపువ్వుల్లాంటి వెన్నెల
హేమంతంలో ప్రకృతికాంతకు ఆకాశం వేసే మంచు మేలి ముసుగు.. 
అన్నీ అందమే!
కానీ... శిశిరం?
శిశిరానికి సౌందర్యం కూడానా!?
ఆకుల హరిత వర్ణం, పువ్వుల సోయగం ఏ కొమ్మపైనా కనిపించవే
మరి మోడువారిన వృక్షాలకి అందం ఎందుకు ఉంటుంది?
ఉంటుంది...
ఎప్పుడంటే...
ఓ మహిమాన్వితమైన కొండ, 
కొండవెనుక నీలి ఆకాశం, 
వాటికి ముందు ప్రకృతి అనే చిత్రకారుడు సన్నని కుంచెతో చెట్లకాండాలని మాత్రమే గీసి వదిలి పెట్టినట్లు 
ఆకురాల్చిన చెట్లు ఉంటే ఆ అందం ఇదిగో ఇలానే ఉంటుంది. 
కొండపైకి వెళుతున్నప్పుడు, తిరిగి దిగుతున్నప్పుడు టెంపో ట్రేవెలర్‌లో ప్రయాణిస్తూ తీసిన ఫొటోలు. 









© Dantuluri Kishore Varma

Thursday 27 March 2014

గోవిందా, గోవింద!

ఐదురోజులు శెలవు
మా వూరికి
నా స్కూలుకి
నా బ్లాగుకి
నా ఫేస్‌బుక్‌కి...
నేను శెలవుపెట్టి వెళ్ళినా మావూరు అలాగే ఉంది. నా కోసం ఏమీ బెంగపెట్టుకొన్నట్టు లేదు.
యాన్యువల్‌డే జరుపుకొన్న ఆనందపు అలసటలో మా స్కూలు ఓ రెండురోజులు విశ్రాంతి తీసుకొని మళ్ళీ పనిలో పడింది. నేను ఎందుకు శెలవు పెట్టానో తెలుసు కనుక ఎవరూ ఫోన్లు చేసి కారణం అడగలేదు.
నా బ్లాగుకి కొంతమంది వచ్చి, చూసో - చదివో వెళ్ళారు. కొత్త టపాలు రాయక పోవడంతో విజిటర్స్ 
సంఖ్య తగ్గి, బ్లాగ్ ర్యాంక్ కూడా తగ్గింది. ఇంచుమించు రోజూ రాసే నేను ఎందుకు రాయడం రాయడంలేదో తెలుసుకోవడానికి ఎవరూ ప్రయత్నించలేదు!
మిలియన్ల కొద్దీ ఉన్న ఫేస్‌బుక్ వినియోగదారుల్లో ఒక్కడంటే ఒక్కడు కొన్ని రోజులు శెలవు పెడితే మునిగిపోయింది ఏమీలేదు. 
ఇవన్నీ నాకు ముందే తెలుసు. అందుకే, నేను కూడా వాటి గురించి పూర్తిగా మరచిపోయి, దేవుడితో అపాయింట్‌మెంట్ తీసుకొన్నా. 
నేను హ్యాపీ!
తిరుమల దేవుడు కూడా హ్యాపీగానే ఉన్నట్టు కనిపించాడు.
గోవిందా... గోవిందా!
మీకు మళ్ళీ కష్టాలు మొదలు :)  
© Dantuluri Kishore Varma

Monday 17 March 2014

విజేత డైరీలో చిరిగిపోయిన పేజీ

ఆదివారం సాయంత్రం బాలరాజు బీచ్ వొడ్డున కూర్చొని ఉన్నాడు. కెరటాలు వచ్చి వొడ్డును తాకుతున్నాయి. విషాదపు అలలు మనసును తాకుతున్నట్టు! బాలరాజు విషాదానికి పెద్దకారణాలు ఏమీలేవు. చేతిలో ఉన్న పొట్లంలో మిగిలిన నాలుగు పల్లీలూ తినేసి ఇంటికి వెళ్ళడమే. కాకపోతే ఆ మరునాడు సోమవారం - అదే బాలరాజు విషాదకారణం. చిన్నప్పటినుంచీ అంతే. ఆ ఒక్కరోజూ కేలెండర్లో లేకపోతే ఎంత బాగుండును అనుకొనేవాడు. ఇప్పటికి కూడా వాడిలో మార్పు రాలేదు. 

పల్లీలు తినడం మీద దృష్టిలేదు. ఒక్కొక్కటి వొలుచుకొని గింజలని అన్యమనస్కంగా నోటిలో వేసుకొంటున్నాడు. చివరి పల్లీని కూడా తినేసినతరువాత చేతిలో ఉన్న పొట్లం కాగితాన్ని విసిరేస్తూ చూశాడు -  దానిలో రాసివున్న మాటల్లో ఒకదాన్ని..... వారానికి ఒక్కసారి వచ్చే ఆదివారాన్ని కూడా నాశనం చేసుకొంటున్నాను... కాగితం మడతలు విప్పి తొందర, తొందరగా చదవడం మొదలు పెట్టాడు. అది ఎవరిదో జ్ఞాపకాల డైరీలో చిరిగిపోయిన పేజీ
  
*     *     *

టార్గెట్లతో, డెడ్‌లైన్లతో ప్రాణాలు తోడేస్తున్నారు. ఉద్యోగం చేసుకొంటున్నాం అన్న సంతోషంలేదు. పని అంటే భయం. ఆదివారం వచ్చిందంటే ఆ శెలవు గడచిపోయి సోమవారం మళ్ళీ ఆఫీసుకి పోవాలనే ఆలోచనతో వారానికి ఒక్కసారి వచ్చే ఆదివారాన్ని కూడా నాశనం చేసుకొంటున్నాను.  

సైకోసోమేటిక్ అంటారట ఈ రోజు జరిగిన విషయంలాంటిదాన్ని. ఎలాగయినా ఆఫీస్‌కి ఎగనామం పెట్టాలంటే ఏం జరగితే బాగుంటుందో తెగ ఆలోచించాను! దారిలో బైక్ స్లిప్ అయ్యింది. చెయ్యివిరిగింది. కావాలనే పడ్డానేమో అని నాకు అనుమానం. అనుమానం అనేకంటే నమ్మకం అనవచ్చనుకొంటాను.

హాస్పిటల్ ఖర్చు, జీతం నష్టం, కట్టు విప్పించుకొని తిరిగి ఆఫీసుకి వెళ్ళినతరువాత రెట్టింపు అవబోయే పని. ప్చ్! పూతిక పుల్ల ముగ్గురిని చంపిందన్నట్టు, సైకోసోమాటిజం నా దుంప తెంపింది. మానసిక వొత్తడిని తగ్గించుకోవడానికి(Stress Control) ఆరోజే కొంచెం సేపు ద్యానం చేసుకొంటే సరిపోయేది.  

ఎడమ చేతికి కట్టుతో ఇంటిదగ్గర కూర్చొని తెగ ఆలోచించాను - టార్గెట్లు ఎలా పూర్తి చెయ్యవచ్చో అని. కొత్త, కొత్త ఆలోచనలు మెదడులోనికి వరదాలా వచ్చేస్తున్నాయి. మరచిపోతానేమో అని పాత డైరీలో ఎప్పటి కప్పుడు రాశాను(Planning). 

ఎప్పుడు మామూలు అవుతానా(Health)? ఎప్పుడు పనిలో పడదామా? అని మనసు ఆరాటపడుతుంది. మళ్ళీరోడ్డు ఎక్కినప్పుడే కదా నేను అనుకొన్న ఆలోచనలని అమలు పరచగలను? 

ఆకలితో కడుపు నకనకలాడిన వాడు వొడ్డించిన విస్తరాకుమీద పడినట్టు పనిలోకి ఉరికాను(Implementation of the plan). ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇంటూ ప్లేస్ అన్నట్టు నా ప్లాన్ తరువాత ప్లాన్ విజయవంతం అవడం మొదలయ్యింది. మా కంపెనీ సేల్స్ టీంలో మిగిలినవాళ్ళు అందరూ నాకంటే మైళ్ళు వెనుకబడిపోయారు. పని రాక్షసుడిలా తయారయ్యాను. సోమవారం అంటే మనసు ఉత్సాహంతో ఉరకలేస్తుంది. 

కంపెనీ యాన్యువల్ మీటింగ్‌లో నా విజయ రహస్యం గురించి చెప్పమని అడిగారు. 

`జీవితం సముద్రం లాంటిది. విజయం అవతలి గట్టుమీద ఉంటుంది. దాన్ని చేరుకోవాలంటే షిప్ కావాలి. షిప్(SHIP) అనే మాటలో ఒక్కో అక్షరం ఒక్కో విజయసూత్రాన్ని తెలియజేస్తుంది,` అని చెపుతూ షిప్‌ని నిర్వచించాను.  

S - Stress Control
H - Health
I - Implementation
P - Planning

పైన చెప్పిన విజయసూత్రాలలో నిజానికి ప్లానింగ్ తరువాత ఇంప్లిమెంటేషన్ వస్తుంది. కానీ, గుర్తుపెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుందని అలా ఏర్పాటు చేశానని వివరిస్తూ నా కథ వినిపించాను.

హాలు చప్పట్లతో మారుమ్రోగిపోయింది. ఇది ఒక షిప్పు కథ. ఒక విజేత కథ.

*     *     *

ఇది చదివిన తరువాత బాలరాజు మారాడో, లేదో నాకు తెలియదు. ఒకవేళ మీరే బాలరాజు అయివుంటే మారేవారా?

© Dantuluri Kishore Varma 

Sunday 16 March 2014

ఇట్ హేపెన్స్ ఓన్లీ ఇన్ ఇండియా!

ఎన్నికల సమయమేమో చాలా చోట్ల పోలీసువాళ్ళు బైకులనీ, కార్లనీ ఆపి సోదాలు చేస్తున్నారు. ప్రతీరోజూ న్యూస్‌పేపర్లలో వార్తలు చూస్తున్నాం కదా - కార్లలో అక్రమంగా తరలిస్తున్న లక్షల రూపాయలు స్వాధీనం చేసుకొంటున్నారు అని? రహదారులమీద ఈ సోదాలు అందుకే! ఆ విషయం జ్ఞాపకం ఉంది. కనుక, కారులో ఉండవలసిన సీబుక్, ఇన్స్యూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్‌లు లాంటివి ఉన్నాయో, లేదో చెక్ చేసుకొని బయలుదేరాం. సామర్లకోటదగ్గర కారుని ఆపారు. డిక్కీ ఓపెన్ చేయించి, చూసి పంపించారు. తిరుగు ప్రయాణంలో మరో చోట ఆపారు. `ఇంతకు ముదే అయ్యింది,` అన్నాం. నవ్వి, వెళ్ళండన్నట్టు చెయ్యి ఊపాడు పోలీసాయన. ఎండ మండిపోతుంది. రోడ్డుమీద ప్రయాణం చేస్తుంటే ఎడారిలో వెళుతున్నట్టు ఉంది. అక్కడక్కడా చెట్లక్రింద చెరుకురసం బళ్ళు, పుచ్చకాయలు, కొబ్బరి బొండాలు ఒయాసిస్సుల్లా ఉన్నాయి. నోరు పిడచగట్టుకుపోతుంటే పుచ్చకాయల బడ్డీ దగ్గర ఆగాం. మేం ఆగుతూ ఉండగా పుచ్చకాయ ముక్కలు తినేసి, మూతి తుడుచుకొన్న ఒకతను బైకు స్టార్ట్ చేసి, తన కుటుంబాన్ని ఉద్దేశించి `ఎక్కండి,` అన్నాడు. భార్య వెనుక ఎక్కింది. ఒక కుర్రాడు వాళ్ళిద్దరి మధ్యా సెట్ అయ్యాడు. ఇంకో ఇద్దరు పిల్లలు పెట్రోల్ ట్యాంక్ మీద కూర్చున్నారు. బైకు ముందుకు ఉరికింది. మేం అవాక్కయ్యం! అలా ప్రయాణం చెయ్యడానికి వాళ్ళకు ఉన్న కారణాలు ఉంటాయి. కానీ, అడుగడుగునా పోలీసులు ఆపుతుంటే, ఆ చెక్‌పోస్ట్‌లని దాటుకొని వీళ్ళు ఎలా వెళతారు అనేది చిక్కుప్రశ్న. `ఇట్ హేపెన్స్ ఓన్లీ ఇన్ ఇండియా!` అనే కేప్షన్లతో చాలా ఫోటోలు చూశాను నేను. ఆ కేటగిరీలోనికి భహుశా ఈ ఫోటో కూడా  చేర్చవచ్చేమో!  
© Dantuluri Kishore Varma 

Friday 14 March 2014

సైమాటిక్స్

సైమాటిక్స్(Cymatics) అనే ఒక శాస్త్రం గురించి మీకు తెలుసా? శబ్ధతరంగాలు ఏ రకమైన ఆకారాలు సృష్టంచగలవో తెలియజేసే సైన్స్ ఇది. హేన్స్ జెన్నీ(Hans Jenny) అనే స్విడ్జర్‌లాండ్ దేశస్తుడు ఈ శాస్త్రానికికి ఆద్యుడు. 1967వ సంవత్సరంలో సైమాటిక్స్ - ద స్టడీ ఆఫ్ వేవ్ ఫినామినా అనే గ్రంధాన్ని విడుదల చేశాడు. టోనోస్కోప్(Tonoscope) అనే ఒక పరికరాన్నీ తయారుచేశాడు. దీనినుంచి శబ్దాన్ని నిర్దుష్టమైన పౌన:పున్యంలో పంపవచ్చు.  దానిపైన మనం ఇళ్ళల్లో వాడే జల్లెడ చట్రం లాంటి పరికరాన్ని అమర్చేవాడు. ఈ చట్రంమీద మెత్తని పొడిని జల్లి, టోనో మీటర్ నుంచి శబ్దాన్ని పంపితే చక్కని డిజైన్లు ఏర్పడేవి.  వీడియో ఇక్కడ చూడండి. 
ఒకనీటి బిందువుని తీసుకొని దానికి దగ్గరగా ఓం అనే శబ్ధాన్ని వెలువరిస్తే, ఆ పౌన:పున్యానికి నీటిబిందువులోని కణాలు సంచలించి శ్రీచక్రపు ఆకారాన్ని ఏర్పరుస్తాయని ఎక్కడో చదివాను. చాలా ఆశ్చర్యంగా అనిపించింది. దీని గురించి మరింత వివరణకోసం ప్రయత్నిస్తే అది కేవలం అపోహ అని, ధ్వని వల్ల పదార్దాలలో ఏర్పడే తరంగాలు కోణాలను ఏర్పరచలేవని, శ్రీచక్రంలో కోణాలు ఉంటాయి కనుక ఇది నిజంకాదని మరోచోట చదివాను. నిజానిజాలు ప్రక్కన పెడితే ఇది ఒక ఆసక్తికరమైన అంశమే!  

పైన ఇచ్చిన వీడియో లింక్ గమనిస్తే ధ్వని పదార్థాలయొక్క కణాలలో మార్పును తీసుకొని వస్తుందనేది నిజమే అని తెలుస్తుంది కదా? మనవేదాలలో చెప్పినట్టు ఓం అనే శబ్ధం నుంచి విశ్వం పుట్టింది అనే దానిలో నిజం ఉండి ఉండవచ్చు అని అనిపిస్తుంది. సినిమాలలో చూపిస్తూ ఉంటారు ఒక్కోసారి, పక్షవాతం వచ్చిన వాళ్ళదగ్గర పాటపాడితే వాళ్ళు లేచి నిలబడడం లాంటివి. శ్లోకాలు చదివితే వర్షం కురవడం గురించి విన్నాం. అలాగే వైద్యశాస్త్రంలో ధ్వనితరంగాలను ఉపయోగించి శరీరంలో కణజాలాల కదలికలలో మార్పులు చేస్తూ కొన్ని చికిత్సలు చేస్తున్నారు. వీటన్నింటికీ కారణం సైమేటిక్సే!  హేన్స్ జెన్నీ చెప్పడానికి కొన్ని వేల సంవత్సరాలకు ముందే మనవాళ్ళకు దీనిగురించి తెలుసు! హౌ మార్వలెస్! 
© Dantuluri Kishore Varma 

Thursday 13 March 2014

చిరంజీవికి ఫోటో

సాయంత్రం చాలామంది జనాలు ఇంటికి వెళ్ళే సమయం తొమ్మిదిన్నర దాటిన తరువాత. నైన్ టు ఫైవ్ ఆఫీస్ గోయర్స్ గురించి కాదు చెప్పేది. చిల్లర వ్యాపారస్తులు, ప్రయివేట్ ఉద్యోగస్తులు, గుమస్తాలు, మెకానిక్కులు, ఇంకా చాలామంది గురించి. పని ముగించుకొని ఇంటికి వెళుతూ దారిలోనే అవసరం అయిన సరుకులు కొనుక్కొని వెళ్ళిపోవాలి. ఎందుకంటే ప్రత్యేకంగా వాటికోసం సమయం కేటాయించుకొనే వెసలుబాటు ఉండదు వాళ్ళకి. కాకినాడలో పెద్దమార్కెట్టు, జగన్నాథపురంలో చిన్నమార్కెట్టు, ఇంకా రకరకాల ఏరియాల్లో ఆయా ఏరియా మర్కెట్లు, బస్‌కాంప్లెక్స్ దగ్గర రైతుబజారు, గాంధీనగరంలో మరొక రైతు బజారూ ఉన్నా మెయిన్‌రోడ్డులో కాయగూరల బళ్ళదగ్గర జనాలు ఎగబడి కొనుక్కోవడానికి కారణం నేను పైన చెప్పినదే. షాపింగ్ చేసుకొని, ఫస్ట్‌షో సినిమాలు చూసి ఇంటికి తిరిగి వెళ్ళే వాళ్ళు కూడా నాలుగు రకాలు ఇక్కడే కొనుక్కొని వెళతారు. 
ఈ రోజు సాయంత్రం రైతు బజారులో కాయగూరలు కొనుక్కొని వెళుతూ తాజా కొత్తిమీరకోసం మెయిన్‌రోడ్డులో కాయగూరల బళ్ళదగ్గర అగినప్పుడు జేబులో ఉన్న నికాన్ కెమేరా బయటకు తీశాను. స్ట్రీట్ ఫొటోగ్రఫీ! ఒక స్నేప్ లాగిన తరువాత దగ్గరలో ఉన్న కాయగూరల బండి వ్యక్తి గమనించాడు. `కెమేరా పనిచేస్తుందో, లేదో చూస్తున్నార్రా!` అన్నాడు ప్రక్కవాడితో. `కాదు, ఫొటో తీశాను,` అన్నాను. `అయితే వాడికి తియ్యండి. బాగా పడతాడు చిరంజీవి,` అని ప్రక్క వాడిని చూపించాడు. `నీకూ తీస్తానులే,` అని ఇద్దరికీ చెరొకటీ తీశాను. అవి ఇవే. 


 © Dantuluri Kishore Varma 

Wednesday 12 March 2014

కోలంక శివాలయం - అష్టసోమేశ్వరాలయాలలో ఇది ఒకటి

తారా, చంద్రుల కథ విన్నారా ఎప్పుడైనా? చంద్రుడు మహా అందగాడు. విద్యను నేర్చుకోదలచి బృహస్పతి దగ్గర చేరాడు. బృహస్పతి భార్య తార. ఆమె యవ్వనవతి. తారా, చంద్రుల మధ్య అభిలషణీయం కాని బంధం ఏర్పడింది. చేసిన తప్పుకి చంద్రుడిని తన కళలు అన్నీ కోల్పోవలసిందిగా గురువుగారు శపించాడు. ప్రతీ శాపానికీ విమోచన మార్గం ఉన్నట్టుగానే దీనికీ ఉంది. దాని ప్రకారం దక్షిణ కాశీగా పిలువబడే ద్రాక్షారామానికి ఎనిమిది దిక్కులా శివలింగాలను ప్రతిష్టించాడు చంద్రుడు. చంద్రుడిని సోముడు అని పిలుస్తారని మీకు తెలుసుకదా? అందుకే అతను ప్రతిష్టించిన శివాలయాలను అష్టసోమేశ్వరాలయాలు అంటారు. అవి ఏఏ ఊళ్ళల్లో ఉన్నాయో ద్రాక్షారామం ఆలయంలో గోడమీద రాసి ఉంచారు. 

ఈ టపాలో కోలంక శివాలయం ఫోటోలు ఇస్తున్నాను. కేంద్రపాలిత ప్రాంతం యానం నుంచి ద్రాక్షారామం వెళ్ళేదారిలో ఇంజరం దాటిన తరువాత కోలంక అనే ఊరు వస్తుంది. అక్కడే ఉంది పైన చెప్పిన ఎనిమిది వాటిలో ఒక సోమేశ్వరాలయం.


ఇంతకు ముందు ఈ బ్లాగులో రాసిన కొన్ని సోమేశ్వరాలయాల గురించి, ద్రాక్షారామం గురించి ఈ క్రింద చదవండి.

© Dantuluri Kishore Varma 

Friday 7 March 2014

అష్టవిధ నాయికలు

అష్టవిధనాయికల గురించి వినే ఉంటారు...

వస్తానని చెప్పి రాని ప్రియుడి కోసం ఎదురుచూసే విరహోత్కంఠిత మొదటి నాయిక. 
వేరొక స్త్రీతో సరస సల్లాపాలు సాగించి ఇంటికి తిరిగి వచ్చిన ప్రియుడిని చూసి వెలిగించిన మైనపు వొత్తిమీద గుగ్గిలం చల్లినట్టు మండిపడే పడతి  ఖండిత
ఖండితకి పూర్తి వ్యతిరేకం స్వాధీనపతిక. ప్రియుడికి ఈమె అంటే ఎల్లలులేని ప్రేమ. అలా ఉండడం ఆమెకి ఎంత గర్వకారణం? ఎంత సంతోషం? ఏ దూర తీరాలకు వెళ్ళినా ఆమెనే కలవరిస్తాడు. ఆమెకోసం వెతుక్కొంటూ వస్తాడు.
ఇక్కడ తరువాతి నాయికను చూడండి. స్వాధీనపతికలా కాదు. తానే స్వయంగా ప్రియుడిని వెతుక్కొంటూ వెళుతుంది. అలా వెళ్ళే పడతిని అభిసారిక అంటారు. 
అయిదవ నాయిక ప్రోషిత భర్తృక. ప్రియుడి పనిమీద దూర దేశాలకు వెళ్ళినప్పుడు, వియోగానికి చింతిస్తుంది.
తనకు చేసిన వాగ్ధానాలన్నీ తప్పి, ప్రియుడు వెళ్ళిపోయాడని దు:ఖించేది విప్రలభ్ధ
ప్రియుడు వచ్చేవేళకి చక్కగా అలంకరించుకొని ఉండేది వాసవసజ్జిక
ఇక చిట్టచివరి నాయిక కలహంతరిత. కలహం ఆమె పేరులోనే ఉంది కదూ? ప్రియుడితో గొడవపడుతుంది. అతను వెళ్ళిపోతాడు. ఆప్పుడు `ఆయ్యో, తప్పుచేశానే!` అని చింతిస్తుంది. 

ముద్దగాఉన్న నాయికల పేర్లమీద క్లిక్ చెయ్యండి. 
వీడియోలు ఉన్నాయి. 
అభినయించిన కళాకారులని అభినందించకుండా ఉండలేం!

శ్రీకృష్ణుని పియురాళ్ళలో అష్టావిధ నాయికలని అందరినీ చూడవచ్చనుకొంటాను. మరి మీరేమంటారు?

© Dantuluri Kishore Varma

Tuesday 4 March 2014

నా ఓటయితే పుచ్చకాయకే!

ఎండ మండిపోతూ ఉంటే ...
రోడ్డు మీద ప్రయాణించే వాళ్ళకి పుచ్చకాయల బళ్ళు ఒయాసిస్సుల్లా కనిపిస్తాయి.
 దాహంతో పిడచకట్టుకుపోయిన నాలుక పుచ్చకాయ ముక్కలు కావాలని గోలచేస్తుంది.
ఇంకొంచం ముందుకు వెళితే కూల్‌హోం ఏదో తగులుతుంది కోక్ తాగుదాం అనుకొంటారా?
పుచ్చకాయనే తింటారా?
కూల్‌డ్రింక్‌కి పోకుండా పుచ్చకాయ ముక్కలు తినడమే అన్నివిధాలా మంచిది.
ఎందుకంటే...
పుచ్చకాయ మొత్తం బరువులో నీరు 91 శాతం ఉంటుందట. చక్కెరశాతం ఆరు ఉంటుంది.
శరీరంలో నీరు తగ్గిపోయినప్పుడు పుచ్చకాయ దాని లోటును బర్తీ చేస్తుంది.
విటమిన్ ఎ, విటమిన్ సీలు ఉంటాయి.
విటమిన్ ఏ కంటిచూపుకి మంచిది.
విటమిన్ సీ రోగనిరోదకశక్తిని పెంచడానికి తోడ్పడుతుంది.
టొమాటో లాంటి ఎర్రని పళ్ళలో ఉండే లైకొపీన్ అనే పోషకం గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.
ఈ మధ్యచేసిన పరిశోదనల్లో తేలిన విషయం ఏమిటంటే... 
మిగిలిన పళ్ళలో లేదా కాయగూరల్లో కంటే లైకొపీన్ పుచ్చకాయల్లో ఎక్కువగా లభిస్తుందని.
ఇంకా, పుచ్చకాయలో లభించే సిట్రులైన్ అనే అమీనో యాసిడ్ మూత్రపిండాల ఆరోగ్యానికి చాలా మంచిదట. 
పుచ్చకాయ కొన్ని రకాల కేన్సర్ల నుంచి కూడా రక్షణ కల్పిస్తుందట.
బాగుంది కదా? 
ఒక్క ముక్క తింటే...
దాహం తీరడమే కాకుండా
బోనస్‌గా ఈ లాభాలు కూడా ఉన్నాయి. 
నా ఓటయితే పుచ్చకాయకే!
© Dantuluri Kishore Varma

Monday 3 March 2014

మా ఊరు పిల్లంక - బై శుభ

యానం నుంచి ద్రాక్షారామం వెళ్ళేదారిలో ఇంజరం ఊరిలోనుంచి ఎడమవైపుకి తిరిగి గోదావరి గట్టు ఎక్కేస్తే ... ఓ తల్లీ గోదారి తుళ్లి తుళ్లి పారేటి పల్లె పల్లె పచ్చాని పందిరి. పల్లె పల్లె పచ్చాని పందిరి అన్నట్టు గట్టుకి ఓ వైపు గోదావరి, మరోవైపు పచ్చని చేలూ, చేలగట్లమీద వరసల్లో కొబ్బరిచెట్లూ.. వీటన్నింటికీ మించి ఆనందం కలిగించేది `మా వూరు వచ్చేస్తున్నాం` అన్న ఫీలింగు. ఇంతకీ మావూరి పేరు చెప్పలేదు కదూ? పిల్లంక. 

ఊరంటే నా స్నేహితులూ, బందువులూ, నేను చదువుకొన్న స్కూలు, ఊరిలోనుంచి బయటకు వెళ్ళినా, తిరిగి వచ్చినా తప్పనిసరిగా హాయ్ చెప్పే గోదావరీ, గోదావరి మధ్యలో లంకలూ, కాలవగట్లమీద నడచి వెళ్ళడం, పంటుమీద, పడవలమీదా నది దాటడం గుర్తుకు వస్తాయి.  

శేఖర్ కమ్ముల, వంశీ, బాపు... సెల్యులాయిడ్ మీద చూపించిన దానికంటే పిల్లంకలో గోదావరి బాగుంటుంది.
గాడ్స్ ఓన్ కంట్రీ కేరళ ఒక్కటే కాదు, పిల్లంక కూడా.
పిల్లంక కాలువ గట్టు. నా చిన్నప్పుడు మా ఊరికి బస్సు ఉండేది కాదు. ఇంజరం వంతెన వరకూ నావలమీద వెళ్ళి బస్సు ఎక్కేవాళ్ళం. కాలువలో నావమీద ప్రయాణం ఒక ప్లజంట్ మెమొరీ. తరువాత, హై స్కూల్ కి నడచి ఈ దారి వెంటే వెళ్ళేవాళ్ళం. మధ్యలో మామిడి కాయలు, చింతకాయలు.... గోల్డెన్ డేస్.
గోపాలస్వామి గుడి ఉంది. ఎప్పుడు కట్టారో తెలియదు కానీ శిధిలావస్థకి వచ్చేసింది. అందరం చూసి బాధపడటమే కానీ చెయ్యగలిగింది ఏమీ లేదు. 

రెండుసంవత్సరాల క్రితం నా కజిన్ సతీష్ పిల్లంక పేరుమీద ఫేస్‌బుక్ గ్రూప్ ప్రారంభించాడు. ఎవరో గుడి అవస్థ గురించి ఒక పోస్ట్ పెట్టారు. సభ్యులందరూ తక్షణం స్పందించారు. విరాళాలు పోగయ్యాయి. సంవత్సరం తిరిగేసరికి గుడి మరామత్తులు జరిగిపోయాయి. గుడికి చేర్చి కళ్యాణమండపం నిర్మించారు, రంగులు వేశారు. ఇప్పుడు మా వేణుగోపాలస్వామి వెలిగిపోతున్నాడు.
మావూరి యూత్ ఉంది. 
ప్రతీసంవత్సరం పెద్దపండగకి సభ్యులు అంతాకలిసి గెట్‌టుగెదర్ ఏర్పాటు చేస్తారు. ముందటేడు ఊరి ఆడబడుచులని కూడా పిలవాలని మంచి ఆలోచన వచ్చింది ఓ బుర్రలోకి. ఇంకేముంది ఆ ఏడాది పండుగకీ, మళ్ళీ ఈ పండుగకీ అంతా వచ్చి కలిశారు. ఊరంతా సందడే సందడి. కేరింతలతో, తుళ్ళింతలతో, ఆటల పాటలతో మారు మోగిపోయింది. 
గోదావరికి, వేణుగోపాలస్వామికి, పిల్లంకయూత్‌కి, ఫేస్‌బుక్‌గ్రూపుకి, హోల్‌మొత్తంగా మావూరికి జై! 


© Dantuluri Subha

దీని సోయగం చూడండి!

రాజవీధుల్లోనుంచి అంబారీ కట్టిన ఏనుగు నడచిపోతూ ఉంటే దాని ఠీవీ చూసితీరవలసిందే. పాదచారులు ప్రక్కకి తొలగిపోయి దారి వదులుతారు. ఒక్కోసారి అది మోర పైకెత్తి, తొండం లేపి ఘీంకారం చేసిందంటే దగ్గరలో ఉన్నవాళ్ళకి వెన్నులో వొణుకు పుడుతుంది. దేవుడి సేవలో ఉన్న ఏనుగులకైనా అదే రాజసం. సర్కస్‌లో మావటి చెప్పినట్టు నడుచుకొంటున్నా, ఏనుగుచేసే విన్యాసాలలో లావణ్యం తొణికిసలాడుతుంది. నేషనల్ జియోగ్రాఫిక్ చానల్లో అడివిలో తిరిగే ఏనుగుల గుంపుని చూపిస్తూ ఉంటారు. వాటి స్థిమితమైన లయాత్మక నడక బహు సొగసుగా ఉంటుంది. పరుగెత్తే అశ్వంలో ఒకరకమైన అందముంటే, నడిచివెళ్ళే గజరాజులో మరొక రకమైన అందం ఉంటుంది. ఏది ఏమైనా మనకు తెలుసున్న అందమైన జంతువులలో ఏనుగు మొదటివరసలో ఉంటుంది.   

ఏనుగులని చూడాలంటే ఆఫ్రికా ఖండానికో, శ్రీలంకా, ఇండోనేషియా లాంటి దేశాలకో, అదీ కాకపోతే మనకేరళాకో వెళ్ళాలి. లేదంటే పనికిరాని ఇనుపసామాన్లు, కలప లాంటివి పోగేసి ఒక ఏనుగుని తయారుచెయ్యాలి. అది కదలడానికి మోటర్లు, మెషిన్లు తగిలించి, తొండం పైకి ఎత్తడానికి హైడ్రాలిక్స్ ఉపయోగించి, నిజం ఏనుగులాగే కాళ్ళను కదిలించి ముందుకు వెళ్ళడానికి రోబోటిక్స్ సహాయం తీసుకోవాలి. అప్పుడు కేరళ లాంటి ప్రాంతాలనుంచి కూడా ఈ మహా ఏనుగుని చూడటానికి అది ఉన్న ప్రాంతానికి వెళతారు! 
ఇదంతా ఎందుకు చెపుతున్నాననే సందేహం వస్తుంది కదా? కొంచెం పాతవిషయమే కానీ, మీకు ఒకవేళ తెలిసి ఉండకపోతే ఆసక్తి కరంగా ఉంటుందని చెపుతున్నాను. ఫ్రాన్స్‌లో నాంటెస్ అనే పట్టణంలో అటువంటి ఏనుగుని తయారు చేశారు. ఓ నలభై తొమ్మిది మంది సందర్శకులని ఎక్కించుకొని, ఘీంకరిస్తూ, తొండంలోనుంచి పొగలు వదులుతూ మందగమనంతో ముందుకుపోతున్న యాంత్రిక గజాన్ని తయారు చెయ్యడానికి చాలా ఖర్చయ్యిఉంటుంది. కానీ, ప్రపంచం దృష్ఠిని తమవైపు ఆకర్షించుకోవడానికి, తమ సృజనాత్మక కళని ప్రదర్శించడానికి అది ఒక గొప్ప ఆలోచన. ఆ వూళ్ళో పాత షిప్‌యార్డ్ గొడౌన్లలో పేరుకుపోయిన పాత ఇనుము, యంత్ర సామాగ్రిని గ్రేట్ ఎలీఫెంట్‌ని తయారు చెయ్యడానికి వాడుకొన్నారు. ఫ్రాంకోయిస్ డెలరోజైర్, పియరి ఆరిఫైస్ అనే ఇద్దరు కళాకారుల సృజన ఇందులో ఉంది. పీసా టవరో, ఈఫిల్ టవరో, కొల్లోసియమో, క్లాక్ టవరో, లండన్‌బ్రిడ్జీనో లేకపోయినా తమకంటూ ఒక ప్రత్యేకతను చూపించుకోవడానికి `మెషీన్స్ ఆఫ్ ఐల్ ఆఫ్ నాంటెస్` ఆలోచన ఫలించింది. ఇప్పుడు యూరోప్ సందర్శించే జనాలు తమ ఐటినరీలో నాంటేస్‌ను కూడా చేర్చుకొంటున్నారట. 



© Dantuluri Kishore Varma

Saturday 1 March 2014

రంగరాయా మెడికల్ కాలేజ్

Google images

కల్నల్ డి.ఎస్.రాజు గారు, డాక్టర్ ఎం.వీ.కృష్ణారావుగార్లు కోస్తాప్రాంతంలో విద్యార్థులకి వైద్యవిద్యని అందించే ఉద్దేశ్యంతో ఒక ప్రైవేట్ వైద్య కళాశాలని స్థాపించాలని అనుకొన్నారట. మెడికల్ కాలేజీని ప్రారంభించాలంటే చిన్నవిషయంకాదు. కాబట్టి విరాళాలు సేకరించారు.  విరాళాలు ఇచ్చినవారిలో తణుకు వాస్తవ్యులు ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్ గారు ఒకరు. ఆయన బావగారు రంగారావు అప్పటికే స్వర్గస్తులయ్యారు. ఆ రంగారావుగారి పేరుమీదే దీనికి రంగరాయా మెడికల్ కాలేజ్ అని పేరుపెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లోనే గొప్పకాలేజీలలో ఇది ఒకటి. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న నీలంసంజీవరెడ్డిగారు 1958లో ప్రారంభోత్సవంచేశారు. 1977లో ప్రయివేట్ యాజమాన్యం నుంచి రంగరాయ మెడికల్ కాలేజీ ప్రభుత్వ కాలేజీగా మారింది. 

కాలేజీ స్థాపించి 50సంవత్సరాలు అయిన సందర్భంగా 2008లో భారత తపాలా శాఖవారు రంగరాయ మెడికల్ కాలేజీ ఫస్ట్‌డే కవర్‌ను విడుదల చేశారు.  

© Dantuluri Kishore Varma

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!