Pages

Tuesday 6 May 2014

ఎన్నికలు

రాజకీయ సందడి పెద్ద ఎత్తున మొదలైపోయింది. జనాల్లోకి వెళ్ళడం, సభలు ఏర్పాటుచేసుకోవడం, జనాలని సమీకరించుకోవడం, మేం ఇది చేశాం అది చేశాం అని చెవుల్లో ఇల్లు కట్టుకొని చెప్పడం, వాగ్ధానాలు గుప్పించడం, కరపత్రాలు పంచడం, పేపర్ పబ్లిసిటీ, మీడియా ప్రోపగాండా... రాజకీయపార్టీలు ఓట్లకోసం ఎన్ని చెయ్యాలి! ఏ విధానం అవలంభించినా వోటరుని మనం చెప్పింది వినేటంత వరకూ ఓపికగా కూర్చో బెట్టాలి. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జనరేషన్ వోటర్లు 50శాతం కంటే ఎక్కువగా ఉన్నారు. మన రాష్ట్రంలో సుమారు ఆరుకోట్ల ముప్పై లక్షల మంది ఓటర్లు ఉంటే వాళ్ళల్లో మూడున్నర కోట్ల మంది యువతే నట.  వీళ్ళని ఆకర్షించాలంటే పాత పద్దతుల అవలంభన ఒక్కటే సరిపోదు. వాళ్ళు ఏ మాధ్యమంలో అందుబాటులో ఉంటారో అక్కడే వాళ్ళకు చెప్పాలి. పాతపద్ధతులనే పట్టుకొని వ్రేలాడకుండా అలా మార్పు చెందగలిగిన స్మార్ట్ అభ్యర్థులకే విజయావకాశాలు ఉంటాయని విజ్ఞులు చెపుతున్నారు. లక్షలకోట్ల రూపాయలు వెచ్చించినా జరగనంత ప్రచారాన్ని ఇప్పటికే సొంతంచేసుకొన్న మోడి గారిని చూడండి! యువత పల్స్‌ని  ఎప్పుడో అవగాహన చేసుకొని ఫేస్‌బుక్, ట్విట్టర్లు లాంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో ఒక హవాని సృస్టించుకొన్నారు. 

ఇక్కడ ఇలా ఉదహరించడం ఆయన రాజకీయ విధానాలు మంచివా, చెడ్డవా అని తర్కించడానికి కాదు. చురుకుగా ఆలోచించి కాలానికి అనుగుణంగా మారగలిగిన వాళ్ళకి విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయని చెప్పడానికి మాత్రమే. రాజకీయాల్లోనే కాదు, ఎక్కడైనా సరే మార్పు ఒక్కటే శాశ్వతం. కాబట్టి మంచివైపు, అభివృద్దివైపు ప్రస్థానంకోసం మారగలిగిన వాడే విజేత.

*     *     *
ఓ వైపు వోటరు గెలుపు అవకాశాలున్న అభ్యర్థులవైపు మొగ్గుచూపుతున్నాడు.

అడవిలో అందాల కథానాయిక కోసం పట్టణం నుంచి వెళ్ళిన కథానాయకుడు టార్జాన్‌లా ఉండే అడవిమనిషితో పోటీకి దిగవలసి వస్తుంది. వాడిని ఓడిస్తేనే పిల్ల దక్కుతుంది. ఎలా ఓడించాడు అనేది ముఖ్యంకాదు - కాలులాగో, కన్నుపొడిచో విజయాన్ని దక్కించుకోవలసిందే! కథానాయకుడు ఖచ్చితంగా గెలవాలని ప్రేక్షకులు కోరుకొంటారు. దానికోసం టార్జాన్ కళ్ళల్లో హీరో కారం కొడితే ఈలలు వేసి సమర్ధిస్తారు. ఎందుకంటే హీరోలో తమనితాము ఐడింటిఫై చేసుకొంటారు కనుక.  ఎలాగోలా హీరోయిన్ గెలిచినవాడికి దక్కితే మనకీ దక్కినట్టే అన్నంత ఆనందపడిపోతాడు. ఆమెని గెలుచుకోవడానికి  ఏమిచేసినా పరవాలేదనే దృక్పదం!

రాజకీయం కూడా అలాగే తయారయినట్లుంది. సీట్లకేటాయింపుకోసం కోట్లరూపాయలు చేతులు మారుతున్నాయని, వేలకోట్లలో అవినీతికి పాల్పడ్డారని ప్రత్యర్థులు ఒకరిమీద ఒకరు ఆరోపణలు చేసుకోంటున్నారు. వేలల్లో మాత్రమే సంపాదన ఉన్న సామన్యుడు అన్ని వేలకోట్లలో ఎన్ని వేలు ఉంటాయో అని ఆశ్చర్యపోవడం మానేసి, అదేదో సామాన్యమైన విషయంలా భావిస్తున్నాడు. గెలుపు అంచనాలు రోజురోజుకూ మారిపోతున్నాయి. విజయావకాశాలు ఎటువైపు ఉంటే అటువైపుకు వలసలు జరుగుతున్నాయి. కార్యకర్తలుకూడా పోలోమని తమ నాయకులవెంటే పార్టీపిరాయింపులు చేస్తున్నారు. రోడ్డునపోయే దానయ్యని ఆపి `మీ నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఎందుకు అలా అనుకొంటున్నావు?` అని అడిగితే `పాలానా వాడు. ఎండుకంటే బాగా ఖర్చుపెట్టే దమ్ముంది,` అని చెపుతున్నాడు. మనిషి దృక్పదంలో ఎంత మార్పు వచ్చింది! అవినీతి అనే మాటకి చలించడం మానేశాడు. పైపెచ్చు పరుగుపందెం లాంటి ఆటని ఆస్వాదిస్తున్నాడు. గెలుపే ప్రధానం. అది ఎలా దక్కినా సరే! గెలిచినవాడే హీరో!  వాడి ప్రక్కన మనం ఉంటే, మనమూ విజేతలమే.

*     *     *
ఇలాంటి పరిస్థితుల్లో గెలుపుని నిర్ణయించేది వేసిన వోట్లు కాదు, వెయ్యని వోట్లే!

ఎన్నికల సమయంలో ప్రత్యర్థిమీద బురద జల్లడం తప్పించి గెలిచి తాను చెయ్యబోయే ప్రజా సంక్షేమ పనులు ఏమీటో చెప్పే ప్రబుద్దుడు ఎక్కడా కనిపించడంలేదు. అలాగని వాగ్ధానాలేవీ చెయ్యడం లేదని కాదు. చేసే ప్రతీ వాగ్ధానం వెనుకా ఓటుబ్యాంక్ రాజకీయమే ఉంటుంది. అధికారం అంతిమ లక్ష్యం. దానికోసం ఎన్ని పన్నాగాలయినా పన్నవచ్చు. చూసి, చూసి సామాన్యుడికి ఒక్కోసారి ఎన్నికలలో పోటీచేసే ఏ అభ్యర్ధీ సరయిన వాడిలా తోచడం లేదు. నిరాసక్తత వాళ్ళని ఓటింగ్‌కి దూరంచేస్తుంది. చాలా చోట్ల ఓటింగ్ శాతం తక్కువగా ఉండడానికి కారణం ఇదే. కానీ, ఓటువెయ్యకపోతే  రాను, రానూ ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడవచ్చు. అలా జరగకుండా ఉండాలంటే ఓటుహక్కు కలిగిఉన్న ప్రతీ ఒక్కరూ తమ హక్కును వినియోగించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఇప్పుడిప్పుడే వోటరుగా నమోదయిన యువత తాము వేసే ఓటుతో రాజకీయాల్లో అభిలషణీయమైన మార్పు తీసుకొని రావడానికి వోటింగ్ కేంద్రాలవైపు అడుగులు వెయ్యాలి.

ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టులాంటి ఓటుహక్కుని వినియోగించుకోవాలని అప్పుడే ప్రశ్నించే హక్కు ఉంటుందని అధికారులు ప్రకటనలు ఇచ్చి ఓటర్లను ఉత్సాహపరుస్తున్నారు. వీటికితోడు సెలబ్రిటీలు, ప్రయివేట్ సంస్థలు, ఎన్జీవోలు ప్రజలకి ఓటింగ్ మీద సదావగాహన కల్పించడానికి ప్లెడ్జ్ టు వోట్ కేంపయిన్‌లు చేస్తూ తమవంతు సామాజిక బాధ్యతని నిర్వర్తిస్తున్నారు. ఇందులో భాగంగా గూగుల్ ఇండియా వాళ్ళు చేసిన ఒక వీడియో చాలా ఇన్స్పయరింగా ఉంది. శ్యాం శరణ్ నెగీ అనే ఒక 97 సంవత్సరాల వృద్దుడి గురించి ఆ వీడియో. ఈయన స్వాతంత్ర్యభారతదేశపు మొట్టమొదటి ఓటరట. 1951లో తన ముప్పైనాలుగవ ఏట ఓటువేసింది మొదలు ఇప్పటివరకూ ఏ ఎన్నికలలోనూ తన హక్కును వినియోగించుకోకుండా లేడట! చలైనా, వానయినా, అడుగు బయటపెట్టలేని మంచయినా తన ధర్మాన్ని నిర్వర్తించాడట.

వీడియో మీరుకూడా చూడండి.

*     *     * 

ఎక్కడిదాకానో ఎందుకు మనకు దగ్గరలోఉన్న ఈ ఉదాహరణ చూడండి.

హోప్ ఐలాండ్ కాకినాడ సముద్రతీరానికి తుర్పువైపు 15 కిలోమీటర్లదూరంలో ఉంది. ఎప్పుడో రెండువేల సంవత్సరాల క్రితం గోదావరినది బంగాళాఖాతంలోనికి తీసుకొని వెళ్ళిన ఇసుక మేటల వల్ల హోప్ ఐలాండ్ ఏర్పడిందని చెపుతారు. సుమారు పదహారు కిలోమీటర్ల పొడవు, ఒక కిలోమీటరు వెడల్పుతో ఒక చిన్న ద్వీపంలా ఉంటుంది ఇది. కాకినాడ సముద్రతీరం నుంచి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. హోప్ ఐలాండ్ కాకినాడకి ఒక వరంలాంటిదని చెప్పుకోవచ్చు. సముద్రంవైపునుంచి వచ్చే తుఫానులు, ఉప్పెనలు, సునామీలనుంచి పట్టణాన్ని రక్షణగోడలా ఉండి రక్షిస్తుంది. 

కొన్ని దశాబ్దాలక్రితం నుంచీ చిన్న చిన్న గుడిసెలు వేసుకొని కొన్ని మత్యకార కుటుంబాలు ఇక్కడ నివశిస్తున్నాయి. వాళ్ళకు కరెంట్ ఉండదు. పిల్లలకి పాఠశాలలు ఉండవు. వైద్యానికి ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలు ఉండవు. సూపర్‌బజార్లు, షాపింగ్ మాల్సు ఉండవు. రవాణాకి నాటుపడవలు తప్ప మరేమీ ఉండవు. కానీ ఓ రెండువందల యాభై నుంచి మూడువందల యాభై  మందికి  వోటుహక్కు ఉంది. వోటుహక్కు వినియోగించుకోవడానికి  హోప్ ఐలాండ్ వాసులు తాళ్ళరేవు దగ్గర ఉన్న చిన్నబొడ్డు వెంకటాయపాలెం అనే ఊరికి వెళ్ళాలి. ఇది ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంది. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనికి వస్తుంది. వోటర్లు హోప్ఐలాండ్ నుంచి నాటుపడవలు ఎక్కి రెండుగంటలు ప్రయాణం చేసి కాకినాడ తీరం చేరాలి. అక్కడినుంచి ఆటోలో, ప్రయివేటు బస్సులో పట్టుకొని వాళ్ళ పోలింగ్ స్టేషన్‌కి వెళ్ళాలి. ఆడ, మగ, ముసలి, ముతక అందరూ ఈ అవస్థలు అన్నీ పడితే కానీ వోటు వెయ్యడం సాధ్యం కాదు. ఇన్ని సమస్యలున్నా వాళ్ళు వోటు వెయ్యడానికి వస్తారు. 

పైన శ్యాం శరణ్ నెగీ గురించి, ఆయన వోటు హక్కుని వినియోగించుకొనే నిబద్ధత గురించి చదివాం. హోప్ఐలాండ్ వాసుల గురించీ చదివాం. మనకీ ఓటు ఉంటుంది, నడిచి వెళ్ళేటంత దగ్గరలో పోలింగ్ కేంద్రం ఉంటుంది. కానీ, ఏవో కారణాలవల్ల అత్యంత ప్రధానమైన ఈ హక్కుని వినియోగించుకోం! కాకినాడ అర్బన్ నియోజకవర్గంలో ఇప్పటివరకూ 1,73,980 మంది ఓటర్లు ఉన్నారు. మొన్న నిర్వహించిన ఓటరు నమోదు కార్యక్రమంలో కాకినాడనగర నియోజకవర్గంలో ఉన్న 213 పోలింగ్‌బూత్‌లలో నేరుగా అయితేనేమీ, ఆన్‌లైన్‌లో అయితేనేమి కొత్తగా ధరకాస్తు చేసుకొని వోటుహక్కును పొందిన వాళ్ళతో కలిపి ఈ సంఖ్య రెండులక్షలకి చేరిందట. వీరిలో యువకులే ఎక్కువ. కనుక ఈ సారి అభ్యర్థుల ఎంపికలో విప్లవాత్మకమైన వొరవడి ఉంటుందని భావించవచ్చు.

ఎవరో చెప్పినట్టు రాజ్యాధికారాన్ని నిర్ణయించేది వేసిన వోట్లు కాదు, వెయ్యని వోట్లే! రేపు సీమాంధ్రలో జరగబోతున్న ఎన్నికల్లో మన వోటు వేద్దాం!

© Dantuluri Kishore Varma

No comments:

Post a Comment

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!