Pages

Sunday 22 March 2015

మరో రెండు..

గోతెలుగు వారపత్రికలో నేను రాసిన మరొక రెండు ఆర్టికల్స్ వచ్చాయి. సాకీ గా సుప్రసిద్దుడైన హెచ్.హెచ్.మన్రో(1870-1916) రాసిన కథ `ది హౌండ్స్ ఆఫ్ ఫేట్` ని 13.03.2015 తేదీనాటి పత్రికలో, బంకించంద్ర చటర్జీ రాసిన ఆనందమఠం నవలని 20.03.2015 సంచికలోనూ పరిచయం చేశాను. ఆసక్తి ఉంటే చదువుతారని ఇక్కడ లింక్‌లు ఇస్తున్నాను. వాటిని చదివి మీ అభిప్రాయాలను తెలియజేస్తే సంతోషిస్తాను. 

వందేమాతరం!` అనే నినాదం వినిపించగానే వొళ్ళు గగుర్పాటు చెందుతుంది. అణువణువూ రోమాంచితమౌతుంది. చూసేది సినిమా అయినా, చదివేది నవల అయినా ఆంగ్లేయుడి బూటు కాలు మట్టిలో పొర్లుతున్న స్వాతంత్ర సమర యోధుడి పక్కటెముకల మీద బలంగా తాకినప్పుడు - అతను బాధతో `అమ్మా!` అని ఆక్రోశించడానికి బదులు ఆనందంతో `వందే మాతరం!` అని నినదిస్తే... చొక్కా గుండీలను విప్పి గుండెను తెల్ల పోలీసులకి చూపిస్తూ `కాల్చరా, కాల్చూ!` అని ఘర్జించి, తుపాకీ గుండె హృదయంలో దిగబడిన క్షణంలో కథానాయకుడు `వందేమాతరం!` అంటే... పెడరెక్కలు విరిచి కట్టి, నలుగురూ చూస్తూ ఉండగా ఉరికంభం మీదకి ఎక్కించినప్పుడు మరొక యువకుడు ఉరితాడుని ముద్దు పెట్టుకొని `వందేమాతరం!` అని సింహనాదం చేస్తే... ఆశ్చర్యపోతాం. వందేమాతర నినాదం వాళ్ళకి ఇచ్చిన స్థైర్యానికి అబ్బురపడతాం. బంకించంద్ర చటర్జీ మనసులో పుట్టిన వందేమాతర గీతం అనే ఆలోచనా విత్తనం జనాల హృదయక్షేత్రంలో పడి మహావృక్షమయ్యింది. ఒకదేశాన్ని స్వేచ్చవైపుకి నడిపించింది.వందేమాతర గీతాన్ని బంకించంద్ర చటర్జీ నేరుగా రాయలేదు. 1882లో రాసిన తన నవల ఆనందమఠంలో ఇది అంతర్భాగంగా వస్తుంది. ఆనందమఠం నవలకి నేపద్యం 1771వ సంవత్సరంలో బెంగాల్‌లో సంభవించిన మహా కరువు, సన్యాసుల తిరుగుబాటు.

నవలలో కథాకాలం నాటికి బెంగాల్ బ్రిటీష్ వాళ్ళ పాలనలో లేదు. నవాబే పరిపాలిస్తున్నాడు. జనాల నుంచి పన్నులు వసూలు చేసే హక్కు మాత్రం ఆంగ్లేయులది. ఆంగ్లేయులకి ప్రజల యోగక్షేమాలు చూడవలసిన బాధ్యత లేదు, కేవలం పన్నులు వసూలు చేసుకొనే అధికారం తప్ప. వానలు కురియక కరువు వచ్చినా రైతులనుంచి ఆంగ్లేయులకి రావలసిన పన్నులు మాత్రం తగ్గడానికి వీలు లేదు అని భావించారు వాళ్ళు. అందుకే కరువు వచ్చిన సంవత్సరమే పన్నులని అమాంతం పెంచేశారు. వాటిని కట్టడానికి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఆకలితో అలమటించిపోతున్నారు. అడుక్కొందామన్నా దానం చేసే వాడు లేడు.

అక్కడక్కడా కొద్దిగా పండిన పంటల్ని రాజుగారు తమ సైన్యం కోసం కొనేశారు. ధనికులు, పేదవాళ్ళు అనే తారతమ్యం లేకుండా ప్రతీ ఒక్కరినీ ఆహార కొరత తీవ్రంగా పీడిస్తుంది. పశుగ్రాసం కూడా లభ్యం అవడం లేదు. క్రమంగా ఆకలి చావులు మొదలయ్యాయి. తిండిగింజల కోసం భార్యల్నీ, పిల్లల్నీ అమ్ముకొంటు న్నారు.   వాళ్ళను కూడా ఎవరూ కొనుక్కొనేందుకు ముందుకు రాకపోవడంతో జనాలు ఏజంతువుని పడితే దానిని తినడానికి తయార వుతున్నారు. అవకాశం దొరికితే తోటి మనుషుల్ని కూడా వదిలేలా లేరు.  వ్యాధులు ప్రభలాయి.  ఊళ్ళల్లో చనిపోయిన వాళ్ళు పోగా మిగిలిన వాళ్ళు వలస పోతున్నారు. కానీ ఎక్కడి కెళ్ళినా పరిస్థితిలో మార్పులేదు. పదచిహ్న గ్రామంలో మహేంద్రసింహుడు గొప్ప ధనవంతుల్లో ఒకడు. అతని భార్య కళ్యాణి. వాళ్ళకో చిన్న పాప ఉంది. కరువుకారణంగా బందువులు, సేవకులూ చెల్లాచెదురయ్యారు. వాళ్ళ బంగళాలో ఉన్న ఆహార నిల్వలు కూడా అడుగంటుకు పోయాయి. ఇంకా ఊరిలోనే ఉండడం వల్ల ఉపయోగం కనిపించడం లేదు. అందుకే ముర్షీదాబాదో, కాసింబజారో, కలకత్తానో పోదామని నిర్ణయించుకొన్నారు. అలా వెళ్ళడానికి కూడా ప్రయాణ సదుపాయాలేమీ లేవు. ఊళ్ళు, అడవులు దాటి నడచి పోవలసిందే.  భార్యాభర్తలు నడచి, నడచి చీకటిపడే వేళకి ప్రక్క ఊరికి వెళతారు. ఆ ఊరుకూడా నిర్మానుష్యంగా ఉంది. వాళ్ళకి ఆకలితో శోషవచ్చేలా ఉంది. భార్యాపిల్లల్ని ఓ ఇంటిదగ్గర ఉంచి మహేంద్రసింహుడు పాలకోసం ముందుకు పోయాడు. అదే అదనుగా కొందరు దొంగలు విరుచుకు పడి కళ్యాణినీ, చిన్న పాపనీ ఎత్తుకొని అడవిలోనికి పారిపోయారు. ఈలోగా బ్రిటీష్ అధికారులు ప్రజలనుంచి పన్నులరూపంలో వసూలు చేసిన ధనాన్ని బండిమీద వేసుకొని సిపాయిల రక్షణతో కలకత్తాకు తీసుకొని పోతున్నారు .  భార్యా, పిల్లల కోసం వెతుకుతున్న మహేంద్రసింహుడు రక్షణకోసం వెంట తెచ్చుకొన్న తుపాకీ చేతితో పట్టుకొని వాళ్ళ కంట పడ్డాడు. అతనిని దొంగగా భావించి, బంధించి వెంట తీసుకొని పోతున్నారు.

దొంగలు కళ్యాణిని తీసుకొని వెళ్ళిన అడవిలో ఒక పురాతనమైన మఠం ఉంది. మఠం ఉందని బయటి ప్రపంచానికి తెలియనంత మరుగులో ఉంది అది. అక్కడ దేశసేవకోసం కుటుంబాలని పరిత్యజించిన సన్యాసులు ఉంటారు. దేశమాతని దేవీ స్వరూపంగా కొలుస్తారు వాళ్ళు. సన్యాసుల పేర్లు సత్యానందుడు, భవానందుడు, జీవానందుడు, ధీరానందుడు, జ్ఞానానందుడు... ఇలా ఉంటాయి. మఠంలో ఆనందులు ఉంటారు కనుకే అది ఆనందమఠం అయ్యిందేమో! కళ్యాణి ఎలాగో దొంగలనుంచి తప్పించుకొని అడవిలో పరుగెత్తడం మొదలు పెట్టింది. అదృష్టవశాత్తు ఓ ఆనందుడి కంటడింది. అతను ఆమెని రక్షించి మఠానికి చేర్చాడు. మరో వైపు మహేంద్రుడిని బందించి తీసుకొని వెళుతున్న సీపాయిలమీద కొందరు సన్యాసులు దాడి చేసి మహేంద్రుడిని విడిపించి, ధనాన్ని కొల్లగొట్టుకొని తీసుకొని పోయారు. మహేంద్రుడిని మఠం వైపు నడిపించి తీసుకొని వెళుతూ భవానందుడు వందేమాతరం అని పాడడం మొదలు పెడతాడు. నవలలో వందేమాతర గీతం మొదటిసారి అగుపిస్తుంది. ఎంతో ప్రేరణ కలుగజేసే గొప్పతనం ఆ పాటలో ఉంది. ఒక్కసారి విన్న మీదట మహేంద్రుడు కూడా గీతాలాపనలో తన స్వరాన్ని కూడా కలుపుతాడు. పాడుతూ ఉండగా అప్రయత్నంగా కనులవెంట జలజలమని కన్నీరు ధారాపాతంగా కారుతుంది.

ఆనందుల కారణంగా మహేంద్రుడు, కళ్యాణీ తిరిగి కలుసుకో గలిగారు. మహేంద్రుడికి దేశసేవలో భాగం పంచుకొందామని ఆలోచన కలిగింది. కానీ అందుకోసం భార్యా పిల్లల్ని పరిత్యజించాలి. చాలా డోలాయమానంలో పడ్డాడు. వాళ్ళను పదచిహ్న గ్రామంలో తన ఇంటిలో విడిచిపెట్టి, నమ్మకమైన సేవకులని నియమించి తిరిగి అడవిలోనికి వచ్చి ఉద్యమంలో జేరాలని అనుకొంటున్నాడు. కళ్యాణికి ఆతని ఆలోచన అర్థమయ్యింది. ఆమెకి భర్తను విడిచి ఉండడం ఇష్టంలేదు, అలాగని ఆతని అభీష్టానికి అడ్డం కాదలచుకోలేదు. అందుకే విషాన్ని మింగింది. అప్పుడే వాళ్ళ బిడ్డ కూడా ప్రమాదవశాత్తూ ఒక విషపు మాత్రను నోటిలో వేసుకొంది. ఇద్దరూ స్పృహ తప్పిపోయారు. మహేంద్రుడు వాళ్ళు మరణించారని భావించాడు. విలపిస్తున్నాడు. సత్యానందుడు అటువెళుతూ మహేంద్రుడిని చూశాడు. అతనిని వోదారుస్తూ, సంకీర్తన చేస్తూ చెంతనే కూర్చున్నాడు.  అంతలో ఒక సిపాయిల దళం అడవిలోనికి వచ్చింది. సన్యాసులంటే వాళ్ళ దృష్టిలో విప్లవకారులు. అందుకే సత్యానందుడినీ, అతనితో పాటూ ఉన్న మహేంద్రుడిని నిర్బందించారు. సత్యానందుడు సంకీర్తనని కొనసాగిస్తున్నాడు. అతను పాడే కీర్తనలోనే ఒక సందేశం ఇమిడి ఉంది-

`ధీరసమీరే తటినీతీరే
వసతివనే పరనారీ!
మా కురు ధనుర్థర రమన విలంబన
మతి విధురా సుకుమారీ!`

నదిచెంతనే ఒక నారీమణి స్పృహతప్పి పడి ఉంది చూసుకోమని తోటివారికి సంకేతం ఇస్తున్నాడు. సైనికులకు మాత్రం అది ఒక పాట మాత్రమే!  మహేంద్రుడిని, సత్యానందుడినీ కారాగారంలో నిర్భందించారు. సమీపంలో ఉన్న కొందరు సన్యాసులు సత్యానందుని సంకీర్తన విన్నారు. మహేంద్రుడి బార్యనీ, పిల్లనీ వాళ్ళు విడివిడిగా కనుగొని సురక్షిత ప్రాంతాలకు చేర్చారు.  మరునాడు తెల్లవారేసరికి ఆనందమఠపు సభ్యులందరూ ఏకమై కారాగారం పైన దాడిచేసి ఖైదీలనిద్దరినీ విడిపించారు.

*     *     *

నవల తరువాతి భాగంలో శాంతి కథ వస్తుంది. ఆనందమఠంలో చురుకైన పాత్ర నిర్వహిస్తున్న జీవానందుడి భార్య ఈమె. ఉద్యమం కోసం భార్యని వదిలేసి జీవానందుడు వెళ్ళిపోయాడు. భర్త లక్ష్యానికి అడ్డుతగలకుండా ఉండేందుకు ప్రాణత్యాగం చెయ్యాలనే ఆలోచనలుగల కళ్యాణిలాంటి మహిళ కాదు శాంతి. యుద్ద విద్యలు నేర్చుకొంది. మగవాడిలా వేషం వేసుకొని నేరుగా ఆనందమఠానికి పోయింది. అక్కడే సన్యాసం స్వీకరించి జీవానందుని చెంత చేరిపోయింది. తరువాత సన్యాసులకు ఆంగ్లేయులతో యుద్దం జరిగినప్పుడు చురుకైన పాత్ర పోషించింది.  

*     *     *

కరువు కాలం గడిచింది. వానలు పడ్డాయి. కాని అప్పటికే చాలా మంది ప్రజలు చనిపోయారు. రుపాయికి ఆరణాల వంతు జనాభా కరువు కారణంగా నశించిపోయిందని రచయిత చెపుతాడు. ఇళ్ళల్లో నివశించడానికి, పొలాలు సాగు చెయ్యడానికి సరిపడినంత మంది జనాలు లేక పొలాలు, ఊళ్ళు అడవులుగా మారిపోతున్నాయి. సన్యాసుల ప్రాభవం బాగా పెరిగింది. ఎందరో ఉద్యమంలో చేరుతున్నారు. అంతలో  గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్ కేప్టెన్ దాంసన్ అనే అతడిని సన్యాసుల ఉద్యమాన్ని అణచడానికి నియమించాడు. ఇలా ఉండగా ఒకనాటి రాత్రి పదివేలమంది సన్యాసులు అడవిలో చేరారు.  ఆంగ్లేయ సైనికుల మీద మరునాడు దాడి చెయ్యాలని సన్నాహాలు చేసుకొంటున్నారు. హటాత్తుగా దాంసన్ వారిని ఆన్నివైపులనుంచీ చుట్టుముట్టాడు. మరపిరంగులు, తుపాకులు నిర్దాక్షిణ్యంగా గర్జించాయి. భీకర యుద్దం జరిగింది. ఎందరో సన్యాసులు మరణించారు. కానీ చివరికి విజయం సన్యాసులనే వరించింది.  

సన్యాసులు ఉత్సవాలు చేసుకొంటున్నారు. మహేంద్రుడు పదచిహ్న గ్రామానికి వెళ్ళిపోయాడు. తన భవంతిని కోటగా మార్చాడు. యుద్ద సామాగ్రిని సేకరించి, తయారు చేసి మహేంద్రుడి ఇంటిలోనే ఉంచుతున్నారు. కళ్యాణి బ్రతికి ఉందని మహేంద్రుడికి తెలిసింది. శాంతి చేసిన సహాయం వల్ల కళ్యాణి మహేంద్రుడిని కలుసుకోగలిగింది. సన్యాసులకి ఆంగ్లేయులతో మరో పోరాటం జరిగింది. ఈ సారీ విజయం వందేమాతర నినాదంతో ముందుకు ఉరికిన సన్యాసులదే.

*     *     *

ఆనందమఠం నవలని భారతదేశ చారిత్రక నవలలల్లో అత్యంత ప్రధానమైనదని విమర్శకులు భావిస్తారు. బంకించంద్ర చటర్జీ ఈ నవలని బెంగాలీ్‌లో రాశారు. తరువాత ఇతర భాషలలోనికి అనువదించబడింది. ఈ నవలలో ఉపయోగించిన వందేమాతరం  గీతాన్ని 1896 కాంగ్రెస్ మహాసభల సందర్భంగా రవీంద్రనాథ్ టాగోర్ ఆలపించారట. తరువాత వందేమాతరం ఎంతో ప్రఖ్యాతి చెందింది. స్వాతంత్ర్య సంగ్రామంలో జాతీయవాద నినాదంగా వాడబడింది.  స్వాతంత్ర్యానంతరం భారత జాతీయగేయంగా ప్రభుత్వం వందేమాతరాన్ని స్వీకరించింది. ఆనందమఠం నవల ఆధారంగా విజయవంతమైన హిందీ సినిమా నిర్మించారు. సినిమాలో లతా మంగేష్కర్ పాడిన గీతం ఎంతో బాగుంటుంది. తరువాత చాలా కాలానికి మొన్న మొన్న ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించి పాడిన వందేమాతరం ఎంతగా ప్రజాధరణ పొందిందో మనందరికీ తెలిసిందే కదా?

వందేమాతరం!

© Dantuluri Kishore Varma

No comments:

Post a Comment

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!