Pages

Friday 15 November 2013

కామన్ మేన్

ఆర్.కే.లక్ష్మణ్ మరొక్కసారి వార్తల్లోకి వచ్చారు. 
*     *     *
ఒకవేళ ఎవరికైనా ఆయన ఎవరో తెలియకపోతే, కామన్ మేన్ పేరు చెపితే గుర్తు పట్టవచ్చు. టైంస్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్లో 1951 నుంచి లక్ష్మణ్ గీస్తున్న కార్టూన్ స్ట్రిప్‌లో కేరక్టర్ అది. బట్టతల, గుండ్రటి కళ్ళజోడు, పెద్దముక్కు, టూత్‌బ్రష్ కుచ్చులాంటి మీసం, గళ్ళకోటూ, పంచ, సాక్సులు లేని బూట్లు, నిశ్చేష్టుడైనట్టు ముఖకవళికలు ఉండే సాధారణమైన మనిషి. కామన్‌మేన్ నోరు తెరిచి ఎప్పుడూ మాట్లాడింది లేదు. ధరలు పెరిగినా, రాజకీయకుంభకోణం జరిగినా, కొత్తగా ప్రభుత్వవిధానాలు ఏమైనా ప్రకటించినా, ప్రజలు సివిక్‌సెన్స్ లేకుండా ప్రవర్తించినా.. ఆయా సంఘటనలలో ప్రత్యక్షసాక్షిగా ఉంటాడు. అర్ధశతాబ్ధం పైనుంచి `యూ సెడ్ ఇట్` పేరుమీద ఈ కార్టూన్ వస్తున్నా ఎప్పుడూ జనాలకి విసుగు పుట్టలేదు. పూనాలో, ముంబాయ్‌లో  కామన్ మేన్‌కి విగ్రహాలు కట్టారు. ఇది ఒక అరుదైన విషయం.

ఆర్.కే.లక్ష్మణ్ నిజజీవితంలో చాలా సీరియస్‌గా ఉంటాడట. ఆయనని నవ్వించడం చాలా కష్టం అని చెపుతుంటారు. కానీ చాలా సున్నితమైన స్వభావం ఉన్నవాడట. ఒకసారి ముంబాయ్ యూనివర్సిటీలో గౌరవడాక్టరేట్ ప్రధానం జరుగుతున్నప్పుడు, అప్పటి రాష్ట్రపతి అబ్ధుల్ కలాం గారు లక్ష్మణ్‌ని హృదయానికి హత్తుకొన్నారట. వెంటనే, లక్ష్మణ్ కళ్ళవెంట బొటబొటా నీళ్ళు కారాయి. `మీ కార్టూన్లతో మమ్మల్ని అందరినీ నవ్విస్తారు, మీరు కన్నీళ్ళు పెట్టుకొంటున్నారే,` అని కలాం చమత్కారమాడారట.

చిన్నప్పుడు పుస్తకాలమీద, చిత్తుకాగితాలమీద, గోడలమీద ఎక్కడపడితే అక్కడ బొమ్మలు వేసేవాడట. గది కిటికీలోనుంచి బయటకి చూస్తు, కనిపించే కాకులని గియ్యడం అలవాటయ్యింది. లక్ష్మణ్ కాకుల్ని చాలా అందంగా గీస్తాడు. ఒక ఇంటర్వ్యూలో లక్ష్మన్ భార్య కమల వాళ్ళదగ్గర ఒక మర్డర్ ఆఫ్ క్రోస్ వున్నాయని చెప్పారు. ఇంగ్లీష్‌లో కాకుల సమూహాన్ని తెలిపే కలెక్టివ్ నౌన్ ని మర్డర్ అంటారని అప్పుడే తెలిసింది.

ముంబాయిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో జేరడానికి లక్ష్మణ్ చిన్నప్పుడు ధరకాస్తు చేసుకొంటే, `నువ్వు పనికిరావు పో!` అన్నారట. ఏం చేస్తాడు? తనంతట తనే నేర్చుకొన్నాడు. అన్నగారు ఆర్.కే.నారాయణ్ గొప్ప కథా, నవలా రచయిత. లక్ష్మణ్‌కి 12సంవత్సరాలు ఉన్నప్పుడు హిందూ న్యూస్‌పేపర్లో నారాయణ్ రాసే కథలు అప్పుడప్పుడే అచ్చవుతూ ఉండేవి. వాటికి లక్ష్మణ్ బొమ్మలు గీస్తే ఒక్కోదానికి రెండురూపాయల ఎనిమిది అణాలు పారితోషికం ఇచ్చేవారట.

ఎక్కువకాలం ఒకే న్యూస్‌పేపర్లో పనిచెయ్యడం చాలా అరుదు. ఆవిషయం గురించి ద హిందూ పేపర్‌వాళ్ళు ఒక చక్కనిమాట అన్నారు. `Rasipuram Krishnaswamy Laxman has been synonymous with the Times of India ever since your grandfather was a child`  అని. 
*     *     *
ఇంతకీ ఆయన మళ్ళీ ఎందుకు వార్తల్లోకి వచ్చాడూ అంటే.. టైంస్ ఆఫ్ ఇండియా ప్రారంభించి నూటడెబ్బయ్ఐదు సంవత్సరాలు అయిన సందర్భంగా భారత తపాలా శాఖ ఒక కమెమొరేటివ్ స్టాంప్‌ని విడుదల చేసింది. అది ఆర్.కే.లక్ష్మణ్  గీసిన కామన్‌మేన్. 
 

© Dantuluri Kishore Varma

12 comments:

  1. Replies
    1. ధన్యవాదాలు ప్రసాద్‌రావుగారు.

      Delete
  2. Replies
    1. ధన్యవాదాలు స్పురితగారు.

      Delete
  3. బాగుందండి మంచి పోస్ట్

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు రాధికగారు.

      Delete
  4. మీరు ఏదైనా ప్రత్యేకంగా చెప్పటములో దిట్ట,

    ReplyDelete
    Replies
    1. నిజంగా ప్రత్యేకత ఉందో లేదోగానీ, మీరు అలా చెపుతుంటే బాగానే ఉన్నట్టుంది :) చాలా చాలా ధన్యవాదాలు మెరాజ్‌గారు.

      Delete
  5. ఆ stamp pic చూసాను కాని, దీని వెనకాల ఇంత పెద్ద స్టొరీ ఉందని తెలియదు, tnx for the info...

    {{ ఇంత మంచి పోస్ట్ ఎలా మిస్ అయ్యనో... :( }}

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు సంతు గారు.

      Delete
  6. విలువైన పరిచయం . ధన్యవాదములు కిషోర్ వర్మ గారు . ఇలాంటి సమయంలో మళ్ళీ ఈ విషయం చెప్పుకోవడం మరింత విలువైనదిగా ఉంది . RIP

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు వనజ గారూ.

      కామన్‌మేన్ ఒక లెజండరీ క్రియేషన్! అర్కే లక్ష్మణ్ నిష్క్రమణతో ఇక కామన్‌మేన్ కనిపించడు.

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!