Pages

Friday 6 March 2015

ఈ తూరుపూ.. ఆ పశ్చిమం

గోతెలుగు వెబ్ వార పత్రికలో నా శీర్షిక `ఈ తూరుపూ.. ఆ పశ్చిమం` ఈ రోజు నుంచి ప్రారంభమయ్యింది. చదివి మీ అభిప్రాయాలనీ, సూచనలని తెలియజేయాలని కోరుకొంటున్నాను. ఫేస్‌బుక్ ఫ్రొ్‌ఫైల్ ఉపయోగించి మీ విలువైన మాటల్ని నేరుగా గో్‌తెలుగు ఆర్టికల్ దగ్గరే పోస్ట్ చేసే అవకాశం ఉంది. ధన్యవాదాలు. శీర్షిక విజయవంతంగా కొనసాగడానికి మీ ఆశీశ్సులు కోరుకొంటూ..   

భారతదేశపు ధార్మికత, సంస్కృతి, ఆచార వ్యవహారాలు, అహింస, వేదాలు, హిమాలయాలు.. ప్రపంచాన్ని మనవైపుకు ఆకర్షిస్తూ ఉంటాయి. బహుశా వస్తువైవిధ్యం కోసం, కథాశిల్పం కోసం మనం పశ్చిమదేశాల సాహిత్యం చదవాలని కోరుకొంటాం.  దేశం ఏదైనా ప్రతీ మనిషిలోనూ భావోద్వేగాలు ఉంటాయి. ప్రేమలో ఉద్వేగం, విరహంలో బాధ, బాధలో కన్నీళ్ళు, ఇతరుల కష్టాలకు `అయ్యో!` అనుకోవడం, అన్యాయం జరిగినప్పుడు కట్టలు తెంచుకొనే కోపం, ఏమీ చెయ్యలేనప్పుడు కలిగే నిస్పృహ, విజయం వచ్చినప్పుడు వెల్లువెత్తే ఉత్సాహం కథ కథలోనూ అనుభూతి చెందవచ్చు. ఈ మధ్యనే నోబుల్ శాంతి పురస్కారం అందుకొన్న మలాలా యూసఫ్‌జాయ్ ఆత్మ కథ `అయాం మలాలా` చదివితే పాకిస్థాన్లో తాలిబన్ల దుశ్చర్యలు తెలుస్తాయి. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో జర్మన్ నియంత హిట్లర్ నేత్రుత్వంలో హోలోకాస్ట్ పేరుతో ఆరుకోట్లమంది యూదులని ఊచకోత కోసారు. ఆ నేపద్యంలో అన్నే ఫ్రాంక్ అనే ఓ పద్నాలుగేళ్ళ పిల్ల నాజీ సైనికులకు దొరకకుండా అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు రాసుకొన్న డైరీ ఓ చీకటి అధ్యాయానికి ప్రత్యక్ష సాక్షి. దేశ విభజన సమయంలో సరిహద్దు దాటుతూ ఉండగా హిందూ, ముస్లింలు పరస్పరం జరుపుకొన్న నరమేదం కుష్వంత్‌సింగ్`ఏ ట్రెయిన్ టు పాకిస్తాన్` లో చదవవచ్చు.

గాన్ విత్ ద విండ్ అనే నవలలో రచయిత్రి మార్గరెట్ మిశ్చెల్ యాష్లే అనే పాత్రతో మెచ్చుతునక లాంటి ఒక మాట చెప్పిస్తుంది. `చదువుకోవడానికి పుస్తకాలు ఉంటే ప్రపంచంలో ఏమూలయినా నాకు యూరోప్‌తో సమానం,` అని. కాళిదాసు రాసిన మేఘసందేశమో, షేక్స్పియర్ రాసిన రోమియో అండ్ జూలియట్టో, శరత్‌బాబు రాసిన దేవదాసో, టాగోర్ కథలో, ఆర్.కే. నారాయణ్ చిన్న పిల్లవాడి ప్రపంచం స్వామీ అండ్ ఫ్రెండ్సో  జేన్ ఆస్టిన్ ప్రైడ్ అండ్ ప్రెజుడీసో.. ఆఖరికి హారీ పోటర్ నవలలో చదువుతుంటే మనం ప్రపంచంలో ఏ మూల ఉన్న అది మనకు ఇష్టమైన ప్రదేశంగానే అనిపిస్తుంది! 

ఓ మంచి పుస్తకం ఓ కొత్త జీవితానుభవాన్ని మోసుకొచ్చి పరిచయం చేస్తుంది. `వందపుస్తకాల్ని చదువు, వంద జీవితాలను నువ్వు జీవించినట్టే,` అంటారు విజ్ఞులు. కళ్ళు తెరిచి చూపుని అక్షరాల వెంట పరిగెత్తిస్తుంటే కలల తివాచీ మీద కొత్త లోకాల్ని చుట్టిరావచ్చు.  ఒక్కోసారి  చదువుతూ ఉండగా మనసులోనో, మెదడులోనో కొత్త కిటికీలు తెరుచుకొంటాయి. ధగద్ధగాయమానమైన వెలుగులు కలల తివాచీని భూమిమీదకి దించుతాయి, వాస్తవాలని ఎరుక పరుస్తాయి.

వందో.. మరెన్నో.. పుస్తకాలను చదవడం ఓకే! అయితే, `ఏ వందపుస్తకాలని చదవాలి?` అనే ప్రశ్న వస్తే వేటిని ఎంచుకొంటాం? ఎన్నెన్నో సంస్కృతులు, నేపధ్యాలు, అలవాట్లు,  కష్టాలు, అనుభూతులు, పోరాటాలు, ప్రేమలు, విరహాలు, ఆశించడాలు, భంగపడడాలు.. ఈ తూర్పునుంచి ఆ పశ్చిమంవరకూ ఉన్న సాహిత్యంలో కోకొల్లలు. కనిపించిన పుస్తకమల్లా చదువుకొంటూ వెళ్ళడం అంటే, వజ్రాల గనిలో కనిపించిన రాయినల్లా ఏరుకొంటూ వెళ్ళి నట్టు. ప్రతీ రాయీ వజ్రం కాదు. అందుకే హెన్రీ డేవిడ్ థోరూ అంటాడు `అత్యుత్తమ పుస్తకాలనే ముందు చదువు, లేదంటే వాటిని చదివే అవకాశం నీకు ఎప్పటికీ రాకపోవచ్చు,` అని.

ఓ కథో, నవలో బాగా నచ్చినప్పుడు దాని గురించి నలుగురికీ చెప్పాలనిపిస్తుంది. వజ్రం దొరికితే దాచుకోకుండా ఉండలేం; వజ్రంలాంటి విలువైన విషయాలను చదివితే పంచుకోకుండా ఉండలేం! నేను చదివిన వాటిలో మీతో పంచుకోకుండా ఉండలేని మంచి కథలు, నవలలు గురించి `ఈ తూరుపు.. ఆ పశ్చిమం..` శీర్షికలో వారం వారం రాస్తాను. ఆదరిస్తారని ఆశిస్తూ...               -దంతులూరి కిషోర్ వర్మ.

© Dantuluri Kishore Varma

4 comments:

  1. బావుందండీ. మీ ఈ ప్రయాణంలో మరో మలుపు.. అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు శిశిర గారు.

      Delete
  2. అభినందనలు కిషోర్ వర్మ గారూ !

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు నాగరాణి గారు.

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!