Pages

Wednesday 13 February 2013

చేపలు దొరకాల, జేబులు నిండాల

హైలెస్సా, హైలెస్సా అని పాట పాడుతుంటే వినేవాళ్ళకి పిల్ల కెరటాల మీద చల్లగా వెళుతున్న పడవ ఊపు అనుభూతి కొస్తుంది. ఒడ్డునుండి ఆస్వాదిస్తే అది ఆహ్లాదం కలిగించే జానపదం, కనిపించని ఒడ్డుని, దూరంగా ఉన్న ఇంటిని, ఎంతకీ గడవని కాలాన్ని అనుభవిస్తూ పాడుకొంటే అది జీవన పధం.
హైలెస్సా అని పాడే మత్యకారుల పాటల్లో  విరహం అంతర్లీనంగా ఉంటుందని ఎవరో అంటారు. ఎన్నిరోజులయ్యిందో ప్రియురాలినో, ఇల్లాలినో విడిచి వచ్చి! తనకు తెలిసున్న నావ, తెరచాప, తెడ్డు, సముద్రం, ఆకాశం అనే నాలుగయిదు మాటలూ ఉపయోగించి బాధనంతా వెళ్ళబొసుకొంటారు. జంట పడవలుగా సాగాల్సిన జీవితం పొట్ట కూటి కోసం ఒంటి పడవలా అయిపోయింది. ముసలితల్లి ఎలా ఉందో అని బెంగ, చిన్ని కూతురిని చూడాలనే తహతహ. పొద్దెప్పుడు పోతుందో? వల ఎప్పుడు బరువెక్కుతుందో?? 
ఇంటికి దూరంగా ఉన్నప్పుడు కలిగే విషాదాన్ని హకిల్ బరీ ఫిన్ నవలలో ఒక సన్నివేశం ద్వారా మార్క్ ట్వెయిన్ మనసు పిండేలా చూపిస్తాడు. హక్, జిం ఇద్దరూ లాంచీలో నదిమీద వెళుతూ ఉంటారు. అప్పుడు, జింకి తన కూతురు జ్ఞాపకం వస్తుంది. ఒకరోజు జిం ఇంటిదగ్గర ఉన్నప్పుడు ఏదో పుస్తకం చదువుకొంటూ ఉంటాడు. కూతురు దగ్గరకి వస్తుంది. ఏదో పని పురమాయిస్తాడు. ఆమె కదలకుండా, నవ్వుతూ తండ్రి వైపు చూస్తూ నిలబడి ఉంటుంది. తన మాటని లక్ష్య పెట్ట లేదని కోపంతో ఆ అమ్మాయి చెంప మీద కొడతాడు. అప్పుడే గాలికి వెనుక ఉన్న తలుపు పెద్ద చప్పుడుతో మూసుకొంటుంది. కానీ,ఆమె ఏమీ గమనించదు. జింకి కూతురి వినికిడి శక్తి మీద అనుమానం వస్తుంది. చెక్ చేస్తాడు. అతని సందేహం నిజమే ఆమెకి ఏమీ వినిపించడం లేదు. కొన్నిరోజులకి ముందు వచ్చిన తీవ్రమైన జ్వరం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని తెలుసుకొంటాడు. క్షణికావేశంలో చిన్నిపిల్ల అని కూడా చూడకుండా కొట్టినందుకు, ఆమెని గుండెలకి హత్తుకొని వెక్కి వెక్కి ఏడుస్తాడు. లాంచీ మీద తన సహచరుడు హక్ కి ఈ సందర్భాన్ని చెపుతూ కన్నీరు మున్నీరవుతాడు. చదువుతున్న మనకి కూడా గుండె బరువెక్కుతుంది. 
ఎండ, మంచు, చలి, వర్షం ఏమయినా పడవ వేటకి వెళ్ళవలసిందే. కడలి ఎప్పుడూ గంగమ్మ తల్లే! కానీ, నడి సముద్రంలో ఉన్నప్పుడు చెప్పకుండా వచ్చే తుఫాను, ఉప్పెనలు బ్రతుకు నావను ఏ ఒడ్డుకు చేరుస్తాయో! ఈదురుగాలులు, చిరుజల్లులు తుఫాను హెచ్చరికల్ని చేస్తుంటే సాయంత్రానికి తిరిగి రావలసిన నావలకోసం ఇంటిల్లిపాదీ గుండెలు అరచేత పట్టుకొని ఎంతగా ఎదురు చూస్తారో!  
అలాగని అప్పుడప్పుడూ వచ్చే కష్టాలని భయపడి బంగారం లాంటి మత్యసంపదని ఒదిలి పెట్టుకొంటారా? ఎప్పటికీ కాదు! వలనిండి, వొడ్డుమీదకి చేరిస్తే పంటపండినట్టే. 
రకరకాల చేపలు. వాటిని అన్నింటిని ముందుగా వేరు చేసుకోవాలి. అప్పుడప్పుడు అరుదుగా లభించే రకాలు దొరికాయంటే ఎగబడి కొనుక్కొని వెళ్ళే జనాలు మార్కెట్‌లో ఎప్పుడూ ఉంటారు. రూపాయలతో జేబు నిండవలసిందే. 
కాకినాడలో సముద్ర తీరం ఉన్నందువల్ల, బీచ్‌కి వెళ్ళినప్పుడు కనిపించే మత్యకార జీవన విధానం ఫొటోలలో బంధించి మనకాకినాడలో బ్లాగ్ మిత్రులకోసం ఇలా అందిస్తున్నాను.

© Dantuluri Kishore Varma 

No comments:

Post a Comment

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!