Pages

Monday 16 February 2015

వర్షించే కళ్ళు

మహాశివరాత్రి సందర్భంగా భారతదేశంనుంచి ఇరవైఒక్క మంది హిందూ భక్తులు పాకిస్థాన్‌లోని కటాస్‌రాజ్ దేవాలయాన్ని దర్శించడానికి వెళ్ళారని నిన్నటి వార్త. పాకిస్తాన్‌లో మైనార్టీ వర్గాల దేవాలయాలని పరిరక్షించే ఎవాక్యుఈ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్(ఈటీపీబీ) అధికారులు ఈ హిందూ భక్తులకి కావలసిన సౌకర్యాలను ఏర్పాటు చేశారని పేపర్లలో రాశారు. ఈ వార్త చూసిన తరువాత కటాస్‌రాజ్  దేవాలయం గురించి తెలుసుకోవాలని ఆసక్తి కలిగింది. గూగుల్‌లో వెతికితే చాలా సమాచారం లభ్యమయ్యింది. ఆ విశేషాలు మీకు కూడా నచ్చవచ్చని ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను.  
Photo from the net
లాహోర్‌ నుంచి 270 కిలోమీటర్ల దూరంలో, పంజాబ్‌లో చక్వాల్ జిల్లాలో సుమారు 900 సంవత్సరాల పురాతనమైన కటాస్‌రాజ్  దేవాలయం ఉంది. కటాస్‌ అనే కోనేరుకి చుట్టూ ప్రధానంగా ఏడు దేవాలయాలు ఉంటాయి. ఇవికాక ఇంకా కొన్ని చిన్న చిన్న మందిరాలు కూడా ఉంటాయి. శివాలయం, రామాలయం, హనుమంతుని మందిరాలు ఉన్నాయి. కటాస్‌ కోనేరులో జలం చాలా మహిమాన్వితమైనదని భక్తుల నమ్మకం. ఈ కోనేరులో తప్పక స్నానాలు చేస్తారు. స్థల పురాణం ప్రకారం సతీదేవి మరణం తరువాత శివుడు ఎంతో ధు:ఖించాడట. అతని కన్నీరే ఈ కోనేటిలో నీరుగా మారిందని అంటారు. సంస్కృతంలో కేటాక్ష అంటే వర్షించే కళ్ళు అని అర్థమట. పాండవుల వనవాస సమయంలో నాలుగు సంవత్సరాలు ఇక్కడే గడిపారట. ఈ కోనేటి దగ్గరే యక్ష ప్రశ్నలకి సమాధానాలు చెప్పి ధర్మరాజు తన సోదరులని రక్షించుకొన్నాడని చెపుతారు.

కటాస్‌రాజ్ దేవాలయాల సముదాయాన్ని ప్రపంచ వారసత్వ సంపద(వాల్డ్ హెరిటేజ్ సైట్) గా గుర్తించాలని యునెస్కో్‌కి పాకిస్థాన్ ప్రభుత్వం ప్రతిపాధనలు పంపిందట. కటాస్‌రాజ్ దేవాలయం పేరుమీద పాకిస్థానీయులు నిర్వహిస్తున్న రెండు ఫేస్‌బుక్ పేజీలు కూడా చూశాను. వాటిలో చాలా చక్కని ఫోటోలను అప్‌లోడ్ చేస్తున్నారు.

కటాస్‌రాజ్ విశేషాలు ఈ డాక్యుమెంటరీలో చూడండి.    

అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.

© Dantuluri Kishore Varma

2 comments:

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!