Pages

Sunday 25 February 2018

శ్రీవారి మెట్టు మార్గంలో తిరుమల కొండపైకి...

శ్రీవారి దర్శనం కోసం తిరుమల కొండపైకి నడకదారిలో వెళ్ళాలనుకొనే భక్తులకు రెండు మార్గాలు ఉన్నాయి. మొదటిది ఎప్పటినుంచో భక్తులు ఉపయోగిస్తున్న అలిపిరిమెట్టు మార్గం. రెండవది ఈ మధ్యకాలంలో క్రమంగా ప్రాచుర్యాన్ని పొందుతున్న దగ్గర దారి -  శ్రీవారిమెట్టు.  

మొన్న, 2018 జనవరి నెలలో మేము శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కొండపైకి వెళ్ళాం. `ఏ దారిలో కొండపైకి వెళ్ళాలి? శ్రీవారి మెట్టు మార్గం సౌకర్యంగా ఉంటుందా? `వంటి సందేహాలు చాలా మందికి ఉన్నాయి. ఈ మార్గానికి సంబంధించి పూర్తి సమాచారం కూడా అందుబాటులో లేదు. అందుకే, నేను తెలుసుకొన్నంత వరకూ సమాచారాన్ని ఫోటోలతో కలిపి ఇస్తే ఎవరికైనా ఉపయోగపడుతుందని ఇది వ్రాస్తున్నాను.

తిరుపతి నుంచి (రైల్వే స్టేషన్/బస్‌స్టాండ్) శ్రీవారిమెట్టుకు సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. దేవస్థానం వారి ఉచిత బస్సులు ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. కానీ, అవి సాధారణంగా రద్దీగా ఉండడం వల్ల లగేజీతో వాటిలో ప్రయాణం కొంచెం కష్టం. ఆర్టీసీ వాళ్ళ లైను బస్సుల్లో కానీ, అద్దె  వాహనాల్లో కానీ వెళ్ళవచ్చు. తిరుపతి ట్రాఫిక్ పోలీసు వారు ఏర్పాటు చేసిన టేక్సీ కౌంటర్ రైల్వే స్టేషన్ దగ్గరే ఉంది. మా బృందంలో ఏడుగురి సభ్యులకీ సరిపోయే విధంగా ఒక జీపుని 750 రూపాయలకి మాట్లాడుకొన్నం. దారిలో శ్రీనివాస మంగాపురం చూపించి, శ్రీవారి మెట్టు దగ్గర దించే ఏర్పాటు చేసుకొన్నాం.  ఇదే మార్గంలో తిరుపతి జూపార్క్ కూడా తగులుతుంది. సమయాభావం వల్ల మేము అక్కడ ఆగలేదు. 
ప్రయివేట్ వాహనాలని పై ఫోటోలో కనిపిస్తున్న స్టాప్ బోర్డ్ వరకే అనుమతిస్తారు. నేరుగా లగేజ్ కౌంటర్ వరకూ అనుమతించరు. కాబట్టి ఇక్కడి నుంచి కొంతదూరంలో ఉన్న కౌంటర్‌కి మన సామాన్లని మనమే మోసుకొని వెళ్ళాలి.  నడకదారి ద్వారా తిరుమలకి వెళ్ళే భక్తుల కోసం దేవస్థానం వాళ్ళు కొన్ని సౌలభ్యాలని కలుగజేశారు. అవి - ఉచిత బస్సు, సామాన్లని ఉచితంగా కొండపైకి చేరవెయ్యడం, శ్రీవారి దివ్య దర్శనం, ఉచితంగా లడ్డూప్రసాదం మొదలైనవి. శ్రీవారిమెట్టు మార్గం స్వయంగా వేంకటేశ్వరుడు తిరుమలకు నడచి వెళ్ళిన దారి అట. అందువల్లనే పాదరక్షలతో వెళ్ళవద్దని ప్రారంభంలోనే బోర్డులు పెట్టారు.  చెప్పుల్ని కూడా ఓ సంచిలో పెట్టుకొని లగేజీతో పాటూ పైకి పంపే ఏర్పాటు చేసుకోవాలి. తాళాలు వేసిన బ్యాగ్లని, సూట్కేసులని మాత్రమే తీసుకొంటారు. వాటిని స్కాన్ చేస్తారు. ఏవైనా విలువైన వస్తువులూ, డబ్బూ, శ్రీవారి ముడుపులూ వగైరా ఉంటే తీసివేయమని సూచిస్తారు.  

అలిపిరిమెట్టు దారికంటే శ్రీవారిమెట్టు మార్గంలో నడక తేలికగా ఉంటుంది. ఎందుకంటే, అలిపిరి మార్గం క్రిందనుంచి కొండపైకి తొమ్మిది కిలోమీటర్ల దూరం, 3550 మెట్లు ఎక్కాలి. కానీ శ్రీవారి మెట్టు మార్గం కేవలం 3 కిలోమీటర్ల దూరం, 2388 మెట్లు. 


కాలినడక భక్తులకు ప్రతిరోజూ 20వేల దివ్యదర్శనం టిక్కెట్లు జారీ చేస్తారు. వీటిలో 14వేల టిక్కెట్లు అలిపిరి మార్గంద్వారా వెళ్ళేవారికీ, మిగిలిన ఆరువేల టిక్కెట్లూ శ్రీవారిమెట్లు మార్గంలో వెళ్ళేవాళ్ళకీ ఇస్తారు. భద్రతా కారణాల రీత్యా శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులని ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5.30 నిమిషాల వరకూ మాత్రమే అనుమతిస్తారు. ఉదయం ఆరు గంటల నుంచి టిక్కెట్లు జారీచెయ్యడం మొదలుపెట్టి, ఆరువేల వరకూ ఇస్తారు. ఈ కోటా పూర్తయిన తరువాత నడిచి వెళ్ళిన వారు కూడా సర్వదర్శనం భక్తులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవాలి. 
సుమారు 1250వ మెట్టు దగ్గర దివ్యదర్శనం టిక్కెట్లు ఇచ్చే కౌంటర్ ఉంది.
దివ్యదర్శనం టిక్కెటు
ఈ టిక్కెట్టు ఉన్న భక్తులకి శ్రీవారి దర్శనంకోసం ప్రత్యేక సమయాన్ని కేటాయిస్తారు. దర్శనం తొందరగా అవుతుంది. ఒక లడ్డూని ఉచితంగా ఇస్తారు. అధనంగా కావాలంటే మరో రెండింటిని ఒక్కొక్కటీ పది రూపాయలకు తీసుకోవచ్చు. ఇంకొక రెండు కూడా కావాలంటే వాటిలో ఒక్కొక్కటికీ 25 రూపాయలకు పొందవచ్చు. అంటే ఉచిత లడ్డూ కాకుండా అధనంగా నాలుగింటిని 70 రూపాయలకు తీసుకోగలం.
ఇచ్చిన టిక్కెట్ పైన మళ్ళి 2050వ మెట్టు దగ్గర ఉన్న మరొక కౌంటర్‌లో స్టేంప్ వేస్తారు. 
ఎనిమిది వందల మెట్ల వరకూ పెద్దగా అలసట తెలియకుండా వెళ్ళిపోవచ్చు. అక్కడినుంచి కొండపైకి ఏటవాలుగా ఎత్తు పెరుగుతుంది. దర్శనం టిక్కెట్లు చేతికి వచ్చేంత వరకూ వేగంగా వెళ్ళినా... ఆ తరువాత విశ్రాంతి తీసుకొంటూ, తీరుబడిగా నడచి వెళ్ళవచ్చు. వెంట చిన్న తేలిక బ్యాగ్‌లో మంచి నీళ్ళు, టీ, స్నాక్స్, అత్యవసరమైన మందులు లాంటివి తీసుకొని వెళితే మంచిది. 

ఎండనుంచి, వర్షాన్నుంచి రక్షణ ఇవ్వడం కోసం దారంతా తొంభై శాతం వరకూ షేల్టర్లు నిర్మించారు. ప్రతీ యాభై మెట్లకూ ఒక్కో మంచినీటి ట్యాప్ ఉంది. మరుగుదొడ్ల సౌకర్యం ఉంది. చిరువ్యాపారులు ఏర్పాటు చేసిన చిన్న చిన్న తాత్కాలిక అంగళ్ళు ఉన్నాయి. నిమ్మసోడాలు, మజ్జిగ, కూల్‌డ్రింకులు, బిస్కెట్లు లాంటివి... పిడతకింద పప్పూ, ఉడికించిన పల్లీలూ అమ్ముతున్నారు.   


మంచి వాతావరణంలో, ఉదయాన్నే బయలుదేరితే ఆహ్లాదకరమైన పరిసరాలనీ, ప్రకృతినీ ఆస్వాదిస్తూ, గోవింద నామ స్మరణ చేసుకొంటూ, ఫోటోలు తీసుకొంటూ, సత్కాలక్షేపంతో తిరుమల చేరవచ్చు. ఈ ప్రయాణం చక్కని అనుభూతిని ఇస్తుంది. 


కాకపోతే అలిపిరి మార్గం ద్వారా వెళ్ళినప్పుడు కనిపించే జింకల పార్కు, ఆంజనేయస్వామి విగ్రహం, గాలిగోపురం, దశావతారాల విగ్రహాలు, ఏడుకొండలను తెలియజేసే బోర్డులూ, రోడ్డు మార్గంలో(అలిపిరి మార్గంలో కొంతదూరం రోడ్డుపైన నడాలి) జలపాత దారలు (వర్షాకాలంలో మాత్రమే)... శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళేటప్పుడు మిస్సవుతాం.
చివరి మెట్టు మీద ఒక వ్యక్తి కర్పూరం బిళ్లల్ని పెద్ద బస్తాలో వేసుకొని అమ్ముతూ కనిపిస్తాడు. ఒక్కొక్కటీ పదేసి చొప్పున కొనుక్కొని, వెలిగించి వేంకటేశ్వర స్వామిని మనసులో ధ్యానించుకొని ముందుకు కదలడమే.
పైకి వెళ్ళిన తరువాత లగేజీ కౌంటర్‌లో మన బ్యాగేజ్ తీసుకొని తిన్నగా మనం ఏర్పాటు చేసుకొన్న  కాటేజీకో, రూంకో వెళ్ళిపోవడమే.

గోవిందా...గోవింద!
© Dantuluri Kishore Varma

Thursday 1 February 2018

చంద్రగిరి కోట

తిరుపతి పట్టణానికి సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రగ్రిగి వెళ్ళేసరికి సాయంత్రం ఐదున్నర అయిపోయింది. రాతితో కట్టిన కోటగోడలు, ప్రవేశద్వార మండపాలు, రహదారికి కొంచెం ఎడంగా ఉన్న పురాతన దేవాలయాల గోపురాలు చూసుకొంటు రాజమహల్ దగ్గరకి చేరుకొన్నాం.  అప్పటికే సందర్శకులని అనుమతించే సమయం దాటిపోవడంతో గేట్లు మూసేస్తున్నారు. `చాలాదూరంనుంచి వచ్చామని, అనుమతించమని కోరడంతో,` ఏమనుకొన్నారో, `తొందరగా చూసి వచ్చేయండి` అని గేట్లు తెరిచారు. కృతజ్ఞతలు చెప్పి లోనికి వెళ్ళాం.



ఎప్పుడో పదకొండవ శతాబ్ధంలో నిర్మించిన కోట. శత్రుదుర్భేద్యంగా ఉండడం కోసం కొండవాలులో కట్టారు. అర్థచంద్రాకారపు కొండ కోటకు మూడువైపులా పెట్టని గోడలా ఉంది. రాజమహల్, రాణీమహల్, వాటి నడుమ ఉద్యానవనం, చిన్న నీటి కొలను, రాణీమహల్‌కి సమీపంలో దిగుడు మెట్లున్న మంచినీటి బావి... కొండమీదనుంచు వస్తున్న చల్లని సాయంత్రపు గాలి ఆహ్లాదంగా ఉంది. 

రాజమహలులో కవితాగోష్టులు, యుద్దతంత్రాలు, రహస్యమంతనాలు, మంత్రిమండలి సమావేశాలు జరిగేవేమో. రాణీమహల్ గవాక్షాలనుంచి యువరాణులు బయటకు చూస్తూ ఏమి పాటలు పాడుకొనేవారో, చెలికత్తెలతో కలిసి మహలులో చప్టాలమీద ఏమి ఆటలు ఆడుకొనేవారో, వేటకు వెళ్ళిన రాజుగారు చీకట్లు ముసురుకొంటున్న సాయంత్రం - రాత్రిగా మారుతున్నా రాకపోతే మహారాణులు దిగుళ్ళను ఎవరితో పంచుకొనేవారో!  

సాళువ నరసింహరాయలు ఈ ప్రాంతాన్ని పరిపాలించాడట. శ్రీకృష్ణదేవరాయలు కొంతకాలం ఈ కోటలో ఉన్నాడని చెపుతారు. తన ఇద్దరు భార్యలలో ఒకరైన చిన్నమదేవిని చంద్రగిరిలోనే కలిశాడట. విజయనగర రాజులు పెనుగొండను రాజదానిగా చేసుకొని పరిపాలిస్తున్న కాలంలో, గోల్కొండ నవాబుల దండయాత్ర కారణంగా విజయనగర రాజదానిని పెనుగొండ నుంచి చంద్రగిరికి మార్చారట. తరువాత చంద్రగిరి మైసూర్ పాలకుల ఆధీనంలో కూడా ఉంది.   

ప్రస్తుతం రాజమహల్‌లో ఆర్క్యలాజికల్ మ్యూజియం ఉంది. మేము వెళ్ళినరోజు శుక్రవారం కావడంతో మ్యూజియంకు శలవు. కానీ సాయంత్రం ఆరున్నర గంటలనుంచి, ఏడుగంటల పదిహేను నిమిషాల వరకూ - ముప్పావుగంట సేపు ప్రదర్శించే మ్యూజిక్ అండ్ లైట్ షో ఉంది. ఈ షో చూడడానికి పెద్దలకు టిక్కెట్టు అరవై రూపాయలు. పిల్లలకు నలభై ఐదు.  `నేను చంద్రగిరి కోట అంతరాత్మను...` అని మొదలు పెట్టిన గంభీరమైన స్వరం చంద్రగిరి చరిత్రను చక్కటి రూపకంలా వివరించి చెపుతుంది. ఈ షో చూసినవాళ్ళకి నిస్సందేహంగా  మంచి అనుభూతికి కలిగిస్తుంది.  

ఎవరైనా తిరుపతి వెళ్ళినప్పుడు ఒకపూట కేటాయించగలిగితే చంద్రగిరి కోటను చూడవచ్చు.

 © Dantuluri Kishore Varma   

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!