Pages

Monday, 2 March 2020

ద స్కూల్ అమాంగ్ పైన్స్

బడికి వెళ్ళడం అంటే - చాలామందికి ఇంటి ముందో, రోడ్డు జంక్షన్‌లోనో వాహనం ఎక్కి పాఠశాల ముందు దిగడం, కొద్ది మందికి ఓ అరకిలోమీటరో, కిలోమీటరో నడిచి వెళ్ళడం. అలా వెళ్ళగలిగిన వాళ్ళు అందరూ అదృష్టవంతులు. రస్కిన్‌బాండ్ రాసిన 'ద స్కూల్ అమాంగ్ ద పైన్స్' అనే కథలో మాత్రం ఇట్లాంటి అదృష్టవంతులైన విద్యార్థులు మనకు కనిపించరు.  

కోలీ అనే చిన్న ఊరిలో ఐదవ తరగతి దాకా చదువుకొన్న బీనాని, అక్కడికి ఐదారు మైళ్ళ దూరంలో ఉన్న నౌటీ అనే ఊరిలో హైస్కూల్లో వేశారు. ఆమెకి తోడుగా ఉంటాడని ఆమె తమ్ముడు సోనూని కూడా చేర్చారు. అంతకు ముందునుంచే నౌటీ స్కూల్‌లో చదువుతున్న బీనా వయసే ఉన్న వాళ్ళ ఊరి కుర్రాడు ప్రకాష్ వాళ్ళతో పాటూ బడికి నడచి వెళుతుండగా కథ ప్రారంభమౌతుంది.


ఉత్తరాఖండ్‌లో ఉన్న చిన్న చిన్న ఊళ్ళు ఇవి. ఊరికి ముప్పై నలభై గడపలు ఉంటాయి. ఓ చిన్న కిరాణా కొట్టు ఉండొచ్చు. ప్రజలు ప్రధానంగా వ్యవసాయం చేసుకొంటారు. పిల్లలు పొలం పనుల్లో, ఇంటిపనుల్లో పెద్దవాళ్ళకి సహాయం చేసి,  వాగునుంచి మంచినీళ్ళు తెచ్చి, పశువులకి గడ్డి కోసి, వేసి, బడికి మైళ్ళకొద్దీ నడచి పోయి చదువుకొంటారు. ఎన్నో కాలిబాటలు కొండల ప్రక్కనుంచి, పొలాల మధ్యనుంచి, అడవుల గుండా, వాగుల్లోకి దిగి-ఎక్కి వైకుంఠపాళీ ఆటలో పాముల్లా మెలితిరిగి పోతుంటాయి.  దారిలో అడవి జంతువులు, పాములు ఎదురు పడొచ్చు, కొండచరియలు విరిగి పడతాయి,  వాగులు పొంగుతాయి, వాగు దాటినప్పుడు జలగలు పట్టుకొంటాయి, కుంభవృష్ఠి వర్షాలు కురుస్తాయి.  బడికి వెళ్ళి రావడం అంటే పెద్ద సాహసం చెయ్యడమే.


ఇప్పుడు మళ్ళీ కథలోకి వద్దాం. పిల్లలు  ఎత్తైన పైన్ చెట్ల మధ్యన ఉన్న బడి దగ్గరకి వచ్చేసరికి అంతా హడావుడిగా ఉంది. మాథ్స్ టీచర్ మణి కనిపించడంలేదు. గత కొంతకాలంగా ఊరిలో కుక్కల్నీ, మేకల్నీ చంపి తీసుకుపోతున్న చిరుత ఈ సారి మణిసార్‌ని తీసుకుపోయి ఉంటుందని అంతా అనుకొంటున్నారు. కాని అదృష్టవశాత్తూ అలా జరగలేదు. ఏదో పనిమీద వెళ్ళిన మతిమరుపు మణి మాష్టారు అడవిలో దారి తప్పిపోయి మధ్యాహ్నానికల్లా క్షేమంగా తిరిగి వచ్చేశాడు .



బీనా తరగతిని కొత్తగా అపాయింట్ అయిన మిస్ తానియా రమోలా అనే టీచరుకి ఇచ్చారు. ఆమె పైతరగతి విద్యార్థులకంటే కొంచెం పెద్దదానిలా ఉంది. టీచర్ అందమైన చేతులు చూసి 'ఈమె ఎప్పుడూ పొలం పని చేసి ఉండదు, ఆవులకి పాలు పితికి ఉండదు' అనుకొంటుంది బీనా. సాధారణంగా పిల్లలు తమని టీచర్‌తో పోల్చి చూసుకొంటారు కదా?  

సాయంత్రం పిల్లలు ముగ్గురూ బడినుంచి ఇంటికి వెళుతుండగా ఎదురు వచ్చిన పాలవాడు - ఉదయం వాగు దగ్గర చిరుతని చూశాననీ, తొందరగా ఇంటికి వెళ్ళిపొమ్మనీ - వాళ్ళని హెచ్చరించాడు.  అడవులు నరికేయడం వల్ల, కార్చిచ్చుల వల్ల, ఆనకట్టలు లాంటివి నిర్మిస్తూ ఉండడం వల్ల అడవిలో జంతువులు జనావాసాల్లోకి వచ్చేస్తూ ఉంటాయి.


రోజులు గడుస్తున్నాయి. ముళ్ళ పందులు మణిసార్ పెరటిలో బంగాళాదుంపల పంటని రోజూ రాత్రి వచ్చి తినేసి పోతున్నాయి.  రాత్రంతా కాపలా కూర్చొని, ముళ్ళపందుల అలికిడి అయినప్పుడల్లా టార్చ్‌లైటూ, దుడ్డుకర్రా పట్టుకొని తోటలోకి వెళ్ళేసరికి ఒక్క పందీ కనిపించడం లేదు. ఇలాగే కనుక కొనసాగితే ఒక్క దుంపా మిగలదని మణి మాష్టారు దిగులు పడి కూర్చోవడంతో, హెడ్‌మాస్టర్ అనుమతి తీసుకొని పిల్లలంతా మాష్టారి తోటచుట్టూ చిన్న కందకం తవ్వి, దగ్గరలో ఉన్న వాగునుంచి నీటిని అందులోకి మళ్ళించారు.  'ముళ్ళపందులకి నీళ్ళంటే పడదని' ప్రకాష్ చెప్పిన మాట నిజమయ్యింది. పందులు మళ్ళీ మాష్టారి పెరడులోకి రావడం మానేసాయి.

మార్చ్ - ఏప్రిల్ నెలలు వచ్చేసరికి కొండవాలులు అన్నీ రకరకాలు రంగురంగుల అందమైన పువ్వులతో నిండిపోయాయి. క్రమంగా పగళ్ళూ, రాత్రులూ వేడేక్కాయి. జూన్ మాసం ప్రవేశించడంతో కొండలు బూడిద కొట్టుకుపోయినట్టు బొగులెత్తిపోయాయి. అడవిలో కార్చిచ్చు రగులుకొని స్కూల్ చుట్టుప్రక్కలంతా వ్యాపించడంతో మూడురోజులపాటు ఎవరూ బడికి పోలేకపోయారు.

జూన్ చివరికల్లా ఋతుపవనాలు ప్రవేశించాయి. పెద్దపెద్ద చినుకులతో వచ్చిన తొలకరి వాన అద్భుతమైన మట్టివాసనను వెదజల్లింది. ప్రకృతికి ప్రాణం వచ్చినట్టయ్యింది. పక్షులు, పంటలు, కొండలు, చెట్లు, ఆకులు... ఆన్నీ కొత్తశొభను సంతరించుకొన్నాయి. పిల్లలు పెద్దవాళ్ళకి చిక్కుళ్ళు, జొన్నలు, దోస పంటలు నాటుకోవడంలో సహాయం చేస్తున్నారు. వర్షాలవల్ల కొండల్లో నీటిదారలు జలపాతాల్లా మారిపోయాయి. చీలమండలోతు వాగులు మోకాటి లోతయ్యాయి. కప్పల బెకబెకలు మొదలయ్యయి. హిమాలయాల దిగువ ప్రాంతంలో వర్షాకాలం మూడునెలలు ఉంటుంది. మేఘాలతో, వర్షంతో, మంచుతో తడిసి ముద్దవుతుంది.

ఒకసారి సమీపంలో నిర్మాణంలో ఉన్న, దేశంలోనే అతి పెద్దదైన తెహ్రీ డ్యాం చూపించడానికి విద్యార్థులని తీసుకొని వెళతారు. డ్యాం కట్టడం వల్ల కలిగే లాభనష్టాల గురించి, పర్యావరణానికి జరిగే హాని గురించి ఉపాద్యాయుల మధ్య వాదన జరుగుతుంది.


ఓ రోజు కొండచరియలు విరిగి పెద్ద చప్పుడుతో దొర్లుకొంటూ, అడ్డుగా ఉన్న వృక్షాలని, పొదలని నుజ్జు నుజ్జు చేసుకొంటూ వాళ్ళ కాలిబాటకి అడ్డంగా పడిపోవడంతో నిశ్చేష్ఠులైపోతారు. బడికి వెళ్ళే దారి మూసుకుపోయింది. ప్రకాష్  కొండతిరిగి వచ్చే కొత్త  దారిని కనిపెట్టడంతో బడికి ఎక్కువ రోజులు మానెయ్యవలసిన అవసరం తప్పింది. ఈ దారి చల్లగా ఉంది. కానీ, ఒక మైలు దూరం ఎక్కువ. వాళ్ళకు తెలియని విషయం ఏమిటంటే - చిరుత సంచరించే ప్రాంతానికి ఈ బాట మరీ దగ్గరగా ఉంది.

ఓ రోజు    ప్రకాష్, బీనా, సోనూ స్కూలుకి వెళుతున్నారు. వాళ్ళ కంటే ముందు గెంతులేస్తూ పోతున్న ప్రకాష్ పెంపుడు కుక్క, తోక ముడుచుకొని వెనక్కి పరిగెత్తి వచ్చేసింది. కాలిబాటకి అడ్దంగా చిరుతపులి వాళ్ళను చూసి ఆగిపోయింది.  చిరుత బలిష్టంగా ఉంది. గుర్రు మనే శబ్దం దాని గొంతులోనుంచి వెలువడింది. మీదకి గెంతడానికి తయారుగా ఉన్నట్టు అనిపిస్తుంది. ముగ్గురికీ భయంతో కాళ్ళు కదలడంలేదు, మాట పెగలడంలేదు, గుండె భయంకరంగా కొట్టుకొంటుంది. కొన్ని సెకండ్ల కాలం వాళ్ళ కళ్ళలోకి సూటిగా చూసింది. పిల్లలకి లానే అది కూడా మనుష్యులకి ఎదురుపడడం అనే సందర్భం ఊహించి ఉండకపోవచ్చు.   కొన్ని క్షణాలు... తన దారిలో నిశ్సబ్ధంగా నడిచి పోయి, పైన్ వృక్షాలతో నిండిన అడవిలోకి  వెళ్ళిపోయింది.

పాటలుపాడుకొంటూ, కబుర్లు చెప్పుకొంటూ, ప్రకాష్ వేణువు ఊదుతుంటే వింటూ... రోజూ బడికి పోయి వస్తున్నారు. ఒక రోజు ఒక లేడి అరుపు విని వేటకోసం అటువైపు చిరుత పరుగు తీస్తుండగా, పిల్లలు బడికి వెళుతున్న అలికిడి అయ్యింది. చిరుత ఆగింది. వాళ్ళు దాటిన తరువాత తన వేటని కొనసాగించింది.   మ్యాన్ ఈటర్లు కాని పులులు సాధారణంగా మనుష్యులకు హాని చెయ్యవట. వాటి ప్రధానమైన వేట జింకల్లాంటి అడవి జంతువులే.

కొన్నిరోజుల తరువాత ప్రక్కకొండ శిఖరాన రెండు పిల్లలతో పాటూ ఉన్న చిరుతను చూసారు. కానీ అది వాళ్ళనేమీ పట్టించుకొన్నట్టు లేదు. 'మనం ఉన్నట్టు దానికి తెలుసు. హాని చెయ్యమని కూడా తెలుసు,' అంటాడు ప్రకాష్. 'డ్యాం కట్టేసినా మనుష్యులూ, జంతువులూ కలసి జీవించడానికి కావలసినంత ప్రదేశం ఇంకా మిగిలే ఉంటుంది' అంటాడు.

కొన్ని రోజులకి ల్యాండ్ స్లైడ్ మట్టినీ, కొండచరియల్నీ తొలగించి మార్గాన్ని పునరుద్ధరించారు. పిల్లలు ఇప్పుడు పాత దారిలోనే బడికి పోతున్నారు.      

                                *      *       *

ఇలాంటి కథలు చదవడంవల్ల భారతదేశపు భౌగోళిక వైవిద్యం గురించీ, ప్రజల జీవన విధానాల గురించీ తెలుస్తుంది. బడికి వెళ్ళి రావడం అనే అలసటను వదిలించుకోవడానికంటూ స్మార్ట్ ఫోన్లు, టీవీలతో కాలక్షేపం చేసే యువతకి - తల్లితండ్రులకి సహాయం చేసి, మైళ్ళ దూరం ప్రమాదాల మార్గంలో బడికి పోయి వచ్చే పిల్లలు దేశానికి ఆ చివర ఉన్నారని తెలిస్తే కొంత సహానుభూతి చెందుతారేమో! తమ దృక్పదంలో మెరుగైన మార్పు తెచ్చుకొంటారేమో. సాహిత్యం మనుష్యులకి చేసే మేలు అదే కదా?

                               *      *       *


(ఈ కథ రస్కిన్ బాండ్ రాసిన 'గ్రేట్ స్టోరీస్ ఫర్ చిల్డ్రెన్' అనే సంకలనంలో ఉంది. రూపా పబ్లికేషన్స్ వాళ్ళు వేశారు. ఆన్‌లైన్ బుక్‌సెల్లర్స్ దగ్గర దొరకవచ్చు. లేదంటే      ఎనీబుక్స్ అనే ఆప్‌లో ప్రయత్నించండి.)

Images used here are for illustrative purpose only.

Dantuluri Kishore Varma

Sunday, 15 December 2019

కెన్ యూ డిఫైన్ ఫ్రెండ్షిప్?

ఎనిమిదో తరగతి వరకూ మా వూరి బడిలో చదివించేసి, తొమ్మిదికి వచ్చేసరికి కాకినాడ జగన్నాథపురంలో పెద్ద స్కూలు - ఎం.ఎస్.ఎన్ చారిటీస్‌లో చేర్పించే సరికి పిల్లకాలువలోనుంచి సముద్రంలో పడినట్టు అయిపోయింది. ఇది ఎప్పుడో 1983 నాటి సంగతి. 'ఏ' సెక్షన్లో సుమారు అరవై డబ్బై మందిలో నేనొకడిని. ఈ సెక్షన్ కాక ఆ తరగతికి మరో మూడు సెక్షన్లు ఉండేవి. నాలుగు సెక్షన్లలోనూ ఉన్న రెండువందల పై చిలుకు మందలో తొంబై శాతం మంది ఒకటో తరగతి నుంచీ జిగినీ దోస్తులు. బాగా చదివే వాళ్ళు,  చదవని వాళ్ళు, అల్లరోళ్ళు,  క్రికెట్ బ్యాచ్ వాళ్ళు, ఎన్.సి.సి వాళ్ళు, పలానా మాష్టారి ట్యూషన్‌వాళ్ళు... అంటూ రకరకాల బ్యాచ్‌లు ఉండేవి.  

కొత్తగా చేరిన కుర్రోళ్ళకి ఏ బ్యాచ్‌కి చెందినవాళ్ళమో తెలిసేసరికి అయోమయంలో కొన్ని నెలలు గడిచి పోయాయి. మెల్లమెల్లగా జతగాళ్ళు కుదిరారు. తూరంగి నుంచి నడుచుకొంటూ బయలుదేరి, గరువులకి అడ్డుపడి, ఆంధ్రా పోలిటెక్నిక్ వెనుక గోడ పగులులోంచి జొరబడి, సైకిల్‌స్టాండ్ గోడ ఎక్కి, చారిటీస్‌లోకి దూకేసరికి స్కూల్‌కి వెళ్ళడం అనే ప్రక్రియ పూర్తయ్యేది. చదివో, చదవకో రోజులు గడచిపోయాయి. 

85లో టెంత్ పూర్తయ్యాకా రాతిమీద పగలగొట్టిన కుండ పెంకుల్లా కుర్రాళ్ళంతా ఎక్కడెక్కడికో చెదిరిపోయారు. ముప్పై సంవత్సరాలు గడిచి పోయాయి. 2015లో ఎదో ఒక బుర్రలోకి మళ్ళీ అందరం కలిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది. అసలు ఎక్కడెక్కడి వాళ్ళవో వివరాలు సేకరించడం సాధ్యమేనా!? కలవడం కుదురుతుందా?   

కొన్ని గట్టి పిండాలు రాత్రనక పగలనకా కష్టపడ్డాయి. 2015లో రీ యూనియన్ జరిగింది. 2017లో రెండవసారి, 2019లో - ఈ రోజు మూడవసారి మిత్రుల సమ్మేళణం జరిగింది. 
ఖమ్మం, బెంగలూరు, హైదరాబాద్, విశాఖపట్నాలనుంచి, ఇంకా దూరంనుంచి చాలామంది మిత్రులు రెక్కలు కట్టుకొని వచ్చారు. మాట్లాడ గలిగినవాళ్ళు చిన్నప్పటి జ్ఞాపకాలు పంచుకొంటే, మిగిలినవాళ్ళు చప్పట్లతో జ్ఞాపకాల పరిమళాలని ఆస్వాదించారు. భుజాలమీద చేతులు వేసుకొని 'ఒరేయ్' అని ఆత్మీయంగా పలుకరించుకొన్నారు. నా మిత్రులు ఇంతమంది ఉన్నారన్న సంతోషం ప్రతీ ఒక్కరి ముఖంలోనూ కనిపించింది. ఆ సంతోషం ముందు దూరబారాలు, వ్యయప్రయాసలు పెద్ద లెక్కలోనివి కాదు కదా?  

ఈ సమ్మేళనాన్ని చక్కగా నిర్వహించిన మిత్రులందరికీ అభినందనలు.
ఫ్రెండ్‌షిప్ అంటే-
క్యాంటీన్లలో కూర్చొని
లవ్ ఇంటరెస్టుల గురించి
లవ్ ఫెయిల్యూర్ల గురించి
గంటలకొద్దీ కబుర్లు చెప్పుకోవడమా?
ఒక్కడి దగ్గరే డబ్బులుటే
మిగిలిన అందరూకలిసి లాగేసుకొని
ట్రీట్ చేసేసుకొని
ఏడుపొక్కటే తక్కువైన ఫ్రెండునిచూసి
ఆనందంగా ఆటపట్టించడమా?
కష్టమొస్తే నేనున్నాను
అని గోడలా నిలబడి
కాన్‌ఫిడెన్స్ ఇవ్వడమా?
తప్పుదారిలో పోతుంటే
చెయ్యిపట్టుకొని మంచిదారిలోకి
నడిపించడమా?
కలిసి సినిమాలు
పరీక్షలముందు కంబైండ్‌స్టడీలూనా?
కెన్ యూ డిఫైన్ ఫ్రెండ్షిప్?

Tuesday, 3 December 2019

కోతల సమయం

జిల్లాలో వరి పండించే రైతులకు ప్రస్తుతం తొలకరి పంట చేతికివచ్చే కాలం. కోతలు పూర్తైపోయాయి. కొన్ని చోట్ల చేలు పనలమీద ఉన్నాయి - అంటే కోసిన వరిమొక్కలని కంకులతోపాటూ చెమ్మ లాగడానికి మడి లోనే మూడు నాలుగు రోజులు ఆరబెడతారు. పనమీద ఉన్న సమయంలో దురదృష్టవశాత్తూ వర్షం కానీ వస్తే రైతు సీజన్ అంతా పడిన కష్టం నీటి పాలైనట్టే.     
వ్యవసాయ పనులకి రోజు కూలి ఈ సంవత్సరం వెయ్యి దాటిందట. దాంతో రైతులు 'వ్యవసాయం ఏమీ కిట్టుబాటు అవడం లేదు' అని గగ్గోలు పెడుతున్నారు. కోతల యంత్రాలు వచ్చిన తరువాత పనిలో వేగం పెరిగింది. ఒకటి రెండు గంటల్లోనే ఒక ఎకరం కోత పూర్తయిపోతుంది. పైగా కూలీలతో చేయించు కొన్న దాని కన్నా తక్కువ ఖర్చు. కాబట్టి పెద్ద కమతాల వాళ్ళు యంత్రాలతో పని కానిచ్చేస్తున్నారు. ఒకటి రెండు ఎకరాలు ఉన్న సన్నకారు రైతులు మాత్రం పాత పద్ధతులే కొనసాగిస్తున్నారు.  
పనలు ఆరిన తరువాత కళ్ళం దగ్గరకి చేరవేసి, నూర్పుళ్ళు చేస్తారు.  కొన్నిచోట్ల ఏటవాలు బల్ల మీద మోది దాన్యపు గింజల్ని వేరు చేసే పద్ధతి ఉంది. కానీ - గోదావరి జిల్లాల్లో మాత్రం కుప్పనూర్పుళ్ళే.  పనలని కళ్ళంలో పరచి రెండెడ్ల బండితో కానీ, ట్రాక్టరుతో కానీ తొక్కిస్తారు. దీనికంటే సులువైన ఏర్పాటు ఇంకొకటి ఉంది - పనల్ని ట్రాఫిక్ బాగా ఉన్న తారురోడ్డు మీదో, సిమెంటురోడ్డు మీదో పారెయ్యడమే. పైసా ఆయిల్ ఖర్చు కానీ, ట్రాక్టరు కిరాయి కానీ లేకుండా పని కానిచ్చేయొచ్చు. వాహనదారులు ఎంత ఇబ్బంది పడినా నష్టం ఏమీ లేదు! 

ఈ పని పూర్తయిన తరువాత దాన్యం - దూగర, పొట్టుతో ఉంటుంది. వాటిని వేరు చెయ్యడానికి ఎగరబోస్తారు. దాన్యాన్ని చేటలలోకి ఎత్తి, గాలి వాలు చూసుకొని, ఎత్తునుంచి చేట ప్రక్కఅంచు మీదుగా జాలువారుస్తారు. ఇలా చెయ్యడం వల్ల గాలికి పొట్టూ, దూగరా దూరంగా ఎగిరిపోయి, దాన్యం నేరుగా క్రింద గుట్ట పడుతుంది.  

తరువాత దాన్యాన్ని కొన్నిరోజులు ఆరబెట్టుకొని, కొలిచి గోనె సంచుల్లోకి నింపి, ట్రాక్టరు మీదో, బండి మీదో ఇంటికి లేదా మిల్లుకి పంపేస్తారు. నూర్చిన తరువాత మిగిలిన వరి గడ్డిని మేటు వేసి, సంవత్సరం పొడవునా పసువులకి గ్రాసంగా వాడతారు. 





వ్యవసాయం ప్రధాన వ్యాపకంగా ఉండే కుటుంబాలలో పుట్టి, పెరిగిన కారణంగా నలభై సంవత్సరాల వయసు దాటిన చాలామందికి ఈ విషయాలు అన్నీ బాగా తెలిసినవే. కానీ తరువాత క్రమంగా చదువులకోసం, ఉద్యోగాలకోసం పట్టణాలకీ, విదేశాలకీ వెళ్ళిపోయిన కుటుంబాలలో పిల్లలకి ఇల్లూ, బడీ తప్ప మరోప్రపంచం లేకుండా పోయింది. 'మనం తినే బియ్యం ఏ ఫ్యాక్టరీలో తయారు చేస్తారు?' అని అడుగుతున్న తరం తయారయింది. వాళ్ళు కుతూహలం కొద్దీ తెలుసుకోవాలి అనుకొంటే ఏమైనా ఉపయోగ పడుతుందేమో అని ఈ టపా వ్రాస్తున్నాను.   


                   

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!