Pages

Friday 23 August 2019

రావిశాస్త్రి కథ వర్షం


రావిశాస్త్రిగా పాఠకులకు సుపరిచితుడైన ప్రముఖ తెలుగు రచయిత శ్రీ రాచకొండ విశ్వనాథశాస్త్రి గారు (1922 - 1993) వ్రాసిన 'వర్షం' కథ గురించి ఓ నాలుగు మాటలు...

కథయొక్క ఇతివృత్తాన్ని ఎంచుకోవడం దగ్గరనుంచి, రచనా శిల్పం వరకూ రచయిత పరిణితి స్పష్టంగా ఈ కథలో కనిపిస్తుంది. ప్రధానపాత్ర పురుషోత్తం, అతని వయసులో సగం కూడా లేని టీకొట్టు కుర్రాడి దృక్పదాలలో వ్యత్యాసం వర్షం నేపధ్యంలో చూపించడం చాలా గొప్పగా ఉంది.

ముఖ్యమైన పనిమీద కలకత్తా వెళ్ళాల్సిన పాతికేళ్ళ పురుషోత్తంని మేనమామ  పెళ్ళిచూపులకి అడవిపాలెం పంపించాడు.  పెళ్ళిచూపుల కార్యక్రమం ముగించుకొని, రెండెడ్ల బండి ఎక్కి రోడ్డు జంక్షన్‌కి వచ్చాడో లేదో   వర్షం మొదలైంది. పురుషోత్తం రైలు అందుకొని సరాసరి కలకత్తాకి పోవాలి.  బస్సు పట్టుకొని రైల్వే స్టేషన్కి పోవలసినవాడు  జంక్షన్ దగ్గర ఉన్న కమ్మలపాక - టీ దుకాణంలోకి దూరిపోయాడు.  రైలు రావడానికి రెండు గంటలు కూడా సమయంలేదు. బస్సు వచ్చే అవకాశం లేదు. పాక బందీఖానాలా ఐపోయింది. ఇనుప ఊచలు దిగ్గొడుతున్నట్టుగా వర్షధారలు చుట్టూ దిగుతున్నాయి. కలకత్తా వెళ్ళాల్సిన పని ఎంత ముఖ్యమైనదైనా ధైర్యం చేసి స్టేషన్ వరకూ నడిచి పోలేడు.   ఒంటరిగా పోతే ప్రమాదమనీ, వర్షంలో తడిస్తే న్యుమోనియా రావచ్చనీ... ఇంకా అలాంటి చాలా భయాలమధ్య పెరిగిన అర్భకుడు పురుషోత్తం.  ఆత్మవిశ్వాసం ఏమాత్రం లేనివాడు.

మరోవైపు టీ దుకాణం నడిపే తాత, పన్నెండేళ్ళ వయసుకూడా లేని  మనవడిని వర్షం మొదలవడానికి ముందే బొగ్గులకోసం రెండుమైళ్ళ దూరంలో ఉన్న రైలుగేటు దగ్గరకి పంపించాడు. వాడు కుర్రోడికోసం  ఆందోళన పడాలి. కానీ,  పురుషోత్తంతో  'కుర్రోడే కానీ శండశాసమ్ముండాకొడుకులే. వొరసవేనన్న మాటేటి, దిమదిమలాడుతూ ఏనుగులు దిగేసినా నెక్కసెయ్డు'  అంటున్నాడు ధీమాగా.

టీ పాక దగ్గర గంటకు పైగా కూర్చున్నాడు పురుషోత్తం. ఏళ్ళూ ఊళ్ళూ ఏకమయ్యేటట్టు కురుస్తుంది వర్షం. రోడ్డంతా నీటితో ఏటికాలవలా ఉంది. సరిగ్గా అప్పుడు కనిపించాడు దూరంనుంచి రేసుకుక్కలా పాకవైపు వసున్న కుర్రోడు. నీటిమీద బోటులా, చెట్లను చీల్చుకొని బాటవేసుకొంటూ.. పరుగెత్తి, పరుగెత్తి పాకలోకి విరుచుకు పడ్డాడు.

అరనిమిషంలో జుట్టునుంచి నీటిని నొక్కేసి, బట్టలనుంచి నీటిని పిండేసి ఆ పాకలో పొడిగా గెంతులు వేసేడు. వర్షంలో దారిలో చస్తే ఏమిచేస్తావురా? అని అడిగిన తాతకి వర్షాన్ని 'సంపిడిసిపెడతా' అని చెప్పిన కుర్రోడి నిర్భయత్వానికి పురుషోత్తం పాకలో పాతుకుపోయినట్టు నిశ్చలుడైపోయాడు.

కుర్రాడిలో ఉన్నది, తనలో లేనిది ఏమిటో అర్ధమయ్యింది. అప్పటికే మసక చీకటి పడుతుంది. పురుషోత్తం తిన్నగా సూటిగా, ఈదురుగాలికెదురుగా, వర్షాన్ని సరుకుచెయ్యకుండా చకచకా ముందుకి పోయాడు. 'సెబాసా' అనుకొన్నాడు తాత.

2018లో విశాలాంధ్రా పబ్లిషింగ్ హౌస్ వాళ్ళు తెచ్చిన శత వసంతాల తెలుగు కథ అనే సంకలనంలో రావిశాస్త్రి గారి ఈ కథని చేర్చారు.

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!