Pages

Saturday 31 January 2015

కాలువ గట్టు మీద...

ఇది ఏ ఊరు?

ఏ ఊరయితే ఏమిటి? చూడండి కాలువ గట్టు ఎంత బాగుందో? 

చూస్తున్నా! చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ సీతాకోక చిలుకల్లా ఎగిరి వస్తున్నాయి. స్నేహితులతో కలిసి గంటలు, గంటలు కాలువలో ఈత కొట్టేవాళ్ళం తెలుసా? ఓ సారి సుబ్బారావు నీళల్లోకి దిగిన తరువాత వాడి బట్టలు దాచేసాం. చాలా సేపు వెతుక్కొని, ఇమ్మని బ్రతిమాలి, లాభం లేక రెండు అరిటాకులు అడ్డం పెట్టుకొని ఊళ్ళోకి ఒకే పరుగు పెట్టాడు. ఆ సంఘటన తలచుకొంటే ఇప్పటికీ నవ్వు ఆగదు.      
ఇలాంటి కాలువే మావూళ్ళోది కూడా. అవతలి గట్టుకి వెళ్ళడానికి బల్ల కట్టు ఉండేది. పొడవైన వెదురు కర్రని నీటి అడుగుభాగానికి గుచ్చి బల్లకట్టుని ముందుకి నెట్టేవారు. గట్టు మీదే ఓ గుడిసెలో కుటుంబంతో పాటూ బల్లకట్టు పోలయ్య ఉండేవాడు. మోతుబర్లందరూ పెద్దపండగలప్పుడు పొలంలో పనిచేసే పాలేర్లతో పాటూ పోలయ్యకి కూడా వడ్లు కొలిచేవారు. 
చల్లని చెట్టు నీడలో నీళ్ళని చూస్తుంటే వాటిలోకి దిగాలని అనిపించడం లేదూ? దోసిటితో నీళ్ళు తీసుకొని ముఖంమీద చిలకరించుకొంటే ఎంత బాగుంటుందండీ అసలు!? కానీ, దిగుదామంటే  షూ తడిచిపోతుంది. బట్టలు మురికై పోతాయి. చిన్నప్పుడు అవేమీ పట్టించుకొనే వాళ్ళం కాదు. కలువపువ్వుల కోసం పోటీలుపడి మరీ నీటిలోకి దిగేసేవాళ్ళం. 
ఎవరో పశువుల కోసం గడ్డి కోసుకొంటున్నట్టున్నారు. 
ఇతను చూడండి అడ్డుకట్ట మీద నుంచి తలమీద అంత బరువుతో అడుగు తడబడకుండా ఎలా చకచక మని నడిచేస్తున్నాడో.    
కాలువ కొంచెం ఇరుకుగా ఉన్న చోట ఆ గట్టునుంచి, ఈ గట్టుకి అడ్డంగా సగానికి చెక్కిన ఒకే ఒక తాటి మాను ఇలానే వేశారు మా కాలువ గట్టున కూడా. అలవాటు ఉంటే కానీ దాన్ని దాటలేం. మాఊరి మునసబు గారి మేనల్లుడు ఓ సారి పట్నం నుంచి వస్తూ  తాటిపట్టి మీదనుంచి దాటడానికి కొంచెం సంశయిస్తున్నాడు. అదిగో సరిగ్గా అప్పుడు జూనియర్ కాలేజికి వెళుతున్న అమ్మయిలు అవతలి గట్టుమీదకి వచ్చారు. వాళ్ళల్లో మునసబుగారి అమ్మాయి కూడా ఉంది. పట్నం బావ తటపటాయింపు చూసి ముసిముసినవ్వులు నవ్వింది. మనోడికి అవమానంగా అనిపించింది. ధైర్యంగా ముందడుగు వేశాడు.  కాలు తడబడింది. దబ్బున కాలువలో పడ్డాడు. అమ్మాయిల నవ్వులు ఎగసిపడిన నీటి తుంపరలు అయిపోయాయి.
వరిచేలు, కొబ్బరిచెట్లూ భలేగా ఉన్నాయి మాష్టారు. ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంతదూరమైనా నడిచేయ్యొచ్చు. 
ఇక్కడ చూడండి. ఈ కాలిబాట వెంట అలా వెళ్ళామనుకోండి కళ్ళాం వస్తుంది. సరిగ్గా చూడండి చిన్న దిమ్మలా కనిపిస్తుంది. దాన్లో ఒక పాక కూడా ఉంది. వరిచేలు కోసేసిన తరువాత ఆరబెట్టి, తరువాత కుప్ప నూర్పుళ్ళు చేస్తారు. పూర్వం ఎడ్లబళ్ళతో నూరిస్తే, ఇప్పుడు ట్రాక్టర్లు, వరినూర్పు యంత్రాలు ఉపయోగిస్తున్నారు. నూర్పుళ్ళు అయిన తరువాత, ధాన్యాన్ని ఎగరబోసి బస్తాల్లో కట్టేస్తారు. రైతులు ఈ పనులన్నీ  కళ్ళాల్లోనే చేసుకొంటారు.  
చింత లేకుండా ప్రశాంతంగా పనిచేసుకొనే ఈ మనుష్యులని చూస్తే ఈర్ష్యగా ఉంటుంది మాష్టారు. మీరేమంటారు?
దూరపు కొండలు నునుపు. మనం `స్ట్రెస్సో!` అని ఓ ప్రక్కనుంచి గోల పెడుతుంటే, ఉద్యోగాలు వెతుక్కొని ఇక్కడి వాళ్ళు పట్టణాలకి వలసపోతున్నారు. ప్రశాంతతని చూసి ముచ్చట పడతాం కానీ, `మా పొలం పనులు మీకిచ్చేస్తాం, మీ ఉద్యోగాలు మాకిచ్చేస్తారా?` అని ఇక్కడి వాళ్ళు అడిగితే మనం ఏం చెపుతాం!?
నామాట అలా ఉంఛండి. మీరయితే ఏమి చేస్తారు?

© Dantuluri Kishore Varma

No comments:

Post a Comment

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!