Pages

Monday 13 July 2015

గోదావరి మహాపుష్కరం 2015

మహారాష్ట్రాలోని నాసిక్‌కి సమీపంలో త్రయంబకేశ్వరం నుంచి ప్రయాణం మొదలు పెట్టిన గోదావరి 1465 కిలోమీటర్లదూరం ప్రయాణించి బంగాళాఖాతంలో కలుస్తుంది. దారిలో భూముల్ని సస్యశ్యామలం చేస్తుంది, మనసుల్ని పులకరింపజేస్తుంది, ప్రజల్లో భక్తి భావనలని నింపి అధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతుంది. మహారాష్ట్రాలో, తెలంగాణాలో, ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి ప్రవహించే మార్గంలో ఎన్నో అందమైన పల్లెటూళ్ళు ఉన్నాయి, పట్టణాలూ, నగరాలూ ఉన్నాయి, ప్రశిద్ద దేవాలయాలు ఉన్నాయి. కొండకోనల నడుమ ప్రవహిస్తూ గోదావరి నది ఎన్నెన్నో ఒయ్యారాలు పోతుంది. ప్రకృతి శోయగాలతో పరిసరాలను మనోజ్ఞంగా మారుస్తుంది. అందుకే అడవి బాపిరాజుగారు... 

ఉప్పొంగి పోయింది గోదావరి - తాను
తెప్పున్న ఎగసింది గోదావరి
కొండల్లో ఉరికింది
కోనల్లో నిండింది
ఆకాశ గంగతో
హస్తాలు కలిపింది
ఉప్పొంగి పోయింది గోదావరి - తాను
తెప్పున్న ఎగసింది గోదావరి

అడవి చెట్లని
జడలోన తురిమింది
ఊళ్ళ దండలు గుచ్చి
మెళ్ళోన దాల్చింది
ఉప్పొంగి పోయింది గోదావరి - తాను
తెప్పున్న ఎగసింది గోదావరి

వడులలో గర్వాన
నడలలో సుడులలో
పరవళ్ళు తొక్కుతూ
ప్రవహించి వచ్చింది
ఉప్పొంగి పోయింది గోదావరి - తాను
తెప్పున్న ఎగసింది గోదావరి

శంఖాలు పూరించి
కిన్నెర్లు మీటించి
శంకరాభరణ రా
గాలాప కంఠియై
ఉప్పొంగి పోయింది గోదావరి - తాను
తెప్పున్న ఎగసింది గోదావరి

నరమానవుని పనులు
శిరమొగ్గి వణీకాయి
కరమెత్తి దీవించి
కడలికే నడిచింది
ఉప్పొంగి పోయింది గోదావరి - తాను
తెప్పున్న ఎగసింది గోదావరి

... అంటారు

గోదావరి ప్రాంతంలో నివశించే ప్రజలకి ఈ నదీమతల్లితో ఎంత ఆత్మీయత ఉంటుందంటే... అంటే.. దాని గురించి చెప్పడానికి మాటలు చాలవు. ఇంతకీ ఇదంతా ఎందుకు చెపుతున్నానంటే,  పన్నెండేళ్ళకు ఒక్కసారి వచ్చే గోదావరి మహా పుష్కరాలు రేపటి నుంచి మొదలవుతున్నాయి.
ఎక్కడ చూసినా సందడే సందడి. పుష్కర స్నానం యొక్క ఫలితం గురించి, ఈ సమయంలో చెయ్యవలసిన దానాల గురించి పత్రికల్లో, టీవీ చానళ్ళలో విరివిగా ప్రచారం జరిగిందేమో షాపుల దగ్గర దానాలుగా ఇవ్వడానికి కావలసిన వస్తువులు కొనడం కోసం జనాలు ఎగబడుతున్నారు. `గోదానం చెయ్యడం చాలా మంచిదట. మా అమ్మాయి చేస్తానంటే ఆవును కొనడానికి సంతకి వెళ్ళాను. ఒక్కటంటే ఒక్క ఆవు అమ్మకానికి రాలేదు,` అంటున్నాడు ఒకాయన. ఆవుల్ని సంతవరకూ రానివ్వకుండా దొరికిన దగ్గర దొరికినట్టుగా సరాసరి కొనేస్తున్నారట!     

రాజమండ్రీలో పుష్కరఘాట్‌లు నిర్మించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. గోదావరి వొడ్డున ఉన్న పట్టణాలలో, పల్లెటూర్లలో కూడా నదీ స్నానాలకు ఏర్పాట్లు చేశారు. యానంలో చాగంటి కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో పుష్కరుడికి స్వాగతం పలికారు. రాష్ట్రాలు, జిల్లాలు దాటి ఎక్కడెక్కడి నుంచో జనాలు పుష్కర స్నానం కోసం గోదావరి వైపుకు ప్రయాణం మొదలు పెట్టారు. పవిత్ర స్నానాలు చేసి, వెళ్తూ వెళ్తూ కూడా గోదావరి జలాల్ని తీసుకొని వెళ్ళి తమ ప్రాంతంలో కాలువల్లో, చెరువుల్లో కలుపుతారట. అలా చేస్తే పంటలు బాగా పండుతాయని విశ్వాసం. స్వయంగా వెళ్ళి గోదావరి నదిలో స్నానం చెయ్యలేని వాళ్ళకోసం తపాలా శాఖవారు గాడ్‌జల్ పేరుతో ఇరవై రూపాయలకే పుష్కర గోదావరి జలాల్ని అందుబాటులోనికి తెస్తున్నారు.  పుష్కరాలు జరిగే 12 రోజులూ విద్యాసంస్థలకి శెలవులు ఇవ్వాలని విద్యాశాఖామాత్యులు ఉత్తర్వులు ఇచ్చారని ఇప్పుడే ఎవరో అంటున్నారు. కానీ, ఎవ్వరూ ఇంకా శెలవులు ప్రకటించినట్టుగా సమాచారం లేదు.  

శెలవులు ఉన్నా లేకపోయినా పుష్కరస్నానానికి చలో! 

© Dantuluri Kishore Varma  
     

No comments:

Post a Comment

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!