Pages

Thursday 13 November 2014

కమనీయ కల్పన

`ఇంగ్లాండ్‌లో షేక్‌స్పియర్ పేరున ప్రతీసంవత్సరం సాహితీ పండుగలు నిర్వహిస్తారు. మనదేశంలో కూడా కాళిదాసు పేరుమీద అటువంటివి జరపవచ్చు కదా?` అని ఒకాయన సందేహాన్ని వెలిబుచ్చాడు. కాళిదాసుని ది షేక్‌స్పియర్ ఆఫ్ ఇండియా అంటారుగానీ, షేక్‌స్పియర్‌నే ది కాళిదాసా ఆఫ్ ఇంగ్లాండ్ అనాలని కూడా అభిప్రాయపడ్డాడు. అతని వాదనలో  పూర్తి న్యాయం ఉంది. షేక్‌స్పియర్ క్రీస్తుశకం పదహారో శతాభ్దానికి చెందినవాడు; కాళిదాసు క్రీస్తుపూర్వం వాడని చాల మంది అంటారు - షేక్‌స్పియర్ కంటే చాలా పూర్వంవాడు. సంస్కృతంలో అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్నిమిత్రం, విక్రమోర్వశీయం అనే అద్భుతమైన నాటకాలు రచించాడు. రఘువంశం, కుమారసంభవం, ఋతుసంహారం, మేఘదూతం అనే కావ్యాలు రాశాడు. ఉపయోగించిన భాష, వాడిన అలంకారాలు, కథను నడిపించే విధానం, ప్రకృతి వర్ణనలు అనన్యసామాన్యం అని విజ్ఞులు అంటారు. ఆయన కవికులగురువుగా ప్రశిద్దుడు. సంస్కృతం ప్రపంచభాషగా ఉండి ఉంటే కాళిదాసుకి విశ్వకవి చక్రవర్తిగా ఖ్యాతి వచ్చి ఉండేదేమో!

ఈ మధ్యన మేఘదూతం చదవగలిగిన అవకాసం నాకు వచ్చింది.

Painting by Vasudeo Kamath
చిత్రకారుల ఊహలకి రెక్కలు తొడగగలిగిన పదాల అల్లిక కాళిదాసు సొంతం. నీకెలా తెలుసు అంటారేమో! మేఘదూతం - దీనినే మేఘసందేశం అనికూడా అంటారు - కావ్యంలో కథానాయకుడు ఒక యక్షుడు. అలకాధిపతి కుబేరుని కొలువులో ఉద్యోగి. యక్షుని భార్య అతిలోకసౌందర్యవతి. ఆమె ద్యాసలో పడి కుబేరుడు చెప్పిన పనిని యక్షుడు అలక్ష్యం చేస్తాడు. దానితో కోపగించిన కుబేరుడు యక్షుడికి ఒక సంవత్సరం పాటు దేశబహిష్కారం విదిస్తాడు. కథాప్రారంభానికి ఆతని బహిష్కరణ శిక్షలో ఎనిమిది నెలల కాలం గడుస్తుంది. యక్షుడు సీతారామలక్ష్మణులు వనవాసం సమయంలో గడిపిన చిత్రకూట పర్వతం దగ్గర ఉంటాడు. అది ఆషాడమాసం ప్రారంభం. ఒక నల్లని వర్షమేఘం రామగిరిమీద నిలిచి ఉంటుంది. `మేఘమాశ్లిష్టసానుం` అంటే సానువుని కౌగలించుకొన్న మేఘం `కంఠాశ్లేషప్రణయిని` అంటే ఆతని కంఠం చుట్టూ తామరతూడుల్లమంటి చేతులతో పెనవేసిన ప్రణయిని ఆలింగనం జ్ఞాపకం చేస్తుంది. మేఘుడు యక్షుడికి దంతాలతో రాళ్ళను పైకి వెదజల్లుతున్న మత్త గజంలా కనిపిస్తున్నప్పటికీ ఆతనిని సమీపించి తన భార్య అయిన యక్షిణికి రాయబారం తీసుకొని వెళ్ళవలసిందిగా కోరతాడు. ఈ సన్నివేశ వర్ణనకి వాసుదేవ కామత్ అనే చిత్రకారుడు గీసిన చిత్రాన్ని చూడండి. ఈయన లాగే ఇంకా చాలామంది చిత్రకారులు కాళిదాసు కవితలకి బొమ్మలు గీశారు.

జపాన్‌లో తొమోమీ శాటో అనే ఆవిడ సంస్కృతం నేర్చుకొని మేఘదూతంలో శ్లోకాలను చక్కగా పైకి చదివింది. ఇంగ్లీష్‌లో ఇంకా జపానీస్‌లో వివరణ రాసింది. మేఘుడు ప్రయాణించబోయే దారిలో అగుపించబోయే ఎన్నో ప్రకృతి అందాల్ని యక్షుడు వర్ణిస్తాడు. శిరీష పుష్పాలు ఎలా వుంటాయి? మాధవీ లతలు!? పోనీ దేవదారు వృక్షాలు!!?  చిత్రకూట పర్వత ప్రాంతంలో ఉండే పువ్వుల గురించి కాళిదాసు చేసిన వర్ణనలకి తొమోమీ బొమ్మలు గీసింది. వాటన్నింటినీ తన బ్లాగ్‌లో ఉంచింది. కావాలంటే ఇక్కడ చూడండి.

కాళిదాసు కమనీయ కల్పనల్ని ఆస్వాదించడానికి సంస్కృతం నేర్చుకోలేం. ఇంగ్లీషులోకో, తెలుగులోనికో అనువదించిన రచనలతోనే సంతృప్తి చెందవలసిందే. మేఘదూతంలో ప్రతీ పద్యాన్నీ తెలుగు లిపిలో రాసి, వివరణ ఇచ్చిన, ప్రతీ పదానికీ అర్థాన్ని చెప్పిన పుస్తకం ఒకటి అదృష్టవశాత్తూ నాకు దొరికింది. `ప్రతీ పుస్తకమ్మీదా చదవగలిగే ప్రాప్తమున్నవాడి పేరు రాసి ఉంటుందని,` ఎవరో తమాషాకి చెప్పినట్టు ఈ పాత పుస్తకమ్మీద నా పేరు కూడా రాసి ఉందేమో! ఇది చదివి కాళిదాసు కవిత్వంతో ప్రేమలో పడిపోయా.  వాసుదేవ్ కామత్‌లా బొమ్మలు వెయ్యలేకపోయినా, తొమోమీ శాటోలా సంస్కృతం నేర్చుకొనే వోపిక లేకపోయినా కాళిదాసు కమనీయ కవితా కల్పనల్లో చిక్కుకోకుండా ఉండలేం.  

© Dantuluri Kishore  Varma 

2 comments:

  1. nice narration......great....really very impressing narration.................venkatesh kolakani,hyd

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు వెంకటేష్‌గారు.

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!